రాష్ట్రంలో భారీ వర్షాలు.. మత్తడి దుంకుతున్న చెరువులు

by  |
రాష్ట్రంలో భారీ వర్షాలు.. మత్తడి దుంకుతున్న చెరువులు
X

దిశ, న్యూస్‌బ్యూరో: రాష్ట్రం తడిసిముద్దయింది. మంగళవారం దాదాపు అన్నిజిల్లాల్లో వర్షం కురిసింది. ములుగు జిల్లా గోవిందరావుపేటలో 89.5 మి.మీ. వర్షం కురిసింది. మంచిర్యాల జిల్లా భీమిని, కాశిపేట, ఆదిలాబాద్ జిల్లా జైనథ్, ములుగు జిల్లా కేంద్రం, మహబూబాబాద్ జిల్లా గూడురు, కేసముద్రంలోనూ వర్షాలు దంచికొట్టాయి. వీటితో పాటుగా జయశంకర్ భూపాలపల్లి, కరీంనగర్‌తో పాటు ఆయా ప్రాంతాల్లో మోస్తరు వానలు కురిశాయి. బుధవారం కూడా భారీ వర్షాలు కురుసే అవకాశాలున్నాయని వాతావరణ కేంద్రం ప్రకటించింది. ఆదిలాబాద్, కుమ్రం భీం ఆసిఫాబాద్, నిర్మల్, జగిత్యాల, పెద్దపల్లి, మంచిర్యాల, జయశంకర్ భూపాలపల్లి, నిజామాబాద్, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, వరంగల్ అర్బన్, కామారెడ్డి, మెదక్, సంగారెడ్డి, మేడ్చల్ మల్కాజిగిరి, యాదాద్రి భువనగిరి, వికారాబాద్, రంగారెడ్డి, మహబూబ్‌నగర్, నాగర్ కర్నూల్, నారాయణపేట, వనపర్తి జిల్లాలు పూర్తిస్థాయిలో, వీటితో పాటు జోగుళాంబ గద్వాల, నల్గొండ, సూర్యాపేట, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్ జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో ఒకింత భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయి. శనివారం కూడా సూర్యాపేట, హైదరాబాద్, ఖమ్మం, గద్వాల, నాగర్ కర్నూల్ జిల్లాలు మినహా మిగిలిన జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వాతావరణ కేంద్రం వెల్లడించింది.

ఇక రాష్ట్ర వ్యాప్తంగా కురుస్తున్న వానలతో స్థానిక వరదతో ఊరి చెరువుల్లోకి వరద చేరుతోంది. ఇప్పటికే పలు గ్రామాల్లోని చెరువులు మత్తడి దుంకుతున్నాయి. దీంతో ఊరి చెరువులకు జలకళ సంతరించుకుంటోంది. వరుసగా మూడో ఏడాది కూడా గ్రామ చెరువుల్లోకి వరద వచ్చి నిండుగా కనివిందు చేస్తున్నాయి. పలు గ్రామాల్లో గ్రామ చెరువులుకు గ్రామస్థులు పూజలు చేస్తూ ఊరి బయట సామూహిక వన భోజనాలకు వెళ్తున్నారు.

ప్రాజెక్టులకు భారీ వరద

మరోవైపు కృష్ణా నదిపైన ప్రాజెక్టులకు భారీ వరద వస్తోంది. జూరాలకు మంగళవారం రాత్రి 9గంటల వరకు 45వేల క్యూసుక్కుల ఇన్ ఫ్లో వస్తోంది. ప్రాజెక్టు నిండింది. దీంతో విద్యుత్ ఉత్పత్తిని పెంచారు. మూడు విద్యుత్ ప్లాంట్ల ద్వారా ఉత్పత్తి చేస్తూ 23,121 క్యూసెక్కులను నదిలోకి వదులుతున్నారు. వీటితో పాటుగా నెట్టెంపాడు, భీమా, కోయిల్ సాగర్ కుడి, ఎడమ కాల్వ, సమాంతర కాల్వల నుంచి నీటిని విడుదల చేస్తున్నారు. మొత్తం ఔట్ ఫ్లో 27,094 క్యూసెక్కులు నమోదవుతోంది. ఆల్మట్టి ప్రాజెక్టుకు 41,812 క్యూసెక్కుల వరద వస్తుండటంతో దిగువనకు 46,130 క్యూసెక్కులు వదులుతున్నారు. నారాయణపూర్ ప్రాజెక్టుకు 46 వేల క్యూసెక్కుల వరద వస్తుండగా 45 వేలను వదులుతున్నారు. మరోవైపు తుంగభద్రకు వరద పెరిగింది. మంగళవారం వరకు 15,629 క్యూసెక్కులు వస్తోంది. జూరాల నుంచి దిగువకు నీటిని విడుదల చేస్తుండటంతో శ్రీశైలం ప్రాజెక్టుకు బుధవారం సాయంత్రం వరకు వరద జలాలు అందనున్నాయి. గోదావరి బేసిన్‌లో ఎస్సారెస్పీకి వరద కొంత తగ్గింది. 1446 క్యూసెక్కులు వస్తున్నాయి.



Next Story

Most Viewed