కరీంనగర్‌లో వరదలు.. సహాయక చర్యల్లో రిస్క్ చేసిన ఎమ్మెల్యే

by  |
కరీంనగర్‌లో వరదలు.. సహాయక చర్యల్లో రిస్క్ చేసిన ఎమ్మెల్యే
X

దిశ ప్రతినిధి, కరీంనగర్: ఎడ తెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో వాగులు వంకలు పొంగి పొర్లుతూనే ఉన్నాయి. జగిత్యాల, వేములవాడ బైపాస్ రోడ్డులోని వెలిచాల సమీపంలోని రోళ్ల వాగు ఉధృతంగా ప్రవహిస్తుండడంతో రాకపోకలు స్తంభించిపోయాయి.

గోదావరిఖనిలో..

ఎల్లంపల్లి గేట్లు ఎత్తడంతో పాటు, సుందిళ్ల బ్యారేజ్ వల్ల నీరు ఒత్తిడిగి గురికావడంతో సమీపంలోని గంగానగర్‌కు పెద్ద ఎత్తున వరద నీరు వచ్చి చేరింది. దీంతో లారీ యార్డులో ఉన్నలారీలు నీటిలో చిక్కుకపోయాయి. స్థానికులు కూడా వరద నీటిలోని ఉండిపోవడంతో వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు అధికారులు సన్నాహాలు చేశారు. రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ కూడా ప్రత్యక్ష్యంగా సహాయక చర్యల్లో పాల్గొని చిన్నారులను భుజాన ఎత్తుకుని బయటకు తీసుకవచ్చారు.

మంథనిలో..

గోదాదరి ఉధృతి కారణంగా పెద్దపల్లి జిల్లా మంథని గౌతమేశ్వరాలయం చుట్టూ వరద నీరు వచ్చి చేరింది. ఆలయంలో సుమారు 30 మంది మంథని వాసులు చిక్కుకున్నారు. పోలీసులు రెవెన్యూ అధికారులు హుటాహుటిన గోదావరి తీరానికి చేరుకుని ఆలయంలో చిక్కుకున్న వారిని బయటకు తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు. అలాగే అన్నారం బ్యాక్ వాటర్ కారణంగా అయ్యగారి చెరువు నిండిపోవడంతో పాటు పరికి వాగులోకి కూడా బ్యాక్ వాటర్ పెద్ద ఎత్తున వచ్చింది. దీంతో మంథని శివార్లలోని వంద ఎకరాల్లో పంట మునిగిపోయింది.

కాళేశ్వరం వద్ద..

భూపాలపల్లి జిల్లా కాళేశ్వరం వద్ద వరద ఉధృతి తీవ్రంగా పెరిగింది. కాళేశ్వరం వద్ద గోదావరినదిలో 12 మీటర్ల మేర ప్రవాహం సాగుతుండడంతో మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు.

Next Story

Most Viewed