అల్మాస్‌గూడ ఆగమాగం.. ఒక్క గంట మా కాలనీల్లో ఉండగలరా..?

by  |
అల్మాస్‌గూడ ఆగమాగం.. ఒక్క గంట మా కాలనీల్లో ఉండగలరా..?
X

దిశ, జల్‌పల్లి : నిన్న రాత్రి కురిసిన భారీ వర్షానికి అల్మాస్​గూడలోని కోమటికుంట, పోచమ్మకుంట చెరువులు అలుగు పారుతున్నాయి. దీంతో బోయపల్లి ఎన్​క్లేవ్, సీవైఆర్​కాలనీ, సీఎంఆర్​కాలనీ, మధురపూరి కాలనీ, అమరావతి కాలనీ, బీఎస్ఆర్ నగర్ ​ప్రాంతాల్లో భారీగా వరద నీరు వచ్చి చేరింది. దీంతో జనజీవనం పూర్తిగా స్తంభించి పోయింది. బోయపల్లి ఎన్​క్లేవ్‌లో మాత్రం గత 8 నెలలుగా మురుగునీరు యేరులా ప్రవహిస్తున్నా యుద్ద ప్రాతిపదికన అధికారులు చర్యలు చేపట్టడం లేదని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. భరించలేని దుర్గంధంతో ఎలా బతకాలని, ఇంటి గడప నుంచి బయట కాలుపెట్టలేని పరిస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒక్క రోజు కాదు.. ఒక్క గంట కూడా కాలనీలో ఉండలేక పోతున్నామని కన్నీటి పర్యంతమవుతున్నారు.

అదేవిధంగా జంగారెడ్డి కాలనీ, మల్లారెడ్డి నగర్ కాలనీలు పూర్తిగా నీట మునిగిపోయాయి. అక్కడక్కడా చెట్లు విరిగి రహదారులపై పడ్డాయి. దీంతో విద్యుత్​సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. రాత్రి కురిసిన భారీ వర్షానికి ఇంట్లోని గృహోపకరణాలు, నిత్యావసర వస్తువులు, వాహనాలు పూర్తిగా నీటమునిగాయి. ఈ పరిస్థితుల వలన వర్షం పడుతుందంటే చాలు స్థానికులు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. ఎప్పుడు ఏం జరుగుతుందో అన్న భయంతో రాత్రంతా జాగారం చేయాల్సిన పరిస్థితి నెలకొంది. డ్రైనేజీలు ఎక్కడికక్కడ పొంగుతున్నాయి. ఇళ్లలోని టాయ్ లెట్స్‌లో మురుగు నీరు రివర్స్ పంపింగ్ జరుగుతోందని, ఈ సమస్యను ఎలా అధిగమించాలని కాలనీ వాసులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు.

ఎక్కడ చూసినా నీళ్లు, కటిక దుర్గంధం వలన సొంతింటిని వదిలి ఇతర ప్రాంతాలకు వలస వెళ్లాల్సి వస్తోందని కాలనీ వాసులు వాపోతున్నారు. గతేడాది సెప్టెంబర్‌లో కురిసిన భారీ వర్షం వల్ల ఇక్కడి పరిస్థితులు పూర్తిగా మారిపోయాయని, 13 నెలలు గడుస్తున్నా ట్రంక్​లైన్​పనులు ఎందుకు చేపట్టలేదని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. నిన్న రాత్రి కురిసిన వర్షానికి ఇప్పటివరకు వరద కొనసాగుతూనే ఉందని, మేము ఎలా బతకాలి అని ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. ఇంటి గడప దాటలేని పరిస్థితుల్లో ఉన్నామన్నారు. ఇప్పటికైనా కొత్తగా ప్రారంభోత్సవాలు చేయకుండా యుద్ధ ప్రాతిపదికన ట్రంక్​లైన్​పనులు చేపట్టాలని రామిడి శూర కర్ణా రెడ్డి డిమాండ్​చేశారు.



Next Story

Most Viewed