రేపటి నుంచి సెకండ్ డోస్ ప్రక్రియ ప్రారంభం

by  |
రేపటి నుంచి సెకండ్ డోస్ ప్రక్రియ ప్రారంభం
X

దిశ, తెలంగాణ బ్యూరో: తొలి డోస్ కరోనా వ్యాక్సిన్ తీసుకున్న హెల్త్ కేర్ సిబ్బందికి శనివారం నుంచి రెండో డోస్ ఇచ్చే ప్రక్రియ మొదలుకానుంది. మొదటి డోస్ తీసుకున్న వారికి 28 రోజుల వ్యవధి పూర్తి కావడంతో శనివారం నుంచే రెండో డోస్ ఇవ్వడం ప్రారంభిస్తున్నట్లు ప్రజారోగ్య శాఖ డైరెక్టర్ శ్రీనివాసరావు తెలిపారు. మొదట ప్రభుత్వ హెల్త్ కేర్ సిబ్బందికి రెండో డోస్ ఇస్తామని, ఈ నెల 22వ తేదీ వరకు అది కొనసాగుతుందని, ఆ తర్వాత ప్రైవేటు హెల్త్ కేర్ సిబ్బందికి ఇస్తామని డైరెక్టర్ తెలిపారు. తొలి డోస్ ఏ కంపెనీ వ్యాక్సిన్ తీసుకున్నారో రెండో డోస్ కూడా ఆ కంపెనీదే ఇస్తామన్నారు. తొలి డోస్ తీసుకున్న వారిలో కొద్దిమందికి సివియర్, సీరియస్ దుష్ప్రభావాలు తలెత్తాయని, వారికి రెండో డోస్ ఇవ్వడం లేదన్నారు. ఈ మేరకు అన్ని జిల్లాల వైద్యాధికారులకు సర్క్యులర్ జారీ అయింది. తొలి డోస్ తీసుకున్న వారికి రెండో డోస్ ఎప్పుడు తీసుకోవాలో ఇప్పటికే వారి మొబైల్ ఫోన్లకు మెసేజ్‌లు వెళ్లినందున ఆ తేదీ, ఆ సమయం ప్రకారం వ్యాక్సిన్ కేంద్రాలకు వచ్చి టీకాలు తీసుకోవాలని స్పష్టం చేశారు.

దేశవ్యాప్తంగా మొదలైన వ్యాక్సినేషన్ ప్రక్రియలో భాగంగా తెలంగాణలో కూడా జనవరి 16వ తేదీన మొదలైంది. ఇప్పటివరకు ప్రభుత్వ, ప్రైవేటు హెల్త్ కేర్ సిబ్బందికి, ప్రంట్‌లైన్ వారియర్లకు టీకాల పంపిణీ పూర్తయింది. హెల్త్ కేర్ సిబ్బందిలో సుమారు 64% మందికి తొలి డోస్ ఇవ్వగా, ఫ్రంట్‌లైన్ వారియర్లలో కేవలం 33 శాతం మందికే వైద్యారోగ్య శాఖ ఇచ్చింది. ఈ రెండు కేటగిరీల వారిని కలుపుకుంటే ఇప్పటిదాకా మొత్తం 2,77,825 మందికి టీకాలను ఇచ్చినట్లు డాక్టర్ శ్రీనివాసరావు తెలిపారు. ఫ్రంట్‌లైన్ వారియర్లను 2,56,895 మందిని గుర్తించగా శుక్రవారం సాయంత్రం నాటికి 84,340 మంది మాత్రమే టీకాలు తీసుకున్నారన్నారు. రాష్ట్రవ్యాప్తంగా వ్యాక్సిన్ తీసుకున్న వారిలో ముగ్గురు మరణించారని, వారి మృతికి వ్యాక్సిన్ కారణం కాదని నిర్ధారణ అయిందని డైరెక్టర్ తెలిపారు.

Next Story

Most Viewed