అరకులో మరీ దారుణం..!

by  |
అరకులో మరీ దారుణం..!
X

దిశ, విశాఖపట్నం: రాష్ట్రంలోనే హైరిస్క్‌ జిల్లాగా పేరొందిన విశాఖ జిల్లా ఏజెన్సీ ప్రాంతంలోని ప్రధాన ఆసుపత్రుల్లో రోగులకు సకాలంలో వైద్య సేవలు అందడంలేదు. ఆసుపత్రుల స్థాయి పెంచారే కానీ… అవసరమైన వైద్యులు, వైద్య పరికరాలు, ఇతర సదుపాయాలను సమకూర్చకపోవడంతో గిరిజన రోగులకు ఇబ్బందులు తప్పడం లేదు. పాడేరు ఆసుప్రతిని వంద పడకల నుంచి 200 పడకలకు పెంచి జిల్లా ఆసుపత్రిగా అప్‌గ్రేడ్‌ చేశారు. కానీ ఆ ఆసుపత్రిలో పూర్తిస్థాయిలో వైద్యులు, పారామెడికల్‌ సిబ్బంది నియమించలేదు.

ముఖ్యంగా మాతా, శిశు మరణాల నివారణకు ఎంతో ప్రాధాన్యతనిస్తున్నామని చెబుతున్నా ప్రభుత్వం నేటికీ గైనికాలజిస్ట్‌, ఎనస్థీషియా(మత్తు) వైద్యులను నియమించకపోవడంతో శిశు మరణాలు సంభవిస్తూనే ఉన్నాయి. ఏజెన్సీ ముఖ ద్వారమైన పాడేరు ప్రాంతీయ ఆసుపత్రికి చుట్టుప్రక్కల ఉన్న మండలాల్లోని 15 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల నుంచి రోగులు జిల్లా ఆసుప్రతికి వస్తారు. రోగుల సంఖ్యకు అనుగుణంగా వైద్యలు, సిబ్బంది లేకపోవడంతో గిరిజనులకు మెరుగైన వైద్యసేవలు అందడం లేదు. రెండు వందల పడకల ఆసుపత్రిగా మార్పు చేసి పాడేరు ఆసుపత్రిని ఆప్‌గ్రేడ్‌ చేశారే తప్ప ఆ స్థాయికి అవసరమైన వైద్య నిపుణులు, సిబ్బంది, నియామకంపై దృష్టిసారించడం లేదు.

పర్యాటక ప్రాంతమైన అరకులో మరీ దారుణం…

అరుకులోయ ఏరియా ఆసుపత్రి పేరుకే 150 పడకలు… వాస్తవంగా 50 పడకల స్థాయిలో కూడా వైద్యసేవలు అందడం లేదు. ముఖ్యంగా వైద్యనిపుణల కొరత తీవ్రంగా ఉంది. కేవలం సాధారణ సేవలు మినహా, మిగిలిన సేవలన్నీ విశాఖలోని కేజీహెచ్‌కు రిఫర్‌ చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. విశాఖ ఏజెన్సీలో అధిక సంఖ్యలో మాతా, శిశు మరణాలు వందల సంఖ్యలో జరుగుతున్నా… నేటికీ వాటి నివారణపై దృష్టిసారించకపోగా, గైనికాలజిస్ట్‌, చిన్నపిల్లల వైద్యలు, మత్తు వైద్యలను నియమించుకోవడంలో ఆరోగ్యశాఖ నిర్లక్ష్యం కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. వాస్తవానికి అరకు వంద పడకల ఆసుపత్రిలో 18మంది వైద్యులు ఉండాలి. కానీ ఐదుగురు, ఆరుగురు వైద్యులతోనే కాలం గడుపుతున్నారు.

అధిక జీతాలు ఇస్తామని ప్రకటిస్తున్నా…

విశాఖ ఏజెన్సీలో పనిచేసే వైద్యనిపుణులకు అధిక సంఖ్యలో జీతం, ప్రోత్సాహకాలు అందిస్తామని ప్రకటిస్తున్నా వైద్యనిపుణులు మాత్రం శ్రద్ధ చూపడంలేదు. దీనికి ముఖ్య కారణం ఏమిటంటే ఏజెన్సీ ప్రాంతంలో వైద్యులకు అవసరమైన వసతి సౌకర్యం లేకపోవడంతోనే ఈ సమస్య ఏర్పడుతుంది. ఏపీ వైద్యవిధాన్‌ పరిషత్‌ ఆసుపత్రిలో ఏడాదికి ఆరు నుంచి పదిసార్లు విశాఖ జిల్లాలోని పాడేరు, అరకు, చింతపల్లి ప్రాంతాలకు గైనికాలజిస్ట్‌, ఎనస్థీషియా, చిన్నపిల్లల వైద్యులు, దంత వైద్యులు కావాలని ప్రకటన జారీ చేస్తున్నప్పటికీ ఎవ్వరూ మందుకు రావడంలేదు. ఇదే సమయంలో విశాఖ కేజీహెచ్‌లోని ఆయా విభాగాల వైద్య నిపుణులను ఏజెన్సీకి డిప్యూటేషన్‌పై నియమించడంతో వారంతా కొద్దిరోజులు విధులు చేపట్టి ఆ తరువాత లాంగ్‌లీవ్‌లోకి వెళ్లిపోతున్నారు.

ప్రభుత్వానికి నివేదించాం …
పిఎస్‌ సూర్యనారాయణ, డిఎంహెచ్‌వో, విశాఖ

విశాఖ ఏజెన్సీలోని చింతపల్లి, అరకు, పాడేరు ఆసుపత్రుల సమస్యలపై ఇప్పటికే గిరిజనుల సమస్యలు, వారి డిమాండ్లను ప్రభుత్వానికి నివేదించాం. ఇప్పటికే పాడేరు కేంద్రంగా వైద్య కళాశాల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నాం. త్వరలోనే వాటి నిర్మాణ పనులు చేపట్టడంతో వాటిని అందుబాటులోకి తీసుకువస్తాం. ఏజెన్సీలో పనిచేసే వైద్యనిపుణులకు డబుల్‌ జీతాలు చెల్లిస్తాం.. అయినా ఎవ్వరూ రావడంలేదు.. మాతా,శిశు మరణాలు గతంలో కంటే బాగా తగ్గాయి. ముఖ్యంగా విశాఖ ఏజెన్సీలోని 36 పీహెచ్‌సీల ద్వారా గిరిజనులకు సత్వర వైద్యసేవలందిస్తున్నాం. -పిఎస్‌ సూర్యనారాయణ, డిఎంహెచ్‌వో, విశాఖ

Next Story