తెలంగాణలో హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించాలి..

by  |
తెలంగాణలో హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించాలి..
X

దిశ, ముషీరాబాద్ : తెలంగాణ ప్రభుత్వం ఇకనైనా మేల్కొని రాష్ట్రంలో హెల్త్ ఎమర్జెన్సీని ప్రకటించాలని
ములుగు కాంగ్రెస్ ఎమ్మెల్యే సీతక్క డిమాండ్ చేశారు. కరోనా లక్షలాది మందిని గడగడలాడిస్తుందని, వైద్యం, ఆక్సిజన్ అందక వెంటిలేటర్స్ లేక డబ్బులు చెల్లించి వైద్యం పొందలేక అనేక మంది చనిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కరోనాను వెంటనే ఆరోగ్యశ్రీలో చేర్చి పేద ప్రజలకు సరైన వైద్యం అందించాలన్నారు.

ఆరోగ్యశ్రీ ద్వారా కరోనాకు వైద్యం అందించాలని, ఉచిత ఆన్ లైన్ సర్వీస్ ఏర్పాటు చేయాలని, కరోనా వ్యాధితో మృతి చెందిన ప్రతి కుటుంబం ప్రైవేటు ఆసుప్రతులకు చెల్లించిన బిల్లులను సీఎం సహాయ నిధి ద్వారా తిరిగి చెల్లించాలని డిమాండ్ చేస్తూ ఎన్ఎస్‌యూఐ ఆధ్వర్యంలో సోమవారం ఇందిరా పార్కు వద్ద ప్రజా ఆరోగ్య ఆమరణ నిరాహార దీక్ష నిర్వహించారు. దీక్షలో ములుగు ఎమ్మెల్యే సీతక్క, ఎన్ఎస్‌యూఐ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ వెంకట్‌లు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా సీతక్క మాట్లాడుతూ.. ప్రజల ఆరోగ్యం, ప్రాణాలకన్నా ప్రధానమైనది.. దేశానికి, రాష్ట్రానికి ఏదీ లేదన్నారు. దేశం, రాష్ట్రం బాగుండాలంటే ప్రజలు ఆరోగ్యంగా ఉండాలన్నారు. కాబట్టి రాష్ట్రంలోని ప్రజలందరికీ కరోనా ఫ్రీ ట్రీట్‌మెంట్ ఇవ్వాలన్నారు. కరోనా భయానికే చాలామంది హార్ట్ ఎటాక్ వచ్చి ప్రాణాలు కోల్పోతున్నారని, ప్రతీ చోటా కరోనాకు ఫ్రీ ట్రీట్ మెంట్ అందుతుందన్న నమ్మకం కలిగించాలని కోరారు. ఆక్సిజన్ అందుబాటులో ఉంచాలని, ఫ్రీ అంబులెన్స్‌లను ప్రొవైడ్ చేయాలని డిమాండ్ చేశారు. ఈ దీక్షా కార్యక్రమంలో పలువురు ఎన్ఎస్‌యూఐ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.



Next Story

Most Viewed