దీర్ఘకాలిక సెలవుపై హెల్త్ డైరెక్టర్ ?

by  |
దీర్ఘకాలిక సెలవుపై హెల్త్ డైరెక్టర్ ?
X

దిశ, తెలంగాణ బ్యూరో : కరోనా టెస్టుల విషయంలో హైకోర్టు నుంచి జారీ అయిన కోర్టు థిక్కార నోటీసుకు నొచ్చుకున్న ప్రజారోగ్య శాఖ డైరెక్టర్ డాక్టర్ శ్రీనివాసరావు దీర్ఘకాలిక సెలవు పెట్టనున్నారు. ప్రభుత్వ విధానాలకు అనుగుణంగా పనిచేసిన తర్వాత వ్యక్తిగతంగా తనకు కోర్టు ధిక్కరణ నోటీసులు జారీ చేయడం పట్ల మనస్తాపానికి గురయ్యారు. వ్యక్తిగతంగా తన శక్తి మేరకు కృషి చేస్తున్నా చివరకు కోర్టు నుంచి ఆగ్రహాన్ని ఎదుర్కోవడం పట్ల నొచ్చుకున్నట్లు తెలిసింది. అందులో భాగంగానే కొన్ని రోజుల పాటు సెలవు పెట్టాలనే నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది.

కరోనా కట్టడి విషయంలో ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా పనిచేయడంతో పాటు సొంతంగా కూడా చొరవ తీసుకుని రాష్ట్రంలోని అన్ని జిల్లా వైద్యాధికారులతో ఎప్పటికప్పుడు సమావేశాలు నిర్వహిస్తూ వారిని సమన్వయం చేసి పాజిటివిటీ రేటు, మరణాల రేటును మరే రాష్ట్రం కంటే తగ్గించి రికవరీ రేటు పెంచగలిగినా చివరకు కోర్టు ద్వారా అవమానకరమైన తీరులో నోటీసులు అందుకోవడం పట్ల మానసికంగా ఇబ్బంది పడ్డారు. ప్రస్తుతం ప్రజారోగ్య శాఖకు పూర్తికాలపు ఇన్‌ఛార్జి (ఎఫ్ఏసీ) హోదాలో డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్న డాక్టర్ శ్రీనివాసరావు దీర్ఘకాలిక సెలవును ప్రస్తుత పరిస్థితుల్లో ప్రభుత్వం ఆమోదిస్తుందా లేదా అన్నది ప్రశ్నార్థకంగా మారింది.


Next Story