మలేరియా అలర్ట్.. ఆ రెండు జిల్లాలపై వైద్యారోగ్యశాఖ స్పెషల్ ఫోకస్

by  |
మలేరియా అలర్ట్.. ఆ రెండు జిల్లాలపై వైద్యారోగ్యశాఖ స్పెషల్ ఫోకస్
X

దిశ, తెలంగాణ బ్యూరో : మన్యంలో మలేరియా వ్యాధి చాప కింద నీరులా వ్యాపిస్తోంది. మఖ్యంగా భద్రాద్రి కొత్తగూడెం, ములుగు జిల్లాల్లో ఆందోళనకర పరిస్థితులు నెలకొనడంతో వైద్యారోగ్యశాఖ స్పెషల్ ఫోకస్ పెట్టింది. వ్యాధి తీవ్రత అధికంగా ఉన్న గ్రామాలకు ప్రత్యేక వైద్యబృందాలను పంపనుంది. అనుమానితులు, లక్షణాలున్న ప్రతీ వ్యక్తికి స్లిప్ మెథడ్ విధానంలో మలేరియా టెస్టులు చేయనున్నారు. దీంతో ఎక్కడికక్కడే వ్యాధి నిర్ధారణ కానుంది. ఫలితంగా త్వరగా వైద్యం అందించేందుకు సులువుగా ఉంటుందని వైద్యారోగ్యశాఖ వర్గాలు తెలిపాయి.

రోడ్డు మార్గం లేని రోగులకు పీహెచ్‌సీల్లో పర్యవేక్షణ..

భద్రాద్రి, ములుగు జిల్లాల్లో రోడ్డు మార్గం లేని మారుమూల ప్రాంతాలకు చెందిన రోగులను సమీపంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లోనే ఉంచనున్నారు. లేదా పాఠశాలలు, ఇతర ప్రభుత్వ కార్యాలయాల బిల్డింగ్‌లలో ట్రీట్మెంట్ అందిస్తామని ఆరోగ్యశాఖ పేర్కొన్నది. వ్యాధి పూర్తిగా తగ్గిన తర్వాత మాత్రమే సదరు పేషెంట్లను ఇళ్లకు పంపించనున్నారు. ఇప్పటికే ఆయా మండలాల్లోని మెడికల్ ఆఫీసర్లకు ఆదేశాలు జారీ చేసినట్లు వైద్యారోగ్యశాఖలోని ఉన్నతాధికారులు స్పష్టం చేశారు.

దోమ తెరలు పంపిణీ..

మలేరియా నివారణలో భాగంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 1,65,000, ములుగు జిల్లాలోని ఆదివాసీ ప్రాంతాల్లో 1,50,000 దోమ తెరలను పంపిణీ చేసినట్లు వైద్యారోగ్యశాఖలోని మలేరియా విభాగం తెలిపింది. మలేరియా కేసులు పెరుగుతున్న మిగతా జిల్లాల్లోనూ వీటిని పంపిణీ చేసేందుకు ప్లాన్ చేస్తున్నామని వివరించింది. అంతేగాక ఆశావర్కర్లు, ఏఎన్ఎంల సహకారంతో ప్రతీ గ్రామంలో వ్యాధి నిర్ధారణ పరీక్షలతో పాటు అవగాహన కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నామన్నారు.

దీంతో పాటు ప్రతీ వారానికోసారి పీహెచ్‌సీ మెడికల్ ఆఫీసర్ ఆధ్వర్యంలో ఆదివాసీ గ్రామాల్లో మెడికల్ విజిట్ ఉంటుందన్నారు. కరోనాతో పాటు సీజనల్ వ్యాధుల లక్షణాలు ఉన్న వాళ్లందరికీ టెస్టులు నిర్వహించి మందులు పంపిణీ చేస్తున్నామన్నారు. వ్యాధి తీవ్రత అధికంగా ఉన్న వాళ్లను మాత్రం ఏరియా, జిల్లా ఆసుపత్రులకు తరలిస్తున్నామని డాక్టర్లు చెబుతున్నారు.

మలేరియా ప్రభావం ఇలా..

రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఏడాది ఆగస్టు 16 వరకు 509 మలేరియా కేసులు మాత్రమే నమోదైతే, వీటిలో అత్యధికంగా భద్రాద్రి కొత్తగూడెంలో 220, ములుగులో 129 కేసులు తేలాయి. అదే విధంగా హైదరాబాద్‌లో 12, రంగారెడ్డిలో 1, ఆదిలాబాద్‌లో 2, నిర్మల్‌లో 2, మహబూబ్ నగర్‌లో 5, కరీంనగర్‌లో 2, మహబుబాబాద్‌లో 18, ఆసిఫాబాద్‌లో 25, జనగామలో 5, పెద్దపల్లిలో 2, యాదాద్రిలో 1, వరంగల్ రూరల్‌లో 15, భూపాలపల్లిలో 41, సిరిసిల్లలో 1 కేసు చొప్పున నమోదయ్యాయి.

అనధికారంగా వీటి సంఖ్య రెట్టింపు స్థాయిలో ఉండొచ్చని స్వయంగా మలేరియా విభాగం అధికారులు చెప్పడం గమనార్హం. కానీ, రెండేళ్లతో పోల్చితే ప్రస్తుతం కేసుల సంఖ్య సాధారణంగా ఉన్నట్లు అధికారులు పేర్కొన్నారు. 2019లో భద్రాద్రి కొత్తగూడెంలో 604 మలేరియా కేసులు తేలగా, 2020కి అవి 364కి తగ్గాయి. అదే విధంగా ములుగు జిల్లాలో 2019లో 315 మలేరియా కేసులుండగా, 2020కి అవి 171కి తగ్గాయి. కరోనా నివారణకు చేపట్టిన చర్యలతో సుమారు 75 శాతం సీజనల్ వ్యాధులు తగ్గాయని హెల్త్ ఆఫీసర్లు చెబుతున్నారు.

ఒక్క కేసు తేలినా, 100 ఇండ్లకు స్ప్రె చేస్తున్నాం :
డా అమర్ సింగ్ అడిషనల్ డైరెక్టర్

గ్రామీణ ప్రాంతాల్లో ఒక్క కరోనా కేసు తేలినా, ఆ చుట్టుపక్కల 100 ఇండ్లకు స్ప్రె చేస్తున్నాం. అంతేగాక యాంటీలార్వా కార్యక్రమాలు విస్ర్తృతంగా నిర్వహిస్తున్నాం. వ్యాధులు ప్రబలకుండా ప్రతీ వీధిలో హైపోక్లోరైడ్ ద్రావణాన్ని చల్లుతున్నాం. వర్షపునీరు, మురుగు నీరు నిల్వలేకుండా ఎప్పటికప్పుడు ప్రత్యేక చర్యలను చేపడుతున్నాం. దీంతో పాటు ప్రతీ బస్తీ, కాలనీల్లో దోమల నివారణకు ఫాగింగ్‌లు చేయిస్తున్నాము. దీనికి పంచాయితీ రాజ్, మున్సిపల్ శాఖల అధికారుల సహాయాన్ని తీసుకుంటున్నాం. అయితే రూరల్ ఏరియాలతో పోల్చితే పట్టణాల్లో ఫీవర్ల వ్యాప్తి వేగంగా జరుగుతున్నది.



Next Story

Most Viewed