‘న్యాయం చేయండి.. నా భర్తను కొట్టి చంపారు’

by  |
HRC
X
దిశ, కామారెడ్డి: ‘నా భర్త రోడ్డు ప్రమాదంలో చనిపోలేదు. ఆయన్ను చూస్తే కొట్టి చంపినట్టు స్పష్టంగా తెలుస్తోంది. అనుమానితులను ఐదురోజులు అదుపులోకి తీసుకుని జామినుపై వదిలేశారు. రోడ్డు ప్రమాదమని చెబుతున్న సీఐపై విచారణ జరిపి నాకు న్యాయం చేయండి’ అంటూ బిక్కనూర్ మండల కేంద్రానికి చెందిన లావణ్య HRCలో ఫిర్యాదు చేసింది. బాధితురాలు వివరాల ప్రకారం.. బిక్కనూర్ మండల కేంద్రానికి చెందిన నాగాడపు శంకర్ కాచాపూర్ సబ్ స్టేషన్‌లో ఆపరేటర్‌గా పని చేస్తున్నాడు. అయితే గత మే నెల 14వ తేదీన మధ్యాహ్నం సమయంలో ఇంట్లో ఎవరికీ చెప్పకుండా బైక్‌పై బయటకు వెళ్ళాడు. సాయంత్రం వరకూ ఇంటికి రాకపోవడంతో చుట్టూ వెతికారు. చివరకు రాత్రి 7 గంటల ప్రాంతంలో శంకర్ కాచాపూర్ చెరువు కట్టపై గాయాలతో పడి ఉన్నాడని పోలీసులకు సమాచారం వచ్చింది. దీంతో వెంటనే విషయం కుటుంబ సభ్యులకు తెలిపారు. విషయం తెలిసిన వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని శంకర్‌ను చికిత్స నిమిత్తం జిల్లా ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ కొద్దిసేపటికి మృతి చెందాడు. అయితే శంకర్ ఒంటిపై గాయాలు ఉండటంతో కుటుంబ సభ్యులు అనుమానాలు వ్యక్తం చేశారు.
శంకర్‌ను కర్రలతో కొట్టి చెరువు కట్టపై పడవేసి ఉంటారని అనుమానిస్తున్నారు. అంతేగాకుండా.. ఆయన నోటిలో ఇసుక కుక్కినట్టుగా అనుమానం వ్యక్తం చేశారు. తన కొడుకు మృతిపై అనేక అనుమానాలు ఉన్నాయని శంకర్ తండ్రి నారాయణ బిక్కనూర్ సీపీకి రాతపూర్వకంగా ఫిర్యాదు చేశారు. అయితే విచారణ చేపట్టిన పోలీసులు ఐదుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకుని విచారించి, ఆ తరువాత జామీనుపై వదిలిపెట్టారు. చివరకు శంకర్ రోడ్డు ప్రమాదంలో మృతి చెందారని ఎఫ్ఐఆర్‌లో నమోదు చేశారు. శంకర్ భార్య పోలీసులపై అనుమానం వ్యక్తం చేసింది. నిందితులతో పోలీసులు కుమ్మక్కయ్యారని హెచ్‌ఆర్సీలో ఫిర్యాదు చేసింది. తప్పుడు ఎఫ్ఐఆర్ చేసిన సీఐపై విచారణ జరిపి తమకు న్యాయం చేయాలని పేర్కొంది. అయితే ఇదే విషయమై బిక్కనూర్ సీఐ అభిలాష్‌ను వివరణ కోరగా అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేయడం జరిగిందని తెలిపారు.
Next Story