హెచ్‌సీఎల్ ఉద్యోగులకు రూ. 700 కోట్ల ప్రత్యేక బోనస్

by  |
హెచ్‌సీఎల్ ఉద్యోగులకు రూ. 700 కోట్ల ప్రత్యేక బోనస్
X

దిశ, వెబ్‌డెస్క్: దేశీయ అతిపెద్ద టెక్ దిగ్గజం హెచ్‌సీఎల్ సంస్థ తన ఉద్యోగులకు శుభవార్త అందించింది. గతేడాది అనుకున్న దానికంటే అద్భుతమైన ఆదాయం సాధించిన నేపథ్యంలో అంతర్జాతీయంగా ఉన్న తన ఉద్యోగులందరికీ భారీగా బోనస్‌ను ప్రకటించింది. హెచ్‌సీఎల్ కంపెనీలో ప్రస్తుతం సుమారు 1.5 లక్షల మంది ఉద్యోగులున్నారు. దాదాపు రూ. 700 కోట్ల విలువైన స్పెషల్ బోనస్‌ను అందించేందుకు కంపెనీ సిద్ధమైంది. 2020లో కరోనా మహమ్మారి సమయంలోనూ తమ ఉద్యోగులందరూ నిబద్ధతతో సేవలను అందించారని, అందుకే సంస్థ వృద్ధి భారీగా సాధించగలిగిందని కంపెనీ తెలిపింది. దీనికి మించి తమ ఉద్యోగులు సంస్థకు విలువైన ఆస్తిగా కంపెనీ స్పష్టం చేసింది. 2020 క్యాలెండర్ ఏడాదిలో హెచ్‌సీఎల్ సంస్థ మొదటిసారిగా 10 బిలియన్ డాలర్ల ఆదాయాన్ని సాధించింది. సంస్థ ప్రకటించినట్టుగా ప్రత్యేక బోనస్‌ను ఫిబ్రవరి నెలతో కలిపి అందించనుంది.

ఏడాది, అంతకంటే ఎక్కువ సర్వీసును కలిగిన ఉద్యోగులకు ఈ బోనస్ లభిస్తుందని, అంతేకాకుండా ఈ బోనస్ 10 రోజుల జీతంతో సమానమని హెచ్‌సీఎల్ తెలియజేసింది. బోనస్‌ను అందుకోబోయే ప్రతి ఉద్యోగికీ కృతజ్ఞతలు చెబుతున్నట్టు హెచ్‌సీఎల్ చీఫ్ హెచ్ఆర్ వీవీ అప్పారావు తెలిపారు. 2020-21 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి డిసెంబర్‌తో ముగిసిన త్రైమాసికంలో హెచ్‌సీఎల్ టెక్ సంస్థ నికర లాభం 31.1 శాతం వృద్ధిని నమోదు చేసిన సంగతి తెలిసిందే. అలాగే, ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి ఒక్కో షేర్‌కు రూ. 4 మధ్యంతర డివిడెండ్‌ను కంపెనీ ప్రకటించింది.



Next Story

Most Viewed