వారిని ఆకట్టుకునేందుకు హరీష్ భారీ ప్లాన్.. ఫుల్ మెజార్టీపైనే ఫోకస్

by  |
వారిని ఆకట్టుకునేందుకు హరీష్ భారీ ప్లాన్.. ఫుల్ మెజార్టీపైనే ఫోకస్
X

దిశ ప్రతినిది, కరీంనగర్: హుజురాబాద్ ఉప ఎన్నికల్లో ఓటర్లను ఆకట్టుకోవడమే లక్ష్యంగా అధికార టీఆర్ఎస్ పార్టీ పావులు కదుపుతోంది. సామాజిక వర్గాల వారిగా సమీకరణలు జరుపుతు గులాభి గుభాలించాలన్న సంకల్పంతో ముందుకు సాగుతోంది. ఎక్కువగా ఓటర్లు ఉన్న వారిని టార్గెట్ చేసుకుంటూ పథకాల ఎర వేస్తోంది. ఇప్పటికే నియోజకవర్గానికి రెడ్డి సామాజిక వర్గ ఓటర్లను ఆకట్టుకునేందుకు మాజీ మంత్రి పెద్దిరెడ్డిని పార్టీలో చేర్పించుకోగా, పాడి కౌశిక్ రెడ్డికి నామినేటెడ్ ఎమ్మెల్సీ పదవిని కట్టబెట్టాలని నిర్ణయించింది. యాదవ సామాజిక వర్గం లక్ష్యంగా గెల్లు శ్రీనివాస యాదవ్‌ను అభ్యర్థిగా ప్రకటించింది. అలాగే బీసీ ఉద్యమాల్లో క్రియాశీలకంగా పనిచేసిన వకుళాభరణం కృష్ణమోహన్ ను బీసి కమిషన్ ఛైర్మన్‌గా నియమించింది. ఇప్పుడు తాజాగా పద్మశాలీలను లక్ష్యం చేసుకుని స్కెచ్‌లు వేయడం ఆరంభించింది.

బావ ప్రపోజల్… బామ్మర్ధి సాంక్షన్…

హుజురాబాద్ నియోజకవర్గంలో పద్మాశాలీ సామాజిక వర్గానికి చెందిన ఓట్లు 26350 ఉన్నాయి. వీరిని ఆకట్టుకోవడమే లక్ష్యంగా సమీకరణాలు జరపడం ఆరంభించారు. శనివారం మంత్రి హరీష్ రావు ప్రత్యేకంగా సమావేశం ఏర్పాటు చేసి పద్మశాలీల కోసం చేపట్టాల్సిన చర్యల గురించి సుదీర్ఘంగా చర్చించారు. ఈ సమావేశంలో పద్మశాలి కుల ప్రతినిధులు మాజీ మంత్రి ఎల్ రమణ, మాజీ ఎమ్మెల్యే చింత ప్రభాకర్, కర్నాటి విద్యాసాగర్‌ల నేతృత్వంలో కీలక నిర్ణయాలు తీసుకున్నట్టు సమాచారం. రాష్ట్ర ప్రభుత్వం నేతన్నల సంక్షేమ పథకాలను అమలు చేసే విషయంపై కీలక నిర్ణయాలు తీసుకున్నట్టు సమాచారం. హుజురాబాద్ నేతన్నలకు అందించాల్సిన పథకాల గురించి ప్రతిపాదనలు తయారు చేసి మంత్రి కల్వకుంట్ల తారక రామారావుకు పంపించనున్నారు. వీటికి వెంటనే కేటీఆర్ ఆమోద ముద్ర వేసి నిధుల విడుదలకు సంబందించిన ఆదేశాలు ఇవ్వనున్నారు.

నేతన్నల భీమా…

సెప్టెంబర్ 1 నుంచి నేతన్నలకు భీమా సౌకర్యం కల్పిస్తున్నట్టు అధికారికంగా ప్రకటించనున్నారు. ఇటీవల రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ సిరిసిల్ల జిల్లాలో పర్యటించినప్పుడు రైతు భీమా మాదిరిగానే నేత కార్మికులకు కూడా భీమా సౌకర్యం కల్పిస్తామని ప్రకటించారు. ఈ మేరకు సెప్టెంబర్ 1 నుంచి ఈ పథకాన్ని అమల్లో పెట్టనున్నారు. థ్రిఫ్ట్ ఫండ్ తోపాటు, చేనేత మిత్ర పథకాలను పునరుద్దించేందుకు కూడా రాష్ట్ర ప్రభుత్వం సమాయత్తం అవుతోంది. ఈ మూడు పథకాలతో పాటు స్థానికంగా ఉన్న ప్రధాన సమస్యలు, నేత కార్మికుల అవసరాలపై కూడ ఎప్పటికప్పుడు తెలుసుకుని వాటిని వెంటనే నెరవేర్చడమే లక్ష్యంగా ప్లాన్ చేసుకోవాలని నిర్ణయించారు. ఈ పథకాలను అమలు చేయడం వల్ల హుజురాబాద్‌లోని 26,350 మంది ఓటర్లలో ఎక్కువ మంది టీఆర్ఎస్ వైపు చూస్తారన్న ధీమాతో అధికార పార్టీ ఉంది.

Next Story