గోదావరి జలాలతో అమరులకు నివాళులర్పించిన హరీశ్ రావు

by  |
గోదావరి జలాలతో అమరులకు నివాళులర్పించిన హరీశ్ రావు
X

దిశ, మెదక్: అమరుల ఆశయాలకు అనుగుణంగా తెలంగాణ పురోగమిస్తుందని మంత్రి హరీష్ రావు అన్నారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా సిద్ధిపేట కలెక్టరేట్ లో జాతీయ జెండాను ఆయన.. ఎమ్మెల్యే రామలింగారెడ్డి, ఎమ్మెల్సీలు రఘోత్తమ్ రెడ్డి, ఫారూఖ్ హుస్సేన్, జెడ్పీ చైర్ పర్సన్ రోజాశర్మ, జిల్లా కలెక్టర్ వెంకట్రామిరెడ్డి, సీపీ జోయల్ డేవిస్ లతో కలిసి ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. రాష్ట్రం సాధించుకున్న ఫలాలు ఈ రోజు సిద్ధిపేటకు అందాయని, గోదావరి జలాలు సిద్ధిపేటకు అందాయని చెప్పాం.. ఈ రోజు సాధించుకున్న ఘనత మనదేనన్నారు. నీళ్లు, నిధులు, నియామకాల కోసం సాధించుకున్న తెలంగాణ ఫలాలు ఒక్కొక్కటిగా అందుతున్నాయన్నారు. సీఎం కేసీఆర్ ఆమరణ దీక్షతో కేంద్రాన్ని ఒప్పించి తెలంగాణ సాధించారన్నారు. నేడు తెలంగాణ దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నదన్నారు. దేశంలో ఎవరు ఏ పథకాన్ని చేపట్టాలన్నా తెలంగాణ వైపే చూస్తున్నారన్నారు. గాంధీజీ కలలు కన్న గ్రామీణ భారతాన్ని ఈరోజు పల్లె ప్రగతి ద్వారా సాధించామన్నారు. నూతన పథకాలను చేపట్టడం.. వాటికి నిధులు ఇవ్వడం, అమలు చేయడం జరిగిందన్నారు. కరోనా లాంటి విపత్తులు వచ్చినా అభివృద్ధిని కొనసాగిస్తూ, సంక్షేమాన్ని అమలు చేస్తున్నామన్నారు. ఉద్యమ సందర్భంలో ఏ విధంగా కృషి చేశామో అదే విదంగా రాష్ట్ర అభివృద్ధిలోనూ పని చేస్తున్నామన్నారు. ప్రాజెక్టులకు భూములిచ్చిన నిర్వాసితులకు అన్ని విధాలా అండగా ఉంటామన్నారు. ఇదే అంకిత భావంతో రాబోయే రోజుల్లోనూ పని చేస్తూ బంగారు తెలంగాణకు కృషి చేస్తామన్నారు. అనంతరం నగరంలోని అమరవీరుల స్థూపం వద్ద తెలంగాణ అమర వీరులను స్మరిస్తూ స్థూపానికి కాళేశ్వరం గోదావరి జలాలతో నివాళ్ళు అర్పించారు.

Next Story