గెల్లు గెలుపు ఖాయం అంటున్న హరీష్ రావ్..

by  |
గెల్లు గెలుపు ఖాయం అంటున్న హరీష్ రావ్..
X

దిశ, జమ్మికుంట: హుజురాబాద్ ఉప ఎన్నికల్లో గెల్లు శ్రీనివాస్ యాదవ్ గెలుపు ఖాయమని, మెజార్టీ కోసమే చూస్తున్నామని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు అన్నారు. మంగళవారం జమ్మికుంట పట్టణంలోని వివిధ వార్డులకు చెందిన పలువురు టిఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా మంత్రి హరీష్ రావు మాట్లాడారు. గడిచిన 18 సంవత్సరాలలో ఈటల రాజేందర్ చేయని పనిని టిఆర్ఎస్ ప్రభుత్వం చేసి చూపెడుతుందని, ఇందులో భాగంగానే సొంతంగా స్థలాలు ఉన్నవారికి ఇండ్లు కట్టి ఇస్తామని, నాయిని చెరువు దగ్గర బతుకమ్మ ప్లాట్ ఫామ్, గణేష్ నిమజ్జనానికి ప్లాట్ ఫామ్ ల ఏర్పాటుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు.

రానున్న రోజుల్లో 50 వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్లు ఇవ్వనున్నట్లు తెలిపారు. రెండు గుంటల భూమి మాత్రమే ఉన్నా శ్రీనివాస్ పేద వాడిని, తలలో నాలుక లాగా మెదిలే వ్యక్తిని ఆశీర్వదించాలని కోరారు. రూపాయి బొట్టు బిల్లలు ఇస్తున్న బీజేపీకి ఓటు వేద్దామా..? కల్యాణ లక్ష్మి పథకం ద్వారా రూ.1 లక్ష 116 లను ఇచ్చే టీఆర్ఎస్ పార్టీకి ఓటు వేద్దామా ఆలోచించాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్, ఎమ్మెల్యేలు నన్నపనేని నరేందర్, కోరుకంటి చందర్, జమ్మికుంట మున్సిపల్ చైర్మన్ తక్కల్లపల్లి రాజేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

Next Story