జీవీకేకు హరీష్ రావు షాక్.. 108 అంబులెన్స్‌ల నుంచి ఔట్!

by  |
108 ambulance
X

దిశ, తెలంగాణ బ్యూరో : ప్రభుత్వ అంబులెన్స్‌ల మీద ఇక నుంచి జీవీకే సంస్థ పేరు కనుమరుగు కానుంది. 108 సర్వీసులో కొత్త సంస్థలను తీసుకువచ్చేందుకు సర్కార్​ప్లాన్​చేస్తోంది. ఈ మేరకు ఓపెన్​టెండర్లను పిలిచేందుకు కసరత్తు చేస్తోంది. మంత్రి హరీష్​రావు డైరెక్షన్‌లో త్వరలో విధి విధానాలు ఖరారు కానున్నాయి. వాహనాల నిర్వహణలో నిర్లక్ష్యం వహిస్తుందంటూ ఉద్యోగులు, పేషెంట్ల నుంచి ఫిర్యాదులు వస్తున్నందున ఆ సంస్థను తప్పించాలని సర్కార్ భావిస్తున్నట్లు సమాచారం. కొత్త టెండర్లను పిలిచేందుకు వైద్యాధికారులు అన్ని రకాల ఏర్పాట్లు చేస్తున్నారు.

నాలుగేళ్ల క్రితమే ముగిసింది..

రాష్ట్రంలో అంబులెన్స్‌లను నిర్వహించేందుకు కాంట్రాక్ట్​తీసుకున్న జీవీకే సంస్థ గడువు గత నాలుగేళ్ల క్రితమే ముగిసింది. కానీ కొత్త టెండర్లు పిలవకుండా ఇన్నాళ్లు ప్రభుత్వం ఆ సంస్థకే రెన్యువల్​చేస్తూ వచ్చింది. అయితే సౌకర్యాలు, సేవల్లో నిత్యం సమస్యలు వస్తుండటంతో ఇప్పుడు కొత్త టెండర్లను పిలవడానికి రెడీ అవుతున్నది. ఇదిలా ఉండగా జీవీకే నిర్వహణలో ప్రధానంగా వాహనాలు సక్రమంగా నిర్వహించలేకపోవడం, ఉద్యోగులకు సకాలంలో జీతాలు ఇవ్వకపోవడం వంటివి జరుగుతున్నాయి. పేషెంట్లను తరలించే సమయంలో పాత వాహనాలు కావడంతో ఎక్కడికక్కడే బండ్లు రోడ్లపై ఆగిపోతున్నాయి. అంతేగాక వాటికి మరమ్మతులు చేయించడం లేదు. దీంతో అంబులెన్స్‌ల కొరత ఏర్పడుతున్నది. తద్వారా సకాలంలో పేషెంట్లను తరలించలేకపోతున్నారు.

మరోవైపు కాల్​సెంటర్ ఉద్యోగులు కూడా సరైన సమయంలో ఫోన్లు లిఫ్ట్​చేయడం లేదని ఫిర్యాదులూ వస్తున్నాయి. అంతేగాక డ్రైవర్లు, టెక్నీషియన్లుకు రెండు మూడు నెలలకోసారి జీతాలు చెల్లిస్తున్నారు. దీంతో చాలా మంది డ్రైవర్లు డ్యూటీలు చేసేందుకు ఆసక్తి చూపడం లేదు. పైగా సర్కార్​బిల్లులు చెల్లించడం లేదంటూ జీవీకే పలుసార్లు బహిరంగంగానే చెప్పుకొచ్చింది. దీంతో ఆ సంస్థ సమర్ధవంతంగా పనిచేయడం లేదని 108 నిర్వహణను కొత్త సంస్థలకు ఇచ్చేందుకు ప్రభుత్వం ప్లాన్​ చేస్తున్నది.


Next Story

Most Viewed