ఈటల రాజేందర్‌ సవాల్‌పై హరీష్ రావు కౌంటర్

by  |
etala-harish
X

దిశ, జమ్మికుంట: గెల్లు శ్రీనివాస్ యాదవ్ చేతిలో ఓడిపోతానన్న భయంతోనే నన్ను పోటీకి పిలుస్తున్నారని.. ఈటల రాజేందర్‌ సవాల్‌ను మంత్రి హరీష్ రావు ఎద్దేవా చేశారు. ఆదివారం జమ్మికుంట పట్టణంలో ఇల్లందకుంట మండలానికి చెందిన అజయ్ యాదవ్ ఆధ్వర్యంలో పలువురు యువకులు బీజేపీ నుంచి టీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ.. గెల్లు శ్రీనివాస్ పేరులోనే గెలుపు ఉందని, ఆయన ఎక్కడికి వెళ్ళినా ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని.. ఇప్పటికే గెలుపు ఖాయం అయిందని పేర్కొన్నారు. ఈటల రాజేందర్ ఓటమి భయంతోనే దళిత ఎమ్మెల్యేలపై ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారని హరీష్ రావు మండిపడ్డారు.

టీఆర్ఎస్ బీజేపీ మధ్యనే పోటీ..

త్వరలో జరగబోయే హుజురాబాద్ ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్, బీజేపీ పార్టీల మధ్యనే ప్రధానంగా పోటీ ఉంటుందని, ఇక్కడ కాంగ్రెస్ పార్టీ లేనేలేదని హరీష్ రావు అభిప్రాయం వ్యక్తం చేశారు. ఆదివారం హుజురాబాద్ పట్టణంలో మున్నూరు కాపు భవనానికి భూమి పూజ చేసిన అనంతరం.. మున్నూరు కాపు ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్న మంత్రి.. ఓటు వేసేటప్పుడు బొట్టు బిల్లలు, కుట్టు మిషన్లు, గ్రైండర్‌ల గురించి ఆలోచించ వద్దన్నారు. ఎవరు గెలిస్తే ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుందో వారికే ఓటు వేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో మంత్రి గంగుల కమలాకర్, మాజీ మంత్రి ఇనుగాల పెద్దిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.


Next Story