ఇంటర్​ ఫస్టియర్‌లో సగానికి సగం ఫెయిల్​

by  |
Intermediate Fastier
X

దిశ, తెలంగాణ బ్యూరో : ఇంటర్ ​ఫస్టియర్ ​ఫలితాల్లో సగానికి సగం మంది విద్యార్థులు ఫెయిలయ్యారు. ఇప్పుడు ఇంటర్మీడియట్​సెకండియర్ చదువుతున్న విద్యార్థులకు ఫస్టియర్​పరీక్షలను ఈ ఏడాది అక్టోబర్​25వ తేదీ నుంచి నవంబర్​3వ తేదీ వరకు ఇంటర్మీడియట్​బోర్డు నిర్వహించింది. కాగా ఈ పరీక్షల్లో 49 శాతం మంది విద్యార్థులు మాత్రమే పాసవ్వడం గమనార్హం. 4,09,911 మంది జనరల్​ఇంటర్​విద్యార్థులకుగాను 1,99,786 మంది విద్యార్థులు మాత్రమే పాసయ్యారు. వొకేషనల్​కోర్సుల్లో 49,331 మందికి 10,517 మంది మాత్రమే ఉత్తీర్ణత సాధించారు. మొత్తంగా 4,59,242 మంది విద్యార్థులకు గాను 2,24,012 మంది విద్యార్థులు మాత్రమే పాసయ్యారు. గతంలో ఎన్నడూ లేనంతగా ఇంత తక్కువగా 49 శాతం మాత్రమే వచ్చింది.

జిల్లాలవారీగా జనరల్, వొకేషనల్​విద్యార్థుల పాస్​పర్సంటేజీ చూసుకుంటే అత్యధికంగా మేడ్చల్​జిల్లాలో 63 శాతం మంది ఉత్తీర్ణత సాధించారు. అత్యల్పంగా మెదక్​జిల్లాలో 22 శాతం మంది మాత్రమే ఉత్తీర్ణులయ్యారు. ఈ ఫలితాలపై ఇంటర్మీడియట్​బోర్డు సంతృప్తి వ్యక్తం చేయడం గమనార్హం. ప్రత్యక్ష పద్ధతిన క్లాసులు లేకపోయినప్పటికీ ఆన్​లైన్​తరగతుల ద్వారా విని విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొంటూ మరీ పరీక్షలు రాశారని బోర్డు తెలిపింది.

కొవిడ్​మహమ్మారి 2020 నుంచి విపరీతంగా వ్యాప్తి చెందడంతో ప్రభుత్వాలు లాక్​డౌన్ విధించాయి. దీంతో పాఠశాలలు సైతం మూతపడ్డాయి. విద్యాబోధన మొత్తం ఆన్​లైన్​లోనే జరిగింది. కాగా కొద్ది నెలల క్రితం నుంచి ప్రత్యక్ష పద్ధతిన క్లాసులు ప్రారంభమయ్యాయి. అయితే ఆన్​లైన్‌లో ఆ క్లాసులను ఎందరు విన్నారో తెలియదు. ఏం విన్నారో తెలియదు. దీంతోపాటు ఆన్ లైన్​తరగతుల వల్ల విద్యార్థుల సందేహాలకు నివృత్తి లభించకపోవడంతో కొంత కష్టంగా మారింది. దీంతో ఆన్​లైన్ తరగతులను ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు. దీనికితోడు ఇంటర్మీడియట్​బోర్డు కూడా పరీక్షలు నిర్వహిస్తాం.. అని చెప్పినా రెండుసార్లు వాయిదా వేశారు.

ఎలాంటి పరీక్షలు నిర్వహించకుండానే వారిని పైతరగతులకు ప్రమోట్​చేశారు. పాసయ్యామనే ధీమాలోనే విద్యార్థులు సెకండియర్​తరగతులను ప్రత్యక్ష పద్ధతిలో కొనసాగిస్తున్నారు. అలాంటి సమయంలో ఇంటర్మీడియట్​బోర్డు బాంబు పేల్చింది. ప్రస్తుతం సెకండియర్​చదువుతున్న విద్యార్థులు పరీక్షలు రాయాలని షెడ్యూల్​విడుదల చేసింది. గతంలో కూడా ఇలా రెండుసార్లు చెప్పి వాయిదా వేయడంతో విద్యార్థులు ఈసారి కూడా వాయిదా వేస్తారని భావించారు. దీంతో పరీక్షలపై పూర్తిస్థాయిలో ఫోకస్ పెట్టలేదు. వారు మానసికంగా కూడా సిద్ధం కాకపోవడంతో కేవలం 49 శాతం మంది విద్యార్థులు మాత్రమే పాసయ్యారు.

బాలికలదే పైచేయి

ఇంటర్​ఫస్టియర్​ఫలితాల్లో బాలికలే ఎక్కువ మంది ఉత్తీర్ణత సాధించారు. విద్యార్థులు, విద్యార్థినులు జనరల్, వొకేషనల్​కలిపి మొత్తం 4,59,242 మంది పరీక్ష రాయగా అందులో 2,24,012 మంది పాసయ్యారు. 2,26,616 మంది విద్యార్థినులకు 1,26,289 మంది ఉత్తీర్ణత సాధించారు. 2,32,626 మంది ఎగ్జామ్స్​రాస్తే 97,723 మంది మాత్రమే పాసయ్యారు. 56 శాతం మంది విద్యార్థినులు పాసైతే.. విద్యార్థులు 42 శాతం మాత్రమే ఉత్తీర్ణులయ్యారు. వొకేషనల్‌లోనూ బాలికలదే పైచేయిగా ఉంది. 22,079 మంది బాలికలకు 13,709 మంది పాసయ్యారు. 62 శాతం ఉత్తీర్ణత సాధించారు. అబ్బాయిలు 27,252 మందికి 10,517 మంది పాసయ్యారు. 39 శాతం మాత్రమే ఉత్తీర్ణులయ్యారు. జనరల్​లో 1,02,808 మంది, వొకేషనల్​లో 12,730 మంది విద్యార్థులు కలిపి మొత్తం 1,15,539 మంది ఏ గ్రేడ్‌లో ఉత్తీర్ణత సాధించారు. బీ గ్రేడ్‌లో ఉత్తీర్ణులైనవారు 66,351 మంది. ఇందులో జనరల్​విద్యార్థులు 55,707 మంది ఉంటే.., 10,644 మంది వొకేషనల్​విద్యార్థులున్నారు.

కాగా విద్యార్థులు మార్కుల మెమోను శుక్రవారం సాయంత్రం 5 గంటల నుంచి డౌన్​లోడ్​చేసుకోవచ్చని ఇంటర్మీడియట్​బోర్డు స్పష్టం చేసింది. ఫలితాల్లో వ్యత్యాసమున్నట్లయితే సంబంధిత కళాశాలల ప్రిన్సిపాళ్ల ద్వారా బోర్డు దృష్టికి తీసుకురావాలని బోర్డు అధికారులు వెల్లడించారు. మార్క్స్​మెమోరండంలో మార్పులకు ఈ నెల 31వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలని బోర్డు సూచించింది.

జనరల్​స్ట్రీమ్‌లో గ్రూపుల వారీగా చూసుకుంటే ఎంపీసీ విద్యార్థులు 61 శాతం ఉత్తీర్ణత సాధించారు. బైపీసీలో 55 శాతం విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. వొకేషనల్​కోర్సుల్లో అగ్రికల్చర్​కోర్స్ విద్యార్థులు 52 శాతం, బిజినెస్​కామర్స్​51శాతం, పారామెడికల్​విద్యార్థులు 60 శాతం పాసయ్యారు. జనరల్​స్ట్రీమ్​కోర్సుల్లో ప్రభుత్వ కాలేజీ విద్యార్థులతో పోల్చితే ప్రైవేట్​కాలేజీల విద్యార్థులే అత్యధిక మార్కులు సాధించారు. వొకేషనల్‌లో ప్రైవేట్​విద్యార్థులతో పోల్చితే ప్రభుత్వ కాలేజీల విద్యార్థులే అత్యధిక మార్కులు సాధించడం విశేషం.

ఈనెల 22 వరకే రీకౌంటింగ్, రివెరిఫికేషన్‌కు గడువు

రీకౌంటింగ్, రివెరిఫికేషన్​చేసుకోవాలనుకునే విద్యార్థులు రికౌంటింగ్​కోసం ప్రతి సబ్జెక్టుకు రూ.100 చెల్లించాలని ఇంటర్మీడియట్​బోర్డు స్పష్టం చేసింది. జవాబు పత్రాల రీ వెరిఫికేషన్‌కు ఒక్కో సబ్జెక్టుకు రూ.600 చెల్లించాలని తెలిపింది. ఇందుకు ఆన్​లైన్‌లో http://tsbie.cgg.gov.in అనే వెబ్​సైట్​ద్వారా దరఖాస్తు చేసుకోవాలని, విద్యార్థుల పూర్తి అడ్రస్‌తో పాటు, ఈమెయిల్​ఐడీ, మొబైల్​నంబర్ కూడా అందించాలని సూచించింది. దీనికి గడువు ఈనెల 22 వరకే ఉంటుందని, పొడిగించటం కుదరదని స్పష్టం చేసింది.

ఫెయిలైన విద్యార్థులు మానసికంగా ఒత్తిడికి గురికాకుండా ఉండేందుకు సైకాలజిస్టులను ఇంటర్మీడియట్​బోర్డు ఏర్పాటు చేసింది. గతంలో కొందరు విద్యార్థులు ఫెయిలయ్యామనే ఆందోళనకు గురై మానసిక ఒత్తిడి పెరిగి ఆత్మహత్యలకు పాల్పడ్డారు. అలాంటి ప్రమాదాలను జరగకుండా నివారించేందుకు సైకాలజిస్టులను బోర్డు ఏర్పాటు చేసింది. విద్యార్థులు ఒత్తిడి నుంచి బయటపడేందుకు ప్రతిరోజు ఉదయం 9 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు సైకాలజిస్టులను ఫోన్​ద్వారా సంప్రదించాలని బోర్డు సూచించింది. 9154951 704, 977, 695, 699, 703, 706, 687 నంబర్లకు సంప్రదించాలన్నారు.

పరీక్షల నిర్వహణపై ఫైర్

కార్పొరేట్ కళాశాలలకు లాభం చేకూర్చడానికే ప్రస్తుతం ఇంటర్​సెకండియర్​చదువుతున్న విద్యార్థులకు ఫస్టియర్​పరీక్షలు నిర్వహించారని తెలంగాణ ఇంటర్​పరిరక్షణ సమితి సభ్యులు ఇంటర్మీడియట్​బోర్డు తీరుపై ఫైరయ్యారు. ఇంటర్​ఫలితాల్లో కార్పొరేట్​కాలేజీల్లోనే ఉత్తీర్ణత శాతం ఎక్కువగా ఉందని వారు ఆరోపణలు చేశారు. ప్రభుత్వ కాలేజీల్లో చదివే విద్యార్థులకు సరైన సదుపాయాలు లేకపోవడంతో వారికి తీవ్ర నష్టం జరిగిందని, అందుకే వెనుకబడ్డారని వారు వెల్లడించారు. ఫెయిలైన విద్యార్థుల పూర్తి బాధ్యత ఇంటర్ బోర్డు, సంబంధిత అధికారులపైనే ఉందని వారు పేర్కొన్నారు. బోర్డు తప్పుడు నిర్ణయాల ద్వారా ప్రభుత్వ విద్యారంగ కళాశాలల్లో చదివే విద్యార్థుల భవిష్యత్​నష్టపోకుండా సర్కార్​తగిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్​ చేశారు.



Next Story

Most Viewed