GWMC నిర్లక్ష్యం.. రోడ్డున పడ్డ 13 మంది వీధి వ్యాపారులు

by  |
GWMC నిర్లక్ష్యం.. రోడ్డున పడ్డ 13 మంది వీధి వ్యాపారులు
X

దిశ‌, కాళోజీజంక్షన్ : గ్రేటర్‌ వరంగల్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ అధికారుల నిర్లక్ష్యం కారణంగా దాదాపు 13 మంది వీధి వ్యాపారులు రోడ్డున పడ్డారు. మూడేళ్ల కిందట జీడబ్ల్యూఎంసీ అధికారులు పట్టణంలోని పలు చోట్ల వెండర్స్‌ జోన్స్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. అందులో భాగంగా పబ్లిక్‌ గార్డెన్‌లోని టీటీడీ కల్యాణ మండపం దారిలో వీధి వ్యాపారులకు దుకాణాలను ఏర్పాటు చేసి, 60 మంది వ్యాపారులకు కేటాయించి అనుమతులు ఇచ్చారు. అప్పట్లోనే ప్రవేశ మార్గం ప్రతిపాదనలు ఉన్నా అధికారులు వాటిని పెడచెవిన పెట్టి, దుకాణాల నిర్మాణాలు చేపట్టారు.

ఇప్పుడు ఆ కారణాన్నే చూపి, ముఖ ద్వారానికి అడ్డుగా ఉన్నాయంటూ 13 దుకాణాలను కూల్చివేశారు. కూల్చివేసిన వారికి మరో చోట దుకాణాలను ఏర్పాటు చేసుకునేందుకు జీడబ్ల్యూఎంసీ అవకాశం కల్పించలేదు. దుకాణాలను కూల్చివేసే సమయంలో బాధిత వ్యాపారులు జీడబ్ల్యూఎంసీ అధికారులను వేడుకున్నా కనికరం చూపలేదని వ్యాపారులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. పైగా దుకాణ సముదాయాలను నిర్మించేటప్పుడు వీధి వ్యాపారుల సంఘం నేత‌లు, దుకాణాదారులు ఒక్కొక్కరి వద్ద రూ. 50 వేల నుంచి రూ.ల‌క్ష వ‌ర‌కు వ‌సూలు చేసిన‌ట్లుగా ఆరోప‌ణ‌లున్నాయి.

Next Story

Most Viewed