పల్లెల్లో గుప్పుమంటున్న గుడుంబా..

by  |
పల్లెల్లో గుప్పుమంటున్న గుడుంబా..
X

దిశ, మేడ్చల్: రాష్ట్రంలో సారా ఏరులై పారుతోన్నట్టు తెలుస్తోంది. రాష్ట్రంలో గుడుంబా నిషేధంలో ఉన్నా గత వారం రోజులుగా మళ్లీ పంజా విప్పినట్టు సమాచారం. లాక్‌ డౌన్‌తో మద్యం బంద్‌ కావడంతో ప్రస్తుతం పల్లెల్లో గుట్టుచప్పుడు కాకుండా తయారు చేస్తున్నారు. అది కూడా యూరియాతో తయారు చేస్తుండటం గమనార్హం. సారా ధర కూడా డబుల్‌ అయింది.

లాక్‌డౌన్‌తో మద్యం బంద్‌..

కరోనా వైరస్ (కోవిడ్ 19) మహమ్మారి కట్టడి కోసం సర్కారు లాక్‌డౌన్‌ ప్రకటించింది. ఈ నేపథ్యంలో అత్యవసర సేవలు మినహా మిగతా వాటన్నింటిని మూసివేసింది. ఇందులో భాగంగానే మద్యం, కల్లు దుకాణాలు, బార్లు, కూడా మూతపడ్డాయి. దీంతో వ్యసనపరులకు తిప్పలు మొదలయ్యాయి. కొంత మంది నిత్యం తాగితే కాని స్థిమితంగా ఉండలేరు. వణకడం, నాలుక పిడిశ కట్టుకుపోవడం, తల దిమ్మదిమ్మ కొట్టుకోవడం, కిందపడిపోవడం, ఆందోళనకు గురవుతారు. మార్చి 22 నుంచి మద్యం బంద్‌ కాగా, మొదట ఒకటి, రెండు రోజులు ఉండగలిగారు. ఇప్పటికే 10రోజులు గడవడంతో అడిక్టర్స్‌ తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దీంతో మందు లేకున్నా సారాతో అయినా సరిపెట్టుకుంటున్నారు.

యూరియాతో తయారీ..

రాష్ట్రంలో గుడుంబా నిషేధంలో ఉంది. గత కొంత కాలంగా గుడుంబా తయారీ, అమ్మకాలు చాలా వరకు తగ్గిపోయాయి. గుడుంబా రహిత రాష్ట్రంగా ప్రభుత్వం కూడా ప్రకటించింది. కానీ, లాక్‌డౌన్‌తో మళ్లీ తెరపైకి వచ్చింది. మద్యం దొరక్కపోవడంతో సారాకు డిమాండ్‌ పెరిగినట్లయింది. దీంతో నిర్వాహకులకు గుట్టుచప్పుడు కాకుండా సారాను తయారు చేస్తున్నారు. రహస్యంగా బట్టీలు పెడుతున్నారు. అయితే, గతంలో బెల్లం, పట్టికతో తయారు చేసేవారు. కాని ప్రస్తుతం యూరియాతో గుడుంబా తయారు చేస్తున్నారు. ఇది ఆరోగ్యానికి ప్రమాదకరం.

రేట్‌ డబుల్‌..

మస్తు డిమాండ్‌తో ప్రస్తుతం సారా వ్యాపారం మూడు పువ్వులు, ఆరుకాయలు అన్న చందంగా మారింది. గ్రామాల్లో బెల్ట్‌ షాపుల కంటే సారాకు గిరాకీ బాగా పెరిగిందని నిర్వాహకులు చెబుతున్నారు. లాక్‌డౌన్‌తో ధర డబుల్‌ అయ్యింది. సారాను సీసా(750ఎంఎల్‌) రూ. 120 నుంచి రూ. 150 వరకు విక్రయిస్తున్నారు. గతంలో మాత్రం సీసాకు 60 నుంచి 80 వరకు మాత్రమే అమ్మేవారు. ఇక నిత్యం సారా తాగితే ఇళ్లు, ఒళ్లు గుల్ల అవుతుందని డాక్టర్లు సూచిస్తున్నారు.

పల్లెల్లోనే ఎక్కువగా..

ప్రస్తుతం గుడుంబా తయారీ, విక్రయాలు పెరిగిపోయాయి. సారా తయారీ ఎక్కువగా గిరిజన ప్రాంతాల్లో తయారు చేస్తున్నట్లు తెలుస్తోంది. పెద్దపల్లి, ఆదిలాబాద్‌, మహబూబాబాద్‌, కొత్తగూడెం, జయశంకర్‌ భూపాలపల్లి, ఖమ్మం, నారాయణపేట, సిద్దిపేట, నాగర్‌కర్నూల్‌, వనపర్తి, నల్లగొండ, సూర్యాపేట జిల్లాల్లోని తండాల్లో ఎక్కువగా గుడుంబాను తయారు చేస్తున్నారు. నిర్వాహకులు తయారు చేసి, ఇతర ప్రాంతాలకు కూడా తరలిస్తున్నారు. బెల్ట్‌ షాపు నిర్వాహకులతోపాటు మరికొందరు సీక్రెట్‌గా అమ్మకాలు జరుపుతున్నారు. ప్రస్తుతం పల్లెల్లో సారా ఏరులై పారుతోంది. ఇక గుడుంబా తయారీ, అమ్మకాలు పెరగడంతో ఎక్సైజ్‌ శాఖ సీరియస్‌గా తీసుకున్నట్లు తెలిసింది. పెద్ద మొత్తంలో పెరిగే కంటే ముందే అరికట్టాలని భావిస్తోంది.

ఇటీవల సారా పట్టుబడిన ఘటనలు..

మార్చి 18: వనపర్తి జిల్లాలోని నాగవరంతండా, రాజపేట పెద్ద తండా, బానెగాని తండా, రాజపేట గ్రామాల్లో అధికారులు దాడులు చేసి, బెల్లంపాకాన్ని స్వాధీనం చేసుకున్నారు.

మార్చి 31: జయశంకర్‌ భూపాలపల్లిలోని రామన్నగూడెం తండా, పోచంపల్లిలో గుడుంబా తయారు చేస్తుండగా దాడులు నిర్వహించి, 1500 లీటర్ల బెల్లం పానకం గుర్తించారు. 13మందిపై కేసులు పెట్టారు.

ఏప్రిల్‌ 1: సిద్దిపేట జిల్లాలోని పలు తండాల్లో సీఐ మహేందర్‌కుమార్‌ ఆధ్వర్యంలో గుడుంబా తయారీ కేంద్రాలపై దాడులు నిర్వాహించారు. సారాను స్వాధీనం చేసుకుని, కేసు నమోదు చేశారు.

Tags: gudumba making, coronavirus, covid 19, effect, on wine shop


Next Story

Most Viewed