ఖమ్మంలో మళ్లీ ప్రారంభం.. షాక్ కు గురైన అధికారులు!

by  |
ఖమ్మంలో మళ్లీ ప్రారంభం.. షాక్ కు గురైన అధికారులు!
X

దిశ‌, ఖ‌మ్మం: లాక్‌డౌన్ నేప‌థ్యంలో భ‌ద్రాద్రి కొత్త‌గూడెం జిల్లాలో గుడుంబా త‌యారీ మ‌ళ్లీ ఊపందుకుంది. జిల్లా కేంద్రానికి ఆనుకుని ఉన్న మండ‌లాలతో పాటు ఏజెన్సీ మండ‌లాల్లో గుడుంబా త‌యారీ జోరుగా సాగుతోన్నది. తయారు చేసిన గుడుంబాను ర‌వాణా చేసే సమయంలో ఎంతో జాగ్ర‌త్త‌లు తీసుకుంటున్నారు. ప్ర‌ధాన‌ రోడ్డు మార్గాల గుండా కాకుండా పిల్ల బాట‌ల గుండా స‌రుకును రాత్రివేళ‌ల్లో గ్రామాలు, తండాల‌కు చేరవేస్తున్నారు.

జిల్లాలోని టేకులపల్లి, చండ్రుగొండ, అశ్వారావుపేట, ములకలపల్లి, దమ్మపేట, గుండాల, జూలురుపాడు, చుంచుపల్లి, అన్నపురెడ్డిపల్లి, భద్రాచలం, దుమ్ముగూడెం చర్ల, బూర్గంపాడు, అశ్వాపురం, మణుగూరు మండ‌లాల్లో గుడుంబా త‌యారీ ఎక్కువ‌గా జ‌రుగుతోన్నది. ఆయా మండ‌లాల్లో నీటి స‌దుపాయం ఉన్న అట‌వీ ప్రాంతాల‌ను స్థావ‌రాలుగా మార్చుకున్నారు. కూలీ, ఇత‌ర‌త్రా ప‌నుల‌కు వెళ్తున్న‌ట్లుగా ర‌హ‌స్య స్థావ‌రాల‌కు సంచుల్లో గుడుంబా త‌యారీకి అవ‌స‌ర‌మైన బెల్లం, ప‌టిక‌ను భారీ ఎత్తున తీసుకెళ్తున్నారు. లాక్‌డౌన్ ప‌ర్య‌వేక్ష‌ణ‌కే పోలీస్ సిబ్బంది ప‌రిమితం కావ‌డంతో గుడుంబా తయారీదారుల‌కు బాగా క‌లిసివ‌స్తోన్నది. ఇటీవ‌ల ముల‌క‌ల‌ప‌ల్లి మండ‌లంలోని ఏజెన్సీ గ్రామాల్లో ఎక్సైజ్ అధికారులు పెద్ద ఎత్తున గుడుంబా పాన‌కాన్ని ధ్వంసం చేశారు. విశ్వ‌స‌నీయ స‌మాచారంతో దాడులకు వెళ్లిన అధికారులు అక్క‌డి త‌యారీ విధానం చూసి షాక్ కు గురయ్యారు. పెద్ద పెద్ద డ్ర‌మ్ముల్లో ప‌దుల సంఖ్య‌లో బెల్లం పాన‌కం నాన‌బెట్టి ఉండ‌టం గ‌మ‌నార్హం. బెల్లం, ప‌టిక‌తోపాటు అట‌వీలో స‌హ‌జంగా ల‌భ్య‌మ‌య్యే ఇప్ప‌పువ్వును కూడా గుడుంబా త‌యారీకి వినియోగిస్తున్న‌ట్లు అధికారులు గుర్తించారు.

గ‌త‌ చ‌రిత్ర ఉన్న‌వారే..

గ‌తంలో గుడుంబా త‌యారు చేసి అధికారుల హెచ్చ‌రిక‌ల‌తో మానుకున్నవారే ఇప్పుడు మ‌ళ్లీ రంగంలోకి దిగిన‌ట్లు స‌మాచారం. టేకుల‌ప‌ల్లి, ముల‌కల‌ప‌ల్లి, దుమ్ముగూడెం, చ‌ర్ల ప్రాంతాల్లోని వ్యాపారులు నిత్యం వేలాది లీట‌ర్ల గుడుంబాను త‌యారు చేసి ఆ చుట్టు ప‌క్క‌ల గ్రామాల‌కు ర‌వాణా చేస్తున్న‌ట్లు తెలుస్తోన్నది. లాక్‌డౌన్ అమ‌ల్లోకి వ‌చ్చిన నాటి నుంచి ఈ నాలుగు మండ‌లాల్లో గుడుంబా వాస‌న పెరిగింది. గ‌తంలో శేరు గుడుంబా ధ‌ర రూ.60 నుంచి 70వ‌ర‌కు ఉండేది. లాక్‌డౌన్‌ కారణంగా మ‌ద్యం విక్ర‌యాలు నిలిచిపోవ‌డంతో గుడుంబా విక్ర‌యదారులు రేట్ల‌ను అమాంతం పెంచేశారు. ఇప్పుడు ఆ శేరు గుడుంబాను రూ.130 నుంచి 150 వ‌ర‌కు విక్ర‌యిస్తుండ‌టం గ‌మ‌నార్హం.

tags: Khammam, kothagudem, illegal gudumba manufacture, authorities, lockdown, high rates

Next Story

Most Viewed