నల్లగొండ జిల్లా ప్రజలకు ఎట్టకేలకు గుడ్ న్యూస్!

by  |
నల్లగొండ జిల్లా ప్రజలకు ఎట్టకేలకు గుడ్ న్యూస్!
X

దిశ, నల్లగొండ: కరోనా వైరస్ వ్యాప్తి నియంత్రణలో భాగంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు లాక్‌డౌన్ విధించాయి. కరోనా కేసులు తగ్గుముఖం పట్టడంతో లాక్‌డౌన్ విధుల్లో సడలింపులు చేశారు. దీంతో ఉమ్మడి నల్లగొండ జిల్లాలో వ్యాపారాలు ఊపందుకుంటున్నాయి. దాదాపు 45 రోజుల తర్వాత దుకాణాలు తెరుచుకోవడంతో ఏ షాపులో చూసినా పదుల సంఖ్యలో జనం కనబడుతున్నారు. లాక్‌డౌన్ నిబంధల్లో సడలింపులు ఇవ్వడంతో ఇటు దుకాణాల వద్ద.. అటు రోడ్లపైనా జనం సందడి నెలకొన్నది. అయితే వ్యక్తిగత దూరం పాటించాలన్న నిబంధనలను మాత్రం చాలా దుకాణాల వద్ద పాటించడం లేదు. కనీసం వినియోగదారులు మాస్కులు ధరించకుండానే దుకాణాల వద్దకు, రోడ్లపైకి వస్తున్నారు. లాక్‌డౌన్ ముగిసే వరకు ఈ విధానం అమలు కానుంది. అయితే పూర్తి స్థాయిలో వ్యాపారాలు ఊపందుకునేందుకు మాత్రం కనీసం రెండు నెలలైనా పట్టే అవకాశం లేకపోలేదు.

ఉమ్మడి నల్లగొండలో ఇదీ పరిస్థితి..

ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని మున్సిపాలిటీల్లో నిత్యం 50 శాతం దుకాణాలకు మాత్రమే ప్రభుత్వం అనుమతినిచ్చింది. దీంతో సూర్యాపేట, నల్లగొండ, యాదాద్రి-భువనగిరి జిల్లాల్లో అధికారులు సరి-బేసి విధానం అమలు చేస్తున్నారు. అందులో భాగంగానే నల్లగొండలోని ప్రకాశం బజార్, నెహ్రూగంజ్, రామగిరి, హైదరాబాద్ రోడ్డులోని షాపులకు నెంబర్లు కేటాయించారు. వాటికి సంబంధించి సరి-బేసి రెండింట్లో ఏ దుకాణాలను తెరవాలనేదానిపై లాటరీ తీసి నిర్ణయిస్తున్నారు. అదే సమయంలో భువనగిరిలోనూ నెంబర్లు కేటాయించేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. ఇప్పటికే ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా సగానికి పైగా దుకాణాలు తెరుచుకున్నాయి. రెడ్ జోన్ పరిధిలో ఉన్న సూర్యాపేట జిల్లాలో సైతం అక్కడక్కడ దుకాణాలు తెరుచుకున్నాయి. అయితే నల్లగొండ విషయానికొస్తే.. ఎస్పీటీ మార్కెట్, ప్రకాశం బజార్, నెహ్రూ గంజ్, రామగరి, డీవీకే రోడ్డు, బీటీఎస్, హైదరాబాద్ రోడ్డు, శివాజీ నగర్, పద్మజ్యోతి కాంప్లెక్స్, ఎల్‌పీటీ మార్కెట్ దుకాణాల్లో రద్దీ పాత రోజులను తలపిస్తోన్నది.

మూడు విభాగాలుగా దుకాణాలు..

దుకాణాలు తెరిచేందుకు అధికారులు మూడు విభాగాలుగా నిర్ణయించారు. అందులో ఏ, బీ, సీ విభాగాలుగా ఉన్నాయి. ‘ఏ’ విభాగంలో ఆహార ఉత్పతులు, భవన నిర్మాణ పరికరాలు, మెడికల్ దుకాణాలు, వ్యవసాయ ఎరువుల షాపులు, వ్యవసాయ సంబంధిత పరికరాల షాపులు, కూరగాయల మార్కెట్లు, పాల కేంద్రాలు, మెకానిక్ దుకాణాలు తెరుస్తారు. విభాగం ‘బి’ లో బట్టల దుకాణాలు, స్టీల్, సెల్ ఫోన్ షాపులు, కటింగ్ దుకాణాలు, లేడీస్ ఎంపోరియం, ఫోటో స్టూడియోలు, ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రికల్స్, కలర్ ల్యాబ్, బుక్ స్టాల్స్‌ను తెరుస్తారు. ‘సీ’ విభాగంలో కోచింగ్ సెంటర్లు, విద్యా సంస్థలు, సినిమా హాల్స్, బేకరీలు, హోటళ్లు, సినిమా థియేటర్లు, టిఫిన్ సెంటర్లు, పాన్ డబ్బాలు, దాబాలు, రెస్టారెంట్లు, హాస్టళ్లు, మెస్‌లు తదితర అన్ని వ్యాపారాలు ఈ విభాగం కిందకు వస్తాయి. అయితే ఏ విభాగంలోని దుకాణాలు రోజు తెరుస్తారు. బి విభాగంలోని దుకాణాలను మాత్రం సరి-బేసి విధానంలో తెరుస్తారు. సి విభాగంలోని దుకాణాలు ఈ నెల 29 వరకు తెరుచుకోవు.

రెడ్‌జోన్‌లోని సూర్యాపేటలో..

సూర్యాపేట పట్టణం రెడ్ జోన్‌గానే కొనసాగుతోన్నది. అయితే జిల్లా కేంద్రంలో నిత్యావసర సరుకుల ఇబ్బందులను తొలగించేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. అందులో భాగంగా ప్రజలకు ఒక్కచోటుకి రాకుండా ఉండేందుకు నాలుగు వార్డులకు ఒకటి చొప్పున కూరగాయల మార్కెటును ఏర్పాటు చేశారు. పట్టణంలోని రామన్ కాన్సెప్ట్ స్కూల్, వీఆర్డీఆర్ థియేటర్, కుడకుడ రోడ్డు, కృష్ణ కాలనీ, ఆర్ అండ్ బీ గెస్ట్ హౌజ్, గాంధీ పార్కు, ప్రభుత్వ జూనియర్ కాలేజీ, పాత మున్సిపాలిటీ కార్యాలయం, లయన్స్ క్లబ్, కృష్ణా థియేటర్ ప్రాంతాల్లో మార్కెట్లు ఏర్పాటు చేశారు.

భాగ్యనగరానికి బత్తాయి అమ్మకాలు..

ఉమ్మడి నల్లగొండ జిల్లాలో రికార్డు స్థాయిలో పండే బత్తాయి, మామిడి పండ్లకు గిరాకీ లేక రైతులు అల్లాడిపోతున్నారు. దీన్ని పరిగణనలోకి తీసుకున్న అధికార యంత్రాంగం ఉద్యాన శాఖ ఆధ్వర్యంలో హైదరాబాద్ నగరానికి మామిడి, బత్తాయి పండ్లను అమ్ముతున్నారు. టీఎస్ ఫ్రెష్ యాప్ ద్వారా బుక్ చేసుకున్న రైతులకు మామిడి, బత్తాయి పండ్లను డోర్ డెలివరీ చేస్తున్నారు. బత్తాయి ప్యాకింగ్, నిర్వహణ ఛార్జీలు కలుపుకుని 10 కిలోల సంచిని రూ.400 కు నల్లగొండ జిల్లా నుంచి సరఫరా చేస్తున్నారు.



Next Story

Most Viewed