‘గ్రేటర్’ పోరు ఉగాది తర్వాతే?.. చక్రం తిప్పనున్న ఎర్రబెల్లి!

by  |
‘గ్రేటర్’ పోరు ఉగాది తర్వాతే?.. చక్రం తిప్పనున్న ఎర్రబెల్లి!
X

దిశ ప్రతినిధి, వ‌రంగ‌ల్ : గ్రేట‌ర్ వ‌రంగ‌ల్ మునిసిప‌ల్ కార్పోరేష‌న్ ఎన్నిక‌ల నోటిఫికేష‌న్‌ ఉగాది త‌ర్వత ఏరోజైనా వెలువ‌డే అవ‌కాశం ఉంద‌ని తెలుస్తోంది. ఈ నేప‌థ్యంలో అధికార పార్టీలో రాజ‌కీయ హ‌డావుడి క‌నిపిస్తోంది. ఇప్పటికే డివిజ‌న్ల పున‌ర్విభ‌జ‌న ప్రక్రియ‌ను దిగ్విజ‌యంగా అధికారులు పూర్తి చేశారు. ప్రస్తుతం బీసీ, ఎస్సీ జ‌న గ‌ణ‌నకొన‌సాగుతోంది. దీని త‌ర్వాత డివిజ‌న్లకు రిజర్వేష‌న్ల కేటాయింపు ఉండనుంది.ఈ ప్రక్రియంతా మ‌రో వారం రోజుల్లో పూర్తవుతుంద‌ని అధికార వ‌ర్గాల సమాచారం.ఆ త‌ర్వాత ఏమాత్రం ఆల‌స్యం చేయ‌కుండా ఎన్నిక‌ల‌కు వెళ్లేలా అధికార పార్టీ రంగం సిద్ధం చేసుకుంటున్నట్లుగా తెలుస్తోంది. పట్టభద్ర ఎమ్మెల్సీ ఎన్నికల్లో నల్లగొండ, వరంగల్‌, ఖమ్మం జిల్లాలతో కూడిన నియోజక వర్గాన్ని కైవసం చేసుకున్న టీఆర్‌ఎస్‌ అదే ఊపుతో ఇటు సాగర్‌ ఎన్నికకు, అటు కార్పోరేషన్‌ ఎన్నికలకు రెడీ అయింది. ఇప్పటికే నాగార్జున సాగర్‌ ఉప ఎన్నికల ప్రచారంలో టీఆర్‌ఎస్‌ దూసుకుపోతుండగా, ఈనెల 17న పోలింగ్‌ జరగనుంది. తాజాగా పోలీస్‌ కమిషనర్ల బదిలీల నేపథ్యంలో.. ఏక్షణమైనా కార్పోరేషన్‌ ఎన్నికల నోటిఫికేషన్‌ జారీ అయ్యే అవకాశముందని సమాచారం. అధికార వ‌ర్గాల నుంచి అందుతున్న స‌మాచారం ప్రకారం.. ఈనెల 17లోగా ఖమ్మం, వరంగల్‌ కార్పోరేషన్ల ఎన్నికల‌కు నోటిఫికేషన్‌ జారీ కానుంది. నోటిఫికేష‌న్ విడుద‌లైన నాటి నుంచి 13రోజుల్లోగా పోలింగ్ నిర్వహించేలా క‌స‌ర‌త్తు జ‌రుగుతున్నట్లు తెలుస్తోంది. అంటే దాదాపు ఈనెల‌లోనే గ్రేట‌ర్ ఎన్నిక‌ల పోలింగ్ కూడా ఉంటుంద‌ని స్పష్టమ‌వుతోంది. మే 2లోగా ఎన్నిక‌ల లెక్కింపు కూడా పూర్తి చేస్తార‌ని వినిపిస్తోంది.

బాధ్యత‌ల‌న్నీ మంత్రి ద‌యాక‌ర్‌రావుకే… ప్రచారానికి కేటీఆర్‌..

వ‌రంగ‌ల్ కార్పోరేష‌న్ ఎన్నిక‌ల బాధ్యత‌లను ముఖ్యమంత్రి కేసీఆర్‌ పూర్తిగా మంత్రి ద‌యాక‌ర్‌రావుకు అప్పగించిన‌ట్లుగా విశ్వస‌నీయ స‌మాచారం. మొత్తం ఐదు నియోజ‌క‌వ‌ర్గాల ప‌రిధిలో విస్తరించి ఉన్న కార్పోరేష‌న్ ఎన్నిక‌ల‌ను గ‌ట్టెక్కించాలంటే ప్రతీ నియోజ‌క‌వ‌ర్గంలో బ‌ల‌మైన క్యాడ‌ర్‌ను క‌లిగి ఉన్న ఎర్రబెల్లితోనే సాధ్యమ‌వుతుంద‌ని, టికెట్ల పంపిణీ, ప్రచార బాధ్యత‌లు వంటి అంశాల్లో ఆయ‌న నిర్ణయాలు కీల‌కం కానున్నాయ‌ని స‌మాచారం. రెండు మూడు రోజుల్లో గ్రేట‌ర్ వ‌రంగ‌ల్ మునిసిప‌ల్ కార్పోరేష‌న్ ఎన్నిక‌ల‌కు సంబంధించి హైద‌రాబాద్‌లో పార్టీ ఎమ్మెల్యేలు, ముఖ్య నేత‌ల‌తో సీఎం సమీక్ష నిర్వహిస్తార‌ని, ఈ సమావేశంలోనే ఎన్నిక‌ల‌కు సంబంధించి మార్గనిర్దేశనం ఉంటుంద‌ని తెలుస్తోంది. ఎన్నిక‌ల నోటిఫికేష‌న్ త‌ర్వాత జ‌రిగే ప్రచార కార్యక్రమాల్లో పాల్గొనేందుకు మున్సిప‌ల్‌శాఖ మంత్రి, పార్టీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వ‌రంగ‌ల్, ఖ‌మ్మం‌లో రోజూ విడిచి రోజూ ప్రచారంలో పాల్గొనేలా ప్రణాళిక సిద్ధమ‌వుతున్నట్లు విశ్వసనీయ స‌మాచారం.

బ‌లాబ‌లాల‌పై పార్టీ ఆరా..!

టీఆర్ఎస్‌, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు వ‌రంగ‌ల్ కార్పోరేష‌న్ ఎన్నిక‌ల‌ను ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంటున్నాయి. అధికార పార్టీ ఎమ్మెల్యేల‌కు ఇవీ ఒక ర‌కంగా ప‌రీక్షగా నిల‌వ‌నున్నాయి. కాంగ్రెస్ పార్టీ ఉనికిని నిరూపించుకునేందుకు, వరంగ‌ల్‌లో బీజేపీ గాలి ఎంత వీస్తోందో తెలుసుకునేందుకు ఉప‌ప‌యోగ‌ప‌డే ఎన్నిక‌ల‌ని చెప్పవ‌చ్చు. అందుకే మూడు ప్రధాన పార్టీలు ఈ ఎన్నిక‌లను తేలిగ్గా తీసుకోవ‌డం లేదు. మారిన‌ గ్రేట‌ర్ వ‌రంగ‌ల్ స్వరూపంలో త‌మ బ‌ల‌మెంత‌.. ఏఏ డివిజ‌న్లో మెరుగ్గా ఉన్నది.. వీక్‌గా ఉన్న అంశాల‌పై ఆరా తీసుకుంటున్నారు. డివిజ‌న్లకు ఎలాంటి రిజ‌ర్వేష‌న్ కేటాయించ‌బ‌డితే అభ్యర్థుల ఎంపిక‌ను చేప‌ట్టాల్సిన అంశాల‌పై క‌స‌ర‌త్తు చేస్తున్నాయి.


Next Story

Most Viewed