గ్రీన్ ట్రిబ్యునల్‌లో ఏపీకి చుక్కెదురు

by  |
గ్రీన్ ట్రిబ్యునల్‌లో ఏపీకి చుక్కెదురు
X

దిశ, తెలంగాణ బ్యూరో: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తలపెట్టిన రాయలసీమ ఎత్తిపోతల పథకం విస్తరణ ప్రాజెక్టు ప్రతిపాదనకు గ్రీన్ ట్రిబ్యునల్ ఆంక్షలు విధించింది. కేంద్ర అటవీ పర్యావరణ మంత్రిత్వశాఖ నుంచి పర్యావరణ అనుమతులు పొందకుండా ప్రాజెక్టు పనులను ప్రారంభించవద్దని, ఈ ప్రాజెక్టుకు సబంధించిన సమగ్ర నివేదిక (డీపీఆర్)ను కృష్ణా బోర్డుకు సమర్పించాల్సిందేనని స్పష్టం చేసింది. కేంద్ర జలశక్తి మంత్రిత్వశాఖ ఇప్పటికే చేసిన సూచనలను పాటించాల్సిందేనని నొక్కిచెప్పింది.

పర్యావరణ అనుమతులు పొందకుండా ఎట్టి పరిస్థితుల్లో పనులను ఏపీ ప్రభుత్వం మొదలుపెట్టరాదని జస్టిస్ రామకృష్ణన్, సైబల్ దాస్‌ గుప్తాలతో కూడిన చెన్నయ్ ద్విసభ్య బెంచ్ గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన గవినోళ్ళ శ్రీనివాస్ దాఖలు చేసిన పిటిషన్‌పై సుదీర్ఘంగా విచారణ జరిపిన గ్రీన్ ట్రిబ్యునల్ రాయలసీమ ఎత్తిపోతల విస్తరణ ప్రాజెక్టుకు సంబంధించి నిపుణుల కమిటీని ఏర్పాటు చేసింది. అయితే ఆ కమిటీ ఇచ్చిన నివేదికను బెంచ్ తప్పుపట్టింది. కేవలం తాగునీటి అవసరాల కోసమే ప్రాజెక్టు రూపొందుతోందని, సాగునీటి అంశం లేదని, పర్యావరణ అనుమతులు అవసరం లేదన్న కమిటీ సిఫారసులను తిరస్కరించింది.

ఈ ప్రాజెక్టులో సాగునీటి అంశం కూడా ఉన్నందున తప్పనిసరిగా పర్యావరణ అనుమతులను తీసుకోవాల్సిందేనని చెన్నయ్ బెంచ్ తన ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది. ప్రస్తుతం ఉన్న 40 వేల క్యూసెక్కుల సామర్థ్యాన్ని 80 వేల క్యూసెక్కులకు పెంచాల్సిన అవసరం, ఏయే ప్రాంతాలకు తాగునీటి అవసరాలు ఉన్నాయి, ఎంత మంది ప్రజలకు లబ్ధి కలుగుతుంది, తాగునీటి కోసం రోజుకు ఎనిమిది టీఎంసీల చొప్పున నీరు తీసుకునే అవసరం ఉందా, కాల్వల సామర్థ్యం కూడా పెంచాల్సిన అవసరం ఉన్నందున ఏ మేరకు భూమిని సేకరించాల్సి ఉంటుంది, ఏయే గ్రామాల్లో భూ సేకరణ జరపాల్సి ఉంటుంది, ఇందులో అభయారణ్యం కూడా ఉన్నందున దానిపై పడే ప్రభావం ఏంటి, కేవలం తాగునీటి అవసరాల కోసమే అయితే ఎత్తిపోతల మెకానిజం అవసరమా ఇలా అనేక అంశాలను ట్రిబ్యునల్ ఈ పిటిషన్ విచారణ సందర్భంగా లేవనెత్తింది.

Next Story

Most Viewed