అచ్చంపేట లిఫ్టుకు గ్రీన్ సిగ్నల్

by  |
Nallamala
X

దిశ, అచ్చంపేట : ఉమ్మడి పాలమూరు జిల్లాలో వెనుకబడిన ప్రాంతమైన అచ్చంపేట నియోజకవర్గానికి తూర్పు దిక్కున అత్యంత ఎత్తైన ప్రదేశంలో ఉన్న అమ్రాబాద్ ఉమ్మడి మండలం అని చెప్పవచ్చు. పూర్వం నుంచి నల్లమల ప్రాంతంలో కేవలం వర్షాధార పంటల పైనే ఆధారపడి ఈ ప్రాంత రైతాంగం వ్యవసాయం చేస్తున్నారు. కొన్ని దశాబ్దాలుగా ఈ ప్రాంతానికి సాగునీరు అందిస్తామని కాంగ్రెస్, టీడీపీ పార్టీల రాజకీయ నాయకులు హామీలు ఇస్తూ ఈ ప్రాంత ప్రజలను కేవలం ఓటు బ్యాంకుగానే వాడుకున్నారు. తెలంగాణ వస్తేనే తమ ప్రాంతం సస్యశ్యామలం అవుతుందని ఈ ప్రాంత ప్రజలు గడిచిన రెండు పర్యాయాలలో టీఆర్ఎస్ పార్టీకి పట్టం కట్టారు. ఎట్టకేలకు సీఎం కేసీఆర్ లిప్టుల ఏర్పాటుకు అసెంబ్లీలో ప్రకటణ చేయడంతో ఈ ప్రాంత ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

మొక్కవోని దీక్షతో..

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు జరిగిన ఉద్యమంలో నల్లమల ప్రాంతం నుంచి ఉద్యమమే ఊపిరిగా పనిచేస్తూ తెలంగాణ సిద్ధించాక 2014, 2019 జరిగిన ఎన్నికల్లో టీఆర్ఎస్ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు విజయఢంకా మోగించారు. అచ్చంపేట ప్రాంతాన్ని మరో సిద్దిపేటగా తీర్చిదిద్దుతానని అనేక సందర్భాల్లో బహిరంగ ప్రకటన చేశారు. అందుకు మొక్కవోని దీక్షతో నల్లమల ప్రాంతంలో సాగునీటి కోసం కృషి చేశారు. అందులో భాగంగానే సోమవారం ప్రగతి భవన్‌లో సీఎం కేసీఆర్ అధ్యక్షతన జరిగిన పాలమూరు-రంగారెడ్డి కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్‌కు అనుసంధానంలో భాగంగానే అచ్చంపేట లిఫ్టు ఏర్పాటు చేయనున్నట్లు స్వయంగా సీఎం కేసీఆర్ ప్రకటన చేశారు. ఈ ప్రకటనతో ఈ ప్రాంత ప్రజల దశాబ్దాల నాటి కల త్వరలో నెరవేరనున్నది. ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ గువ్వల బాలరాజు ఇందుకోసం శక్తివంచన లేకుండా చేసిన కృషి అమోఘమని ప్రజలు కొనియాడుతున్నారు.

సాగులోకి 60వేల ఎకరాలు..

అచ్చంపేట లిఫ్టు ఇరిగేషన్ స్కీం సర్వే పనులను సత్వరమే పూర్తిచేసి, ఎస్టిమేట్లను పరిపాలనా అనుమతుల కోసం పంపాల్సిందిగా సోమవారం రాత్రి జరిగిన సమీక్షలో సీఎం కేసీఆర్ అధికారులకు సూచించారు. ఏదుల రిజర్వాయర్ నుంచి 22 కిలోమీటర్లు కాల్వ తీసి, లింగాల దగ్గర లిఫ్టును ఏర్పాటు చేయాలని, అక్కడి నుంచి మైలారం దగ్గర మూడు టీఎంసీల సామర్థ్యంతో రిజర్వాయర్‌ను ఏర్పాటు చేయాలని, దానికి ఉమామహేశ్వరం అనే పేరును సూచించారు. అక్కడినుంచి చంద్రసాగర్‌కు కాల్వ ద్వారా నీరందించి, అక్కడ నుంచి సముద్ర మట్టానికి 680మీటర్ల ఎత్తున గల ఉమ్మడి అమ్రాబాద్ మండలంలోని మున్ననూరులో 1.4టీఎంసీ సామర్థ్యంతో ఒక రిజర్వాయర్‌ను ఏర్పాటు చేయాలని అన్నారు. అక్కడి నుంచి నీటిని ఎత్తిపోయాలని ఈ రిజర్వాయర్‌కు స్థానిక చారిత్రక నేపథ్యమున్న శ్రీలక్ష్మీచెన్నకేశవస్వామి ఆలయం పేరుమీదుగానే మున్ననూర్ గ్రామంలో లిఫ్టును ఏర్పాటు చేయాల్సిందిగా సీఎం సూచించారు. ఇందుకు సంబంధించిన సర్వే పనులను త్వరగా పూర్తి చేయాలని, ఇందుకు సంబంధించి మే నెలలో శంకుస్థాపన చేసుకుందామని అన్నారు.

నల్లమల్ల ప్రజల్లో హర్షాతిరేకాలు…

నల్లమల్ల ప్రజల దశాబ్దాల కల నెరవేరనుండడంతో వారు హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు. అలాగే అత్యంత ఎత్తయిన ప్రదేశంలో ఉన్న అమ్రాబాద్ ఉమ్మడి మండలానికి చెన్నకేశవలిఫ్టు నామకరణం చేసి మన్ననూర్ నుంచి పదర మండలంలో గల మద్దిమడుగు క్షేత్రం వరకు సుమారు 55కిలోమీటర్ల పొడవున దాదాపు 30వేల ఎకరాలకు పైగా సాగునీరు అందించేందుకు ప్రకటన చేసిన సీఎం కేసీఆర్‌, ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే బాలరాజుకు ప్రజలు రుణపడి ఉంటామని ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నారు.


Next Story

Most Viewed