ప్రభుత్వానికి ధీటుగా గ్రామ భారతి సేవలు అందించడం అభినందనీయం : గవర్నర్

by  |
Governor Tamil Sai
X

దిశ, మర్రిగూడ: రాష్ట్ర ప్రభుత్వానికి ధీటుగా గ్రామ భారతి స్వచ్ఛంద సేవా సంస్థ సేవలు అందించడం అభినందనీయమని గవర్నర్ తమిళ సై సౌందరరాజన్ అన్నారు. గురువారం మర్రిగూడ మండల కేంద్రంలో గ్రామ భారతి ఆధ్వర్యంలో హార్టికల్చర్ పాలిటెక్నిక్ కళాశాలను ఆమె ప్రారంభించి మాట్లాడారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ధీటుగా గ్రామ భారతి సంస్థ హార్టికల్చర్ కళాశాలను ఏర్పాటు చేయడం అభినందనీయమని అన్నారు. గ్రామీణ ప్రాంతంలో ఏర్పాటుచేసిన హార్టికల్చర్ కళాశాలకు మండల ప్రజలు సహకారం అందించాలని ఆమె కోరారు. అలాగే ప్రధానమంత్రి కల సహకారం అయ్యే దిశగా అగ్రికల్చర్, హార్టికల్చర్‌కు మండల ప్రజలు సహకరించాలని కోరారు.

మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మాట్లాడుతూ గవర్నర్ తమిళ సై సౌందరరాజన్ గవర్నర్ భవనాన్ని ప్రజా భవన్‌గా మార్చి ప్రజలకు విస్తృత సేవలు అందించడం అభినందనీయమని అన్నారు. కళాశాల ఏర్పాటుచేసిన గ్రామ భారతి సంస్థకు, విద్యార్థులకు ఈ ప్రాంత ప్రజలు సహకారం అందించాలని ఆయన కోరారు. మర్రిగూడెంలో ఏర్పాటు చేసిన ప్రైవేటు హార్టికల్చర్ కళాశాలను దేశానికి ఆదర్శంగా తీసుకురావాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్లు రాహుల్ శర్మ, చంద్రశేఖర్, గ్రామ భారతి సంస్థ ప్రెసిడెంట్ కోమటిరెడ్డి రాజారెడ్డి, వైస్ ఛాన్స్లర్ నీరజా ప్రభాకర్, జనరల్ సెక్రెటరీ కర్ణాకర్ గౌడ్‌తో పాటు పలువురు పాల్గొన్నారు.

గవర్నర్‌కు భూ నిర్వాసితుల వినతి

ఏడు సంవత్సరాల క్రితం డిండి ఎత్తిపోతల పథకంలో భూములు కోల్పోయిన తనకు పరిహారం ఇప్పించాలని నిర్వాసితులు గవర్నర్ తమిళసైకి వినతిపత్రం అందజేశారు. కిష్ట రాయపల్లి, చర్లగూడెం రిజర్వాయర్ పరిధిలో భూములు కోల్పోయామని, తనకు ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీని వెంటనే అందించి ఆదుకోవాలని కోరుతూ భూనిర్వాసితులు గవర్నర్‌కు వినతి పత్రం అందజేశారు.

Next Story

Most Viewed