GHARANA: పీఠాధిపతులే అసలు దోషులు.. కన్నీరు తెప్పిస్తున్న మహిళా SP గతం..

by  |
Grahan
X

దిశ, సినిమా : ఏ కోర్టు అయినా, ఎటువంటి విచారణ అయినా.. చరిత్రలో దాగిన నిజాల్ని బయటకు తీసుకురాలేదు. కాలం పాతిపెట్టిన చారిత్రక సత్యాలను ఏ ఇన్వెస్టిగేషన్ కూడా పూర్తిగా బయటపెట్టలేదు. వందశాతం ఇదే జరిగిందని స్పష్టం చేయనూలేదు. ఏం జరిగింది? ఎందుకు జరిగింది? ఎవరు చేశారు? ఎంతమందిని బలితీసుకున్నారు? అనే కథలు ఎన్ని విన్నా సరే.. నిజమైన కథ మాత్రం ఒక్కటే ఉంటుంది. పర్టిక్యులర్ సంఘటనలో హీరోలు, విలన్లు ఎవరనేది ట్రూ స్టోరీ మాత్రమే చెప్పగలదు. మరుగునపడిన ఓ ఘటనకు సంబంధించి నిందితులను కనిపెట్టేందుకు ప్రభుత్వం విచారణకు ఆదేశించినా, అసలైన దోషులు ఆ సర్కార్ పీఠాన్ని అధిరోహించిన లీడర్లే అయుండొచ్చు అనే కాన్సెప్ట్‌తో వచ్చిన ‘గ్రహణ్’ సిరీస్.. వెల్ క్రాఫ్టెడ్‌ స్టోరీగా ప్రశంసలు అందుకుంటోంది.

ఓ వైపు అధికార దాహం.. మరో వైపు పగ తీర్చుకోవాలనే ఆకలి.. రెండూ కలిపితే మారణహోమం జరగకమానదు. ఆ సమయంలో శాంతిని నెలకొల్పేందుకు ఎంత పెద్ద శాంతిదూత వచ్చినా సరే జరిగే పరిణామాలకు సాక్షిగా నిలవాల్సిందే. తమ వల్ల సమాజానికి చెడు జరిగినా.. వేల మంది ప్రాణాలు కోల్పోతారని తెలిసినా.. కేవలం తమ అధికార వాంఛను తీర్చుకునేందుకు ఎంతటి ఘాతుకానికైనా ఒడిగడుతారు. కత్తి కంటే పదునైన మాటలతో సామాన్యుల రక్తంలో విషాన్ని నింపి, అల్లర్లు జరిగేందుకు కారణమవుతారు. ఇలాంటి ఎందరో నాయకులు ఇప్పుడు రాజ్యాధికారాన్ని అనుభవిస్తున్నారనేది కాదనలేని సత్యం. ఇదే స్టోరీలైన్‌గా తీసుకున్న డైరెక్టర్ రంజన్ చందేల్.. భారత మాజీ ప్రధానమంత్రి ఇందిరాగాంధీ హత్య తర్వాత జార్ఖండ్ రాష్ట్ర్లంలోని ‘బొకారో’ సిటీలో జరిగిన అల్లర్లకు సంబంధించిన చరిత్ర ఆధారంగా సిరీస్‌ను తెరకెక్కించాడు. దీనికి చక్కని ప్రేమకథను జోడించి ప్రేక్షకులకు అద్భుతమైన సిరీస్ అందించారు.

వెల్ హ్యాండిల్డ్ సెన్సిటివ్ డ్రామా..

సత్య వ్యాస్ రచించి ‘చౌరాసి’ నవల స్ఫూర్తితో తెరకెక్కిన ‘గ్రహణ్’ సెన్సిటివ్‌లీ హ్యాండిల్డ్ పిరియాడికల్ డ్రామాగా ఆకట్టుకుంటోంది. 1984లో రిషి-మనుల ప్యూర్ లవ్ స్టోరీ, సిక్కు వ్యతిరేక అల్లర్లు.. 2016లో ఐపీఎస్ అధికారి అమృతా సింగ్, బొకారో అల్లర్ల కేసు చిక్కు ముడి విప్పేందుకు ప్రయత్నించిన విధానాన్ని ఆడియన్స్‌కు కనెక్ట్ చేయడంలో సక్సెస్ అయ్యారు మేకర్స్. గతం, వర్తమానానికి సంబంధించిన రెండు కథలను ఒకేసారి చూపిస్తూనే తాము చెప్పాలనుకున్న కథను హండ్రెడ్ పర్సెంట్ కన్వే చేయగలిగారు.

రివ్యూ..

మాజీ ప్రధాని ఇందిరాగాంధీ హత్య తర్వాత దేశం అట్టుడికిపోయింది. సిక్కు మతస్తులైన తన బాడీగార్డులే ఆమెను హతమార్చారని తెలుసుకున్న నాయకులు.. దీన్ని అవకాశంగా తీసుకుని ఎదగాలనే లక్ష్యంతో సిక్కులను ఊచకోత కోశారు. చరిత్ర మరిచిపోలేని భయంకరమైన సంఘటనలకు కారకులయ్యారు. రంజన్ చందేల్ దర్శకత్వంలో ఎనిమిది ఎపిసోడ్స్‌తో వచ్చిన సిరీస్‌లో ఈ విషయంపై ఎక్కువగా దృష్టిసారించారు.

ఈ ఫిక్షనల్ డ్రామాలో 1984 బొకారో అల్లర్లకు సంబంధించిన నిందితులను కనిపెట్టేందుకు జార్ఖండ్ ప్రభుత్వం స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్(SIT)ను నియమిస్తుంది. ఐపీఎస్ ఆఫీసర్ అమృతా సింగ్‌‌ ఈ ప్రత్యేక దర్యాప్తు బృందానికి నాయకత్వం వహించగా.. దశాబ్ధాల క్రితం జరిగిందేంటో తెలుసుకునే క్రమంలో పట్టుదలతో ముందుకుసాగుతుంది. ఈ క్రమంలో ప్రధాన అనుమానితుల్లో తన తండ్రి కూడా ఉన్నాడన్న విషయం తెలిసి కేసును తప్పుదారి పట్టించేందుకు ప్రయత్నిస్తుంది. కానీ అదే టీమ్‌లోని మరో ఆఫీసర్ ఈ విషయాన్ని గ్రహించి సుపీరియర్స్‌కు వివరించగా.. తండ్రి గుర్ సేవక్ సింగ్ పోలీసులకు లొంగిపోతాడు. ఈ క్రమంలో తండ్రీ కూతుళ్ల మధ్య వచ్చే ఎమోషనల్ సీన్స్ ఆడియన్స్‌ను ఆకట్టుకుంటాయి. ఇంతకీ ఈ గుర్ సేవక్ సింగ్ ఎవరు? కనీసం చీమకు కూడా హానితలపెట్టని ఆయన ఇన్ని అల్లర్లు సృష్టించాడా? లేదా? అసలు ఇన్వెస్టిగేషన్‌లో ఏం తేలింది?.

స్టోరీ..

జార్ఖండ్ చీఫ్ మినిస్టర్ కేసు విచారణకు ఆదేశించగా.. ప్రతిపక్ష నేత సంజయ్ సింగ్(చున్నూ సింగ్) ఈ కేసు నుంచి బయటపడేందుకు అడ్డదారులు తొక్కుతాడు. జర్నలిస్ట్ సంతోష్ నారాయణన్ హత్యను వినియోగించుకుని సీఎంకు చెక్ పెట్టి అధికారాన్ని దక్కించుకునేందుకు పథకాన్ని రచిస్తాడు. దీనికి తోడు హిందూ నగర్‌‌లోనూ హిందు, ముస్లిం వర్గాల మధ్య అల్లర్లు సృష్టించి.. ప్రభుత్వ వైఫల్యం వల్లే ఇదంతా జరిగిందని ప్రతిపక్ష నేతగా మార్కులు కొట్టేయాలని చూస్తాడు. కానీ ఐపీఎస్ ఆఫీసర్ అమృతా సింగ్ ఈ విషయాన్ని కనిపెట్టి.. సంజయ్ సింగ్‌ను అరెస్ట్ చేస్తుంది. అయితే ఇందిరాగాంధీ మర్డర్ టైమ్‌కు చోటా లీడర్‌గా ఉన్న ప్రస్తుత ముఖ్యమంత్రికి, ప్రతిపక్ష నేత సంజయ్ సింగ్‌కు ఉన్న సంబంధం ఏంటి? అనేది ఇక్కడ మరో ట్విస్ట్.

ఇక 1984 నేపథ్యంలోని మన్ను, రిషిల లవ్ స్టోరీ సిరీస్‌కు స్పెషల్ అట్రాక్షన్ కాగా… మన్నుగా వామికా గబ్బి, రిషిగా అన్షుమాన్ పుష్కర్ నేచురల్ పర్ఫార్మెన్స్‌తో ఫిదా చేశారు. వీరిద్దరి మధ్య వచ్చే ప్రతీ సన్నివేశం కూడా హార్ట్ టచింగ్‌గా ఉంటుంది. అయితే అదే సమయంలో బొరాకో సిటీలో సిక్కులపై దాడులు జరిపేందుకు చున్నూ సింగ్.. యూత్‌ను రెచ్చగొడతాడు. ఈ క్రమంలో అందరితో పాటు దాడుల్లో పాల్గొంటూనే.. సిక్కులైన ప్రియురాలి కుటుంబాన్ని కాపాడుకునేందుకు ప్రయత్నిస్తుంటాడు. కానీ ముందునుంచి మన్నుపై మనసుపడిన రిషి స్నేహితుడు ఈ అవకాశాన్ని వినియోగించుకుని.. ఒంటరిగా ఉన్న కుటుంబంపై దాడిచేసి మన్నుపై అత్యాచారం చేస్తాడు.

ఈ క్రమంలో ఆడపిల్లకు జన్మనిచ్చిన మన్ను… ఆ బిడ్డను కాదనుకుని మరో పెళ్లి చేసుకుని కెనడాకు వెళ్లిపోతుంది. మరి అనాథగా మిగిలిన ఆ బిడ్డను పెంచిందెవరు? ఇంతకీ ఆ బిడ్డ ఎవరు? తనను పెంచిన తండ్రి ఎవరు? అమృతా సింగ్‌కు మన్నుకు మధ్య సంబంధం ఏంటి? కోర్టు ముందు దోషిగా నిలబడ్డ గురుసేవక్‌ను మన్ను ఎందుకు? ఎలా కాపాడుతుంది? అసలు వీరిద్దరికి మధ్య ఉన్న రిలేషన్ ఏంటి? అనేది చక్కగా బ్యాలెన్స్ చేసి ఆడియన్స్‌కు థ్రిల్ ఇచ్చారు మేకర్స్. ఎమోషనల్ టచ్‌తో కూడిన కోర్టు సీన్స్‌లో గురు సేవక్‌గా పవన్ రాజ్ మల్హోత్రా చేసిన యాక్టింగ్ అద్భుతం కాగా అమృతా సింగ్‌గా జోయా హుస్సేన్ భేష్ అనిపించుకుంది.

Next Story

Most Viewed