సర్పంచ్ భర్త పెత్తనంపై కార్మికుల ఆగ్రహం

by  |
Mahadevpuram-GP
X

దిశ, భద్రాచలం: దుమ్మగూడెం మండలం మహదేవపురం గ్రామపంచాయతీ ఎదుట సోమవారం కార్మికులు ధర్నా నిర్వహించారు. గ్రామపంచాయతీ సర్పంచ్ నూపా సుమిత్ర పంచాయతీ ట్రాక్టర్‌ను సొంత పనులకు ఉపయోగించుకుంటున్నారని, ఇదేమిటని అడిగిన కార్మికులపై సర్పంచ్ వేధింపులకు గురిచేస్తున్నాడని, అసలు ఇంతకీ సర్పంచ్ భర్త సీతయ్య పంచాయతీ పాలనా వ్యవహారాలలో జోక్యం చేసుకోవడం ఏంటని సీఐటీయూ ఆధ్వర్యంలో పంచాయతీ కార్మికులు ధర్నా నిర్వహించారు. సర్పంచ్, ఆమె భర్త సీతయ్య వైఖరి పట్ల నిరసన వ్యక్తం చేస్తూ పెద్దఎత్తున నినాదాలు చేశారు.

పంచాయతీ ట్రాక్టర్ సొంత పనులకు వాడకుండా దానిని గ్రామ అవసరాలకు మాత్రమే వినియోగించాలని, గ్రామంలో సర్పంచ్ భర్త పెత్తనాన్ని నిరోధించాలని కార్మికులు మండల పంచాయతీ అధికారికి సీఐటీయూ ఆధ్వర్యంలో వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు కొలగాని బ్రహ్మాచారి మాట్లాడుతూ.. కార్మికుల ఇబ్బందులను ఇప్పటికే ఎంపీవో దృష్టికి తీసుకెళ్ళామని తెలిపారు. ఇప్పటికైనా సర్పంచ్, ఆమె భర్త ఇద్దరు తమ వైఖరి మార్చుకోవాలని కోరారు. వారిపై విచారణ చేపట్టి, చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

Next Story

Most Viewed