జిల్లాకో వైద్య కళాశాల ఏర్పాటే మా లక్ష్యం

by  |
modi
X

లక్నో: దేశంలో ప్రతి జిల్లాలో కనీసం ఒక వైద్య కళాశాల ఏర్పాటు చేయడం తమ ప్రభుత్వ లక్ష్యమని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అన్నారు. ఉత్తరప్రదేశ్ గోరఖ్‌పూర్‌లో మంగళవారం రూ.9600 కోట్ల అభివృద్ధి పనులను ప్రారంభించారు. వీటిలో గోరఖ్ పూర్ ఎరువుల కర్మాగారం, ఎయిమ్స్ ఆసుపత్రితో పాటు ఐసీఎంఆర్ ప్రాంతీయ కేంద్రాలు ఉన్నాయి. ‘స్వాతంత్రం వచ్చిన తర్వాత ఈ శతాబ్దం ప్రారంభమయ్యే వరకు దేశంలో కేవలం ఒక్కటే ఎయిమ్స్ ఉంది. మాజీ ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజపేయి మరో ఆరు ఎయిమ్స్ ఏర్పాటుకు ఆమోదం తెలిపారు.

గత ఏడేళ్లలో మా ప్రభుత్వం దేశంలో 16 ఎయిమ్స్ నిర్మాణాలు చేపట్టింది. దేశంలోని ప్రతి జిల్లాలో వైద్య కళాశాల ఏర్పాటు మా ముందున్న లక్ష్యం’ అని అన్నారు. డబుల్ ఇంజిన్ ప్రభుత్వంతో రాష్ట్రంలో అభివృద్ధి పెరిగిందని అన్నారు. చెరకు ప్రోత్సాహక ధరను కూడా ప్రభుత్వం అమలు చేస్తుందని అన్నారు. చెరకు రైతులకు పారితోషికం రూ.350 పెంచినట్లు గుర్తుచేశారు. తమ ప్రభుత్వం తీసుకున్న చొరవతోనే ఎరువుల కర్మాగారం తిరిగి ప్రారంభమైందని అన్నారు.

ఎర్రటోపీలే రాష్ట్రానికి ప్రమాద సంకేతాలు

సమాజ్‌వాది పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్‌పై ప్రధాని విరుచుకపడ్డారు. ఎర్రటోపీ లే రాష్ట్రానికి ప్రమాద సంకేతాలని పేర్కొన్నారు. ఆ పార్టీ ఉగ్రవాదులు పట్ల కూడా సానుభూతిని చూపుతుందని అన్నారు. ‘వీరికి కేవలం స్కాంలకు, ఆక్రమణ, మాఫియాకు మద్దతు కోసమే అధికారం కావాలి. ఉగ్రవాదులను జైళ్ల నుంచి విడుదల చేయడానికే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని అనుకుంటున్నారు. డబుల్ ఇంజిన్ ప్రభుత్వంతోనే నేడు రాష్ట్రంలోని మాఫియా జైళ్లలో ఉందని తెలిపారు. ఈ ప్రభుత్వం కారణంగానే ఎరువుల కర్మాగారం, ఎయిమ్స్ ప్రారంభం రెట్టింపు వేగంతో ప్రారంభమవడం చూస్తున్నామని పేర్కొన్నారు. పేదల కోసం పనిచేసే ప్రభుత్వం ఉన్నప్పుడు అది చేసే పనిలో స్పష్టంగా కనిపిస్తుందని అన్నారు.


Next Story

Most Viewed