పెట్రోల్, డీజిల్‌పై పన్నులతో భారీగా సంపాదించిన కేంద్రం

by  |
పెట్రోల్, డీజిల్‌పై పన్నులతో భారీగా సంపాదించిన కేంద్రం
X

దిశ, వెబ్‌డెస్క్: గతేడాది నుంచి పెట్రోల్, డీజిల్ ధరలు ఆకాశాన్ని తాకుతున్న సంగతి తెలిసిందే. కరోనా మహమ్మారి పరిస్థితులను కారణంగా చూపుతూ కేంద్రం ఇంధనంపై రికార్డు స్థాయిలో ఎక్సైజ్ సుంకాన్ని విధిస్తోంది. దీంతో 2021, మార్చితో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో పెట్రోల్, డీజిల్‌లపై పన్నుల రూపంలో ప్రభుత్వం ఏకంగా రూ. 3.35 లక్షల కోట్లను వసూలు చేసినట్టు ప్రభుత్వం పార్లమెంటులో ప్రకటించింది. అంతకుముందు ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే ఇది 88 శాతం అధికం కావడం గమనార్హం. దీనికి సంబంధించి సోమవారం కేంద్ర పెట్రోలియం, సహజవాయువు మంత్రిత్వ శాఖ సహాయ మంత్రి రామేశ్వర్ వివరాలు తెలియజేశారు.

గత సంవత్సరంలో కొవిడ్ సంక్షోభం వల్ల అంతర్జాతీయ మార్కెట్లో చమురు వినియోగం భారీగా పడిపోయింది. గిరాకీ తగ్గిపోవడంతో ధరలు సైతం దారుణంగా కుదేలయ్యాయి. దీంతో ఆదాయాన్ని కాపాడుకునేందుకు కేంద్రం చమురుపై ఎక్సైజ్ సుంకాలను భారీగా పెంచేసింది. పెట్రోల్‌పై ఎక్సైజ్ సుంకాన్ని రూ. 19.98 నుంచి ఏకంగా రూ. 32.9 పెంచేయగా, డీజిల్‌పై రూ. 15.83 నుంచి రూ. 31.80 పెంచింది. దీనివల్ల గత ఆర్థిక సంవత్సరంలో పెట్రోల్, డీజిల్‌పై రూ. 3.35 లక్షల కోట్ల పన్ను వసూళ్లను కేంద్రం సమకూర్చుకుంది. 2019-20లో కేంద్రం వీటిపై పన్నుల రూపంలో రూ. 1.78 లక్షల కోట్ల ఆదాయాన్ని సమకూర్చుకుంది. ఇదే సమయంలో ఈ ఏడాది ఏప్రిల్‌తో మొదలైన ఆర్థిక సంవత్సరంలో ఏప్రిల్-జూన్ మధ్య పెట్రోల్, డీజిల్‌పై రూ. 1.01 లక్షల కోట్ల పన్ను వసూళ్లను సాధించినట్టు ఆర్థిక శాఖ సహాయమంత్రి పంకజ్ చౌదరీ వివరించారు.

Next Story

Most Viewed