బియ్యం గింజల సైజును బట్టి రేటు..ఆలోచించండి

by  |
బియ్యం గింజల సైజును బట్టి రేటు..ఆలోచించండి
X

దిశ, కరీంనగర్: రైతులు మార్కెట్లో డిమాండ్ ఉన్న పంటలు వేసి ఆర్థిక పరిపుష్టి సాధించాలని, ఈ విషయంపై ఆలోచన చేయాలని రాష్ట్ర సివిల్ సప్లై మంత్రి గంగుల కమలాకర్ అన్నారు.మంగళవారం కరీంనగర్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ..సన్నరకం ధాన్యానికి డిమాండ్ ఎక్కువగా ఉన్నందున, ఆ ధాన్యాన్ని పండించేందుకు రైతులు మొగ్గు చూపాలన్నారు. మార్కెట్లో బియ్యం గింజల సైజును బట్టి రేటు పలుకుతోందని, ఈ విషయం తెలిసే సీఎం కేసీఆర్ రైతులకు సలహా ఇచ్చారన్నారు. వానాకాలంలో పంట వేయాలంటే రైతులు ఆకాశంవైపు చూసే రోజులు పోయాయని, కాళేశ్వరం జలాలతో చెరువులన్నీ మత్తడి దుంకుతున్నాయన్నారు.గతంలో ఎస్సారెస్పీలో నీరు లేక కాకతీయ కాలువ చివరి ఆయకట్టుకు నీరు అందేది కాదని, ఇప్పుడు ఆ పరిస్థితి లేదన్నారు.కాలువలతో కనెక్టవిటీ ఉన్న చెరువులన్నీ నింపుతామని మంత్రి తెలిపారు. ఈ సారి కంది పంటను ప్రభుత్వమే కొంటుందని సీఎం హామీ ఇచ్చిన విషయాన్ని గుర్తుచేశారు. కల్తీ లేని ఆహార ఉత్పత్తులు రాష్ట్రంలో రావాల్సిన అవసరం ఉందని, అందుకే ఫుడ్ ప్రాసెసింగ్ సెజ్‌ల ఏర్పాటుకు ఆలోచన చేస్తునట్లు వివరించారు.రైసు మిల్లుల నుంచి ఏర్పడే కాలుష్యం నివారణకు, ఒకే చోట మిల్లులన్నీ ఉండేలా చర్యలు చేపట్టేందుకు యోచిస్తున్నట్టు చెప్పారు. ఖరీఫ్‌లో రైతుల నుంచి 40 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనగా , యాసంగిలో ఇప్పటికే 49 లక్షల మెట్రిక్ టన్నులు కొనుగోళ్లు చేసినట్టు స్పష్టంచేశారు. ప్రతిసారీ ప్రభుత్వాన్ని విమర్శిస్తున్న బీజేపీ నేతలు కనీసం కేంద్రం నుంచి గన్నీ బ్యాగులు ఇప్పించలేకపోయారని మండిపడ్డారు. త్వరలోనే జిల్లాలో ముఖ్యమంత్రి పర్యటన ఉంటుందని మంత్రి ప్రకటించారు.బాబ్లీ ప్రాజెక్టుకు నిరసనగా తాను మహారాష్ట్ర వెల్లి పోలీసుల చేతిలో లాఠీ దెబ్బలు తిన్నానని, బండి సంజయ్ కూడా పోతిరెడ్డిపాడుకు వెళ్ళి ధర్నాచేసి, ఏపీలోని బీజేపీ నేతల ఇళ్లపై నల్లజెండాలు పెట్టాలని డిమాండ్ చేశారు.

Next Story