సెమీకండక్టర్లకు ప్రభుత్వం ప్రోత్సాహం!

by  |
సెమీకండక్టర్లకు ప్రభుత్వం ప్రోత్సాహం!
X

దిశ, వెబ్‌డెస్క్: దేశంలో సెమీకండక్టర్ల తయారీని పెంచేందుకు ప్రభుత్వం భారీగా మూలధన మద్దతుతో పాటు ఉత్పత్తి అనుసంధాన ప్రోత్సాహకాలను అందించేందుకు ప్రణాళిక సిద్ధం చేస్తున్నట్టు తెలుస్తోంది. దీనికోసం తైవాన్ సెమీకండక్టర్ మాన్యూఫాక్చరింగ్ కంపెనీ, ఇంటెల్, ఏఎండీ, ఫుజిస్టు, యూనైటెడ్ మైక్రో ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ లాంటి దిగ్గజ సెమీకండక్టర్ తయారీదారులతో చర్చలు జరుపుతున్నారని సంబంధిత వర్గాలు వెల్లడించాయి.

ఎన్నడూ లేని విధంగా ఈ పరిశ్రమకు మూలధన మద్దతు ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని సమాచారం. ప్రపంచ మార్కెట్లో చిప్‌ల కొరత వల్ల అనేక రంగాల్లో ఉత్పత్తి భారీగా ప్రభావితమైంది. దీన్ని దృష్టిలో ఉంచుకునే కేంద్రం ఈ అంశాన్ని నిశితంగా పరిశీలిస్తోంది. పరిశ్రమల కోసం ఆకర్షణీయమైన, పెట్టుబడులకు అనుకూలమైన పథకం రూపొందించేందుకు ప్రయత్నాలు చేస్తోంది.

మూలధన వ్యయం కోసం మద్దతుతో పాటు కొన్ని విడి భాగాలపై సుంకాలను తగ్గించడం, ఎలక్ట్రానిక్ భాగాలు, సెమీకండక్టర్ల తయారీ ప్రోత్సాహక పథకం, ఉత్పత్తి అనుసంధాన ప్రోత్సాహకం(పీఎల్ఐ) లాంటి ప్రయోజనాలు అందించే అవకాశం ఉంది. సెమీకండక్టర్ల తయారీలో కంపెనీల పెట్టుబడి ప్రయత్నాలు ఇదివరకు విఫలమయ్యాయి.

అధునాతన తయారీ కోసం భారీ పెట్టుబడులు, స్వచ్ఛమైన నీటితో పాటు నిరంతరాయమైన విద్యుత్ అవసరం ఉంటుంది. దేశీయంగా సెమీకండక్టర్ల కోసం డిమాండ్ కూడా అత్యధికంగా ఉంది. 2025 నాటికి దేశీయ ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తి రూ.26-30 లక్షల కోట్లకు పెరుగుతుందని ప్రభుత్వం అంచనా వేస్తోంది. ప్రస్తుతం ఇది రూ.5.62 లక్షల కోట్లుగా ఉంది.


Next Story

Most Viewed