నేటి నుంచి ప్రభుత్వాఫీసులు

by  |

దిశ, న్యూస్ బ్యూరో: లాక్‌డౌన్ కారణంగా అనేక ఆంక్షలతో నడుస్తున్న ప్రభుత్వాఫీసులు సోమవారం నుంచి మామూలు స్థాయిలోనే పనిచేయనున్నాయి. ప్రభుత్వం రెండు రోజుల క్రితం జారీచేసిన జీవో ప్రకారం ఆయా జోన్లకు అనుగుణంగా సిబ్బంది హాజరు ఉంటుంది. అన్ని జోన్లలో ప్రభుత్వ కార్యాలయాలు పనిచేస్తాయిగానీ రెడ్ జోన్‌లో మాత్రం పరిమిత స్థాయిలోనే పనిచేయనున్నాయి. గ్రీన్, ఆరెంజ్ జోన్లలో ప్రభుత్వ కార్యాలయాలు వంద శాతం సిబ్బందితో పనిచేయనుండగా.. రెడ్ జోన్‌లో మాత్రం 33% సిబ్బందితోనే పనిచేస్తాయి. ఆ ప్రకారంగా ఉద్యోగులకు రోస్టర్ పట్టిక ప్రత్యేకంగా రూపొందుతోంది. కరోనా వైరస్ కారణంగా పరిమిత సిబ్బందితోనే పనిచేసిన ప్రభుత్వ కార్యాలయాలు మెజారిటీ ఉద్యోగులకు షిప్టులు, ‘వర్క్ ఫ్రం హోమ్’ ఆప్షన్ ఇచ్చాయి. ఇప్పుడు రెడ్ జోన్ మినహా మిగిలిన అన్నిచోట్లా ఎలాంటి ఆంక్షలు లేకుండా పూర్తి స్థాయిలో ఉద్యోగులు ఆఫీసులకు హాజరు కావాల్సి ఉంటుంది. ప్రస్తుతానికి హైదరాబాద్, మేడ్చల్, రంగారెడ్డి జిల్లాలు మాత్రమే రెడ్ జోన్‌లో ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వ లెక్కల ప్రకారం వరంగల్ అర్బన్, సూర్యాపేట, వికారాబాద్ జిల్లాలు కూడా రెడ్ జోన్‌లోనే ఉన్నాయి. ఇంకా కేంద్రం నుంచి వీటిని ఆరెంజ్ జోన్‌లోకి మార్చే ప్రకటన రానందువల్ల ఈ మూడు జిల్లాల్లో కూడా సిబ్బంది 33% మేరనే హాజరవుతారు. కానీ డిప్యూటీ సెక్రెటరీ, ఆ పైస్థాయి అధికారులు మాత్రం వంద శాతం విధులకు హాజరుకావాల్సిందే. 33% నిబంధన ఆ కింది స్థాయి ఉద్యోగులకు మాత్రమే వర్తిస్తుంది.

Next Story