ఏడేళ్లకు పునాదులు.. మరి సొంతింటి సాకారం ఎప్పుడో ?

by  |
ఏడేళ్లకు పునాదులు.. మరి సొంతింటి సాకారం ఎప్పుడో ?
X

దిశ, పరిగి : తెలంగాణ ప్రత్యేక రాష్ర్టం ఏర్పడ్డాక వచ్చిన ఎన్నికల ముందు ముఖ్యమంత్రి కేసీఆర్ ఇళ్లు లేని పేదలకు డబుల్ బెడ్రూం ఇళ్లు ఇస్తానని మాటిచ్చారు. ఏడేళ్లు దాటిన తర్వాత పరిగిలోని డబుల్ బెడ్ రూంల ఇళ్ల నిర్మాణ పనులు పునాదులు వేశారు. పరిగి డివిజన్ వ్యాప్తంగా పరిగి, దోమ, పూడూరు, కుల్కచర్ల మండలాల్లో డబుల్ బెడ్ రూం ఇళ్ల నిర్మాణానికి నిధులు మంజూరై పనులు ప్రారంభమయ్యాయి. నియోజకవర్గ వ్యాప్తంగా వేల సంఖ్యలో లబ్దిదారులు ఇళ్ల కోసం ఎదురు చూస్తున్నారు.

పరిగి డివిజన్ వ్యాప్తంగా 34.27 కోట్లతో 680 డబుల్ ఇండ్లు

సొంతింటి కల నెరవేర్చుకోవాలి అనుకుంటున్న పేదల ఆశలకు జీవం పోసేలా పరిగి నియోజకవర్గంలో 34.27 కోట్లతో 680 కుటుంబాలకు డబుల్ బెడ్రూంలు నిర్మించి ఇస్తున్నారు. పరిగి మున్సిపల్ పరిధిలోని తుంకులగడ్డలో మొదటి విడతలో 9.50 కోట్ల వ్యయంతో 180 కుటుంబాలు ఉండేందుకు వీలుగా డబుల్ బెడ్ రూం నిర్మాణ పనులు వేగంగా కొనసాగుతున్నాయి. రెండు అంతస్తుల భవనంలో మొత్తం 180 కుటుంబాలు ఉండేందుకు వీలుగా ఈ ఇళ్ల నిర్మాణాలు చేపడుతున్నారు. రెండవ విడత కింద 6.10 కోట్లతో రూపాయాలతో మరో 120 కుటుంబాలు నివసించేందుకు వీలుగా ఇళ్లు నిర్మించనున్నారు. దోమ మండల కేంద్రంలో 2.50 కోట్లతో 50 కుటుంబాలకు 50 డబుల్ బెడ్ ఇళ్లు, పూడూరులో కూడా 2.50 కోట్లతో 50 కుటుంబాలకు 50 ఇళ్లు, కుల్కచర్లలో 3.30 కోట్ల 80 కుటుంబాలకు 80 ఇళ్లు, గండేడ్ మండల కేంద్రంలో 10.04 కోట్లతో 100 కుటుంబాలకు 100 ఇళ్లు, మహ్మదాబాద్లో 10. 04 కోట్లతో 100 కుటుంబాలు 100 డబుల్ బెడ్రూం ఇళ్లు నిర్మాణాలు కొనసాగుతున్నాయి.

ఇళ్లు లేని నిరుపేదలకే మొదటి ప్రాధాన్యత : ఎమ్మెల్యే కొప్పుల మహేశ్ రెడ్డి

సొంతింటి కల కోసం ఎదురు చేస్తున్న నిరుపేదల కల త్వరలో నెరవేరబోతోంది. పరిగి నియోజకవర్గ వ్యాప్తంగా 680 కుటుంబాలకు త్వరలో డబుల్ బెడ్ రూం ఇళ్లు అందించబోతున్నామని ఎమ్మెల్యే మహేశ్ రెడ్డి అన్నారు. కాస్త ఆలస్యమైనా సకల సౌకర్యాలతో డబుల్ బెడ్రూంలు పేదలకు కట్టిచ్చి ఇస్తున్నాం. అన్ని మండలాల్లో పనులు ప్రారంభమయ్యాయి. కుల్కచర్లలో కూడా త్వరలో ప్రారంభిస్తాం అని ప్రకటించారు.

Next Story

Most Viewed