ఇంధనంపై ఎక్సైజ్ సుంకం తగ్గింపు ఉండకపోవచ్చు

by  |
petrol
X

దిశ, వెబ్‌డెస్క్: ఆర్థిక సమస్యలు, ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి అదనపు ఖర్చుల కారణంగా ఇంధన ఉత్పత్తులపై ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించే యోచనలో కేంద్రం లేదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. కొవిడ్ మహమ్మారి సెకెండ్ వేవ్ నేపథ్యంలో ఆర్థిక పునరుద్ధరణకు, ఆరోగ్య సంరక్షణ మౌలిక సదుపాయాలను బలోపేతం చేసేందుకు పెరుగుతున్న ఖర్చులు ఉండటంతో ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించకూడదని కేంద్రం భావిస్తున్నట్టు తెలుస్తోంది. ఇంధన ఎక్సైజ్ సుంకాన్ని రూ. 10 తగ్గించడం వల్ల ఆర్థిక లోటు 0.58 శాతం, ద్రవ్యోల్బనం 0.2 శాతం మాత్రమే ప్రభావితమవుతుందని నిపుణులు భావిస్తున్నారు.

ఈ క్రమంలో కేంద్రం ఇంధనంపై ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించే అవకాశం లేదని వారి అంచనా. తాజాగా రాజ్యసభలో ఓ ప్రశ్నకు లిఖితపూర్వక సమాధానంలో ప్రస్తుత ఆర్థిక పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని పెట్రోల్, డీజిల్‌లపై ఎక్సైజ్ సుంకం ద్వారా మౌలిక సదుపాయాల కల్పన, ఇతర అభివృద్ధి వ్యయం కోసం వినియోగిస్తున్నట్టు ప్రభుత్వం తెలిపింది. ఈ క్రమంలో ఇంధనంపై సుంకం తగ్గింపు ఇప్పట్లో ఉండకపోవచ్చని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. కాగా, ఆర్థిక సంవత్సరం మొదటి మూడు నెలల్లో(ఏప్రిల్-జూన్) పెట్రోల్, డీజిల్‌లపై కేంద్రం వసూలు చేసిన మొత్తం ఎక్సైజ్ సుంకం రూ. 94,181 కోట్లుగా ఉంది.

Next Story

Most Viewed