102 రకాల దిగుమతులు తగ్గించేందుకు ప్రణాళిక

by  |
102 రకాల దిగుమతులు తగ్గించేందుకు ప్రణాళిక
X

దిశ, వెబ్‌డెస్క్: దేశీయ సామర్థ్యాన్ని పెంచేందుకు కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. కంప్యూటర్లు, కెమెరాలు, యూరియా, పత్తి, ట్రాక్టర్ విడిభాగాలు, యంత్రాలతో సహా మొత్తం 102 రకాల ఉత్పత్తుల దిగుమతులను తగ్గించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇటీవల ఈ వస్తువుల దిగుమతులు గణనీయంగా పెరిగాయి. ఈ మేరకు వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వ శాఖ ఎంపిక చేసిన వాటిని ‘ప్రాధాన్యత కలిగిన ఉత్పత్తుల’ విభాగం కింద పరిగణిస్తూ దిగుమతులను తగ్గించి దేశీయ తయారీ సామర్థ్యాన్ని పెంచే మార్గాలను అన్వేషించాలని 15 ఇతర మంత్రిత్వ శాఖలను కోరింది.

దేశీయంగా అధిక ఉత్పత్తి సామర్థ్యం ఉన్న వస్తువుల దిగుమతులు ఇంకా ఎక్కువగానే ఉన్నాయని, వాటిని తగ్గించాలని ఇతర రంగాల మంత్రిత్వ శాఖలకు ప్రభుత్వం తెలిపింది. పలు నివేదికల ప్రకారం.. ఈ ఏడాది మార్చి-ఆగష్టు మధ్య మొత్తం దిగుమతుల్లో ఎంపిక చేసిన ఈ వస్తువుల వాటా 57.6 శాతంగా ఉంది. ఇందులో కెమికల్స్, పెట్రోకెమికల్స్ శాఖకు చెందినవి గరిష్ఠంగా 18 ఉత్పత్తులు, పరిశ్రమలు, ఎలక్ట్రానిక్స్, ఐటీ నుంచి ఒక్కో శాఖకు చెందిన 14 భారీ పరిశ్రమలు, గనుల శాఖలకు చెందినవి 10 చొప్పున గుర్తించామని మంత్రిత్వ శాఖ పేర్కొంది.

‘దేశీయంగా తయారీ సామర్థ్యాన్ని పెంచేందుకు, వాటి దిగుమతులను తగ్గించేందుకు మార్గాలను అన్వేషిస్తున్నామని’ ప్రభుత్వ అధికారి ఒకరు తెలిపారు. కాగా ప్రస్తుతం ఆర్థిక సంవత్సరం మొదటి ఏడు నెలల్లో దిగుమతులు 78.7 శాతం పెరిగి 331.26 బిలియన్ డాలర్ల(రూ. 24.66 లక్షల కోట్ల)కు పెరిగిన సంగతి తెలిసిందే.



Next Story