కొవిడ్ విజేతలు ప్లాస్మా దానానికి ముందుకు రావాలి

by  |
కొవిడ్ విజేతలు ప్లాస్మా దానానికి ముందుకు రావాలి
X

దిశ, న్యూస్‌బ్యూరో: కొవిడ్ బారిన పడి కోలుకున్నవారు ప్లాస్మా దానం చేయడం ద్వారా వేలాది మంది కరోనా బాధితులను ప్రాణాపాయం నుంచి కాపాడవచ్చునని, ఆ దిశంగా సామాజిక స్పృహతో, బాధ్యతతో ప్లాస్మా దాతలుగా మారాలని గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్ పిలుపునిచ్చారు. కరోనా బారిన పడి కోలుకున్న రాష్ట్ర కాంగ్రెస్ కోశాధికారి గూడూరు నారాయణరెడ్డి వీడియో కాన్ఫరెన్సు ద్వారా గవర్నర్‌తో సమావేశమైన సందర్భంగా ఆమె పై వ్యాఖ్యలు చేశారు. కరోనా బారిన పడి కోలుకున్న సుమారు రెండు వేల మందిని తాను వ్యక్తిగతంగా ఫోన్ చేసి సంప్రదించానని, ప్లాస్మా దానం చేయడానికి ముందుకు రావాల్సిందిగా కోరానని, చాలా మంది సమ్మతి వ్యక్తం చేశారని, కాని ఇప్పటివరకు కేవలం 61 మంది మాత్రమే దానం చేశారని గవర్నర్‌కు వివరించారు. తానే స్వంతంగా చొరవ తీసుకుని తెలంగాణ ప్లాస్మా డోనార్స్ అసోసియేషన్ అనే సంస్థను ప్రారంభించానని తెలిపారు.

అయితే చాలా మంది ప్లాస్మాను దానం చేయడానికి సిద్ధపడినా ఆసుపత్రులకు లేదా బ్లడ్ బ్యాంకులకు వెళ్ళడానికి భయపడుతున్నారని, దీన్ని దృష్టిలో పెట్టుకుని మొబైల్ బ్లడ్ బ్యాంక్ లాంటి వాహనాలను నెలకొల్పడం ద్వారా చాలా ప్రయోజనం ఉంటుందని గవర్నర్‌కు ఆయన వివరించారు. ప్లాస్మా కలెక్షన్ సెంటర్ల పేరుతో వీటిని ఏర్పాటు చేయగలిగినట్లయితే చాలా మంది ద్వారా ప్లాస్మాను స్వీకరించవచ్చునని, తీవ్ర అనారోగ్యంతో ఉన్న కరోనా బాధితులను కాపాడవచ్చునని ఆయన వివరించారు. దీనికి సానుకూలంగా స్పందించిన ఆమె ఆ ప్రయత్నాలతో పాటు ఎలాంటి అనుమానాలు, భయాలకు తావులేని విధంగా శాస్త్రీయ పద్ధతిలో ఆలోచించి బ్లడ్ బ్యాంకులకే వెళ్ళి ప్లాస్మా దానం చేయడానికి చొరవ తీసుకోవాలని ప్లాస్మా దాతలకు ఆమె విజ్ఞప్తి చేశారు.

Next Story

Most Viewed