రాజ్‌భవన్‌కు గులాబీ రంగు

by  |
రాజ్‌భవన్‌కు గులాబీ రంగు
X

దిశ, తెలంగాణ బ్యూరో: త్వరలో రాజ్‌భవన్ భవనాలు, ప్రాంగణం గులాబీమయం కానున్నాయి. స్వయంగా గవర్నర్ తమిళిసై సౌందర్‌‌రాజన్ ఈ విషయాన్ని స్పష్టం చేశారు. ఈ స్ఫూర్తిగా ప్రభుత్వ భవనాలు కూడా అదే రంగును సంతరించుకునే అవకాశాలు లేకపోలేదు. క్యాన్సర్ అవగాహనా సదస్సు సందర్భంగా ఆదివారం వీడియో కాన్ఫరెన్సు ద్వారా ప్రసంగించిన గవర్నర్ తమిళిసై బ్రెస్ట్ క్యాన్సర్ సమస్య దేశంలోనే కాక ప్రపంచంలోనే తీవ్రంగా ఉందని, ఆ వ్యాధికి గులాబీ రంగును సంకేతంగా భావిస్తారని, అక్టోబర్ మాసాన్ని క్యాన్సర్ అవగాహనా మాసంగా పరిగణిస్తున్నందున రాజ్‌భవన్ ప్రాంగణమంతా గులాబీమయం కానున్నదని స్పష్టం చేశారు. క్యాన్సర్ పట్ల విస్తృతమైన అవగాహన కలిగించాలని, కళాశాలకు వెళ్ళే విద్యార్థినులంతా మొబైల్ యాఫ్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలని పిలుపునిచ్చారు.

ఉషాలక్ష్మి బ్రెస్ట్ క్యాన్సర్ ఫౌండేషన్ నిర్వహించిన సదస్సులో గవర్నర్ ప్రసంగిస్తూ, బ్రెస్ట్ క్యాన్సర్‌ను ప్రాథమిక దశలో గుర్తించలేకపోతున్నారని, అడ్వాన్సుడ్ స్టేజీలో గుర్తించడం వలన మరణాలు ఎక్కువగా సంభవిస్తున్నాయని, ఈ పరిస్థితిని మార్చాల్సిన అవసరం ఉందన్నారు. వీలైనంత ఎక్కువగా అవగాహన కలిగించడం ద్వారా ప్రాథమిక దశలోనే గుర్తించవచ్చని, ఇందుకోసం గ్రామాల్లో ప్రత్యేకంగా క్యాంపులు నిర్వహించాలని, సంచార లాబ్‌లను నెలకొల్పాలని సూచించారు. ఎంత తొందరగా గుర్తిస్తే అంతగా మరణాలను తగ్గించవచ్చని ఆమె నొక్కిచెప్పారు. ఇదే క్యాన్సర్ నివారణలో ముఖ్యమైన అంశమన్నారు. సదస్సులో పాల్గొన్న గవర్నర్ గులాబీ రంగు డ్రెస్ ధరించి అదే రంగు మాస్కు పెట్టుకోవడం గమనార్హం.

Next Story

Most Viewed