కరోనా రోగి డెడ్‌బాడీని కుక్కలు పీక్కుతింటున్నాయి

by  |
కరోనా రోగి డెడ్‌బాడీని కుక్కలు పీక్కుతింటున్నాయి
X

దిశ ప్రతినిధి, ఆదిలాబాద్: కరోనా మహమ్మారి.. మానవాళికి నాలుగు నెలలుగా కంటిమీద కునుకులేకుండా చేస్తున్నది. ప్రస్తుతానికైతే మందులేని ఈ రోగం బారిన పడకుండా ఉండేందుకు ప్రజలు స్వీయనియంత్రణ చర్యలు తీసుకుంటున్నారు. అయితే, రక్త సంబంధీకులైనా సరే కొవిడ్ బారిన పడి తనువు చాలిస్తే అంతిమ సంస్కారానికి వెనకాముందు ఆలోచించాల్సిన పరిస్థితి ఉంది. చివరి కార్యానికి పట్టుమని పదిమంది కూడా హాజరు కాలేని దౌర్భాగ్య స్థితి నెలకొంది. దాంతో వ్యాధి లక్షణాలను దృష్టిలో పెట్టుకుని సర్కారు ​బాధితుల కుటుంబాలకు చేదోడుగా ఉంటోంది. మృతుల దహనసంస్కారాల బాధ్యతలను యంత్రాంగానికి అప్పగించింది. కాగా, కొందరు ఆఫీసర్లు, సిబ్బంది నిర్లక్ష్యం వ్యవస్థకే చెడ్డపేరు తెచ్చేలా తయారైంది. ఆదిలాబాద్​లో జరిగిన ఘటనే ఇందుకు ఉదాహరణ.

వెంటనే సమచారమిచ్చినా..

వివరాల్లోకెళితే..ఆదిలాబాద్ జిల్లాకేంద్రానికి చెందిన ఓ వ్యక్తి కొవిడ్ బారిన పడ్డాడు. రిమ్స్​లో చికిత్స పొందుతూ శుక్రవారం మృతి చెందాడు. ఆ మృతదేహానికి పురపాలక శాఖ సిబ్బంది జిల్లాకేంద్రానికి సమీపంలోని పొన్నారి పొలిమేరలో దహన సంస్కారాలు నిర్వహించింది. అయితే, మృతదేహం పూర్తిగా దహనం అయ్యే వరకు చూసుకోకపోవడంతో కళేబరాన్ని కుక్కలు పీక్కుని తినడం గ్రామస్తుల కంట పడింది. వెంటనే ఆఫీసర్లకు సమాచారం ఇచ్చినప్పటికీ యంత్రాంగం నుంచి ఎలాంటి స్పందన లేదు. కాగా, ఈ ఘటనను కొందరు చిత్రీకరించి సోషల్ మీడియాలో పెట్టడంతో ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ఈ ఘటన తీవ్ర కలకలం రేపింది.

ఇదీ..అధికారులు స్పందన

ఈ విషయమై జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి నరేందర్ మాట్లాడుతూ కరోనాతో మృతి చెందితే శవాలను మున్సిపల్ అధికారులకు అప్పగించడంతో మా పని పూర్తి అవుతుందని చెప్పారు. ఆదిలాబాద్ మున్సిపల్ సహాయ కమిషనర్ రాజు మాత్రం మృతదేహాన్ని కుక్కలు పీక్కుతిన్న విషయం తమ దృష్టికి రాలేదని చెప్పారు. ఏది ఏమైనా కొవిడ్ మృతుల దహన సంస్కారాల నిర్వహణ విషయంలో యంత్రాంగం పనితీరుపై ప్రజలు విమర్శలు గుప్పిస్తున్నారు.



Next Story

Most Viewed