ఉద్యోగాల భర్తీకి సర్కార్ బ్రేక్.. ఇక సర్దుబాటే!

by  |
job placement
X

దిశ, తెలంగాణ బ్యూరో : ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగుల సర్దుబాటు మొదలైంది. ప్రస్తుతానికి ఉన్న ఉద్యోగులనే అవసరం ఉన్న పోస్టుల్లో భర్తీ చేస్తున్నారు. కిందిస్థాయిలో కూడా పోస్టులు ఖాళీగా ఉన్నా ఏ ప్రాతిపదికన కూడా భర్తీ చేయడం లేదు. కారుణ్య నియామకాలను సైతం ఆపేశారు. అటెండర్, కంప్యూటర్​ఆపరేటర్ల వంటి కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్​ఉద్యోగులను సైతం నియమించుకునేందుకు అవకాశం లేదంటూ ప్రభుత్వం ఆదేశాలిచ్చింది. ఏ పనుల్లోనైనా ఉన్న వారితోనే సర్దుబాటు చేసుకోవాలని స్పష్టం చేసింది. దీంతో ఆయా శాఖల్లో ఉద్యోగుల సర్దుబాటు మొదలైంది. ఇటీవల ఓ శాఖలో ఉద్యోగులను ఇలాగే రెండు విభాగాల్లో పని చేయాలని సూచించడంపై దుమారం రేపింది. దీనిపై ఉద్యోగులు ఇంకా ఉన్నతాధికారులతో చర్చలు సాగిస్తూనే ఉన్నారు. మరో శాఖలో ఇప్పటి వరకు ఇద్దరు కంప్యూటర్​ఆపరేటర్లు ఉండగా.. అనివార్య కారణాలతో ఇద్దరినీ తొలగించారు. ఆ స్థానాల్లో మరో ఇద్దరిని తీసుకునేందుకు సదరు శాఖాధికారి ప్రయత్నాలు చేస్తే.. ఉన్నతాధికారుల నుంచి అనుమతి నిరాకరించారు. ఆ డిపార్ట్​మెంట్​పరిధిలో మరో విభాగంలో ఉండే కంప్యూటర్​ఆపరేటర్లతో పనులు వెళ్లదీసుకోవాలని, ప్రస్తుతానికి కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్​లో కూడా నియామకం చేసుకోవద్దని ఆదేశాలిచ్చారు.

ఉద్యోగులకు అష్టకష్టాలు

ఇప్పటికే ఉద్యోగాల భర్తీ ప్రక్రియ లేక ప్రభుత్వ శాఖల్లో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. చాలా శాఖల్లో కీలక స్థానాల్లో ఇంచార్జీలు ఉండగా.. ఒక్కో విభాగంలో కనీసం 40 నుంచి 60 కీలక పోస్టులు ఖాళీ ఉన్నాయి. కొన్ని విభాగాల నుంచి ఖాళీల వివరాలను సైతం సేకరించారు. అయితే ప్రభుత్వం త్వరలో ఉద్యోగాల భర్తీ అంటూ ప్రకటిస్తున్నా.. నోటిఫికేషన్లు విడుదల చేయడం లేదు. అయితే చాలా శాఖల్లో కాంట్రాక్ట్​, ఔట్​సోర్సింగ్​ ఉద్యోగులే కీలక బాధ్యతలను సైతం నిర్వర్తిస్తున్నారు. వారిని ఆ బాధ్యతల నుంచి తప్పించేందుకు అధికారులు సైతం ప్రయత్నాలు చేయడం లేదు. ఎందుకంటే అక్కడి నుంచి వారిని తప్పిస్తే .. అక్కడ ఫైళ్లన్నీ పెండింగ్​ పడినట్టే. దీంతో ఎలాగోలా నెట్టుకువస్తున్నారు. అయితే ఇప్పటికే కాంట్రాక్ట్​, ఔట్​సోర్సింగ్​పద్ధతిలో ఉంటున్న వారిని తొలగించి, ఉద్యోగాలు మానేసిన వెంటనే కొత్త వారిని ఎంపిక చేసుకునే అవకాశం ఉండేది. కానీ ప్రస్తుతం ఆ పద్ధతిని ఆపేశారు. తాత్కాలిక పద్ధతిలో కూడా ఎవరినీ నియమించుకోవద్దంటూ ఆర్థిక శాఖ నుంచి ఆయా విభాగాలకు స్పష్టమైన ఆదేశాలిచ్చారు.

వీఆర్‌ఏల సర్దుబాటు షురూ

మరోవైపు ఏడాదికాలంగా ఖాళీగా ఉన్న వీఆర్ఏలను ఇప్పుడు సర్దుబాటు చేసే ప్రక్రియ కొంత మేరకు మొదలైంది. ఇటీవలే నీటిపారుదల శాఖను పునర్వీభజన చేసి, కొత్త కార్యాలయాలను ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలో చాలా ప్రాంతాల్లో లష్కర్లు లేరని గుర్తించారు. ప్రస్తుతానికి పదో తరగతి వరకు చదివిన వీఆర్ఏలను లష్కర్లుగా నియమించాలని ప్రతిపాదించారు. ఈ ప్రతిపాదనలపై సీఎం కేసీఆర్ ఆమోదం తెలిపినట్లు సమాచారం. ఇలా 3360 మందిని రెవెన్యూ శాఖ నుంచి నీటిపారుదల శాఖకు మారుస్తూ ఫైల్ సైతం సిద్ధం చేశారు. నేడో, రేపో ఈ ఉత్తర్వులు వెలువడనున్నట్లు తెలుస్తోంది. పదో తరగతి వరకు చదివిన వారందరీ ఇలా మస్కూరీ, నీరడిగా బదలాయించనున్నారు.

ఉపాధి హామీ ఫీల్డ్​అసిస్టెంట్ల స్థానంలో..!

రెవెన్యూ శాఖలో వీఆర్ఏలుగా మొత్తం 10,724 మంది పని చేస్తుండగా.. వీరిలో 3360 మందిని లష్కర్లుగా బదలాయింపు చేయనున్నారు. మిగిలిన వారికి ఉపాధి హామీ పథకంలో వినియోగించుకోవాలని ప్రతిపాదనలు సిద్ధమవుతున్నాయి. ఉపాధి హామీలో గతంలో ఫీల్డ్​అసిస్టెంట్లు ఉండగా.. వారందరినీ తొలగించారు. సుమారు 7 వేల మందిని తీసివేశారు. వారిని తీసుకోవాలని ఇప్పటికే ఆందోళన చేస్తున్నా ప్రభుత్వం పక్కన పెట్టింది. అయితే ప్రస్తుతం ఉపాధి హామీ బాధ్యతలను సైతం గ్రామ కార్యదర్శులే నిర్వర్తిస్తున్నారు. ఇటీవల పంచాయతీ కార్యదర్శులపై పనిభారం ఎక్కువ కావడం, కొంతమంది ఆత్మహత్య చేసుకోవడంతో పనిభారం తగ్గించాలనే డిమాండ్​ఉంది.

ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఖాళీగా ఉన్న వీఆర్ఏలకు ఉపాధి హామీ బాధ్యతలను అప్పగించాలని ప్రాథమికంగా ప్రతిపాదనలు తయారు చేశారు. మళ్లీ వారు పంచాయతీ కార్యదర్శుల పరిధిలోనే పని చేసే అవకాశాలున్నాయి. ఈ ప్రతిపాదనలపై ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదు. అంతేకాకుండా వీరిని వ్యవసాయ శాఖకు బదిలీ చేయాలనే ప్రతిపాదనలు సైతం గతంలో తయారు చేశారు. క్లస్టర్ల వారీగా ఏఈఓలు ఉన్నప్పటికీ.. గ్రామస్థాయిలో కొంత ఇబ్బందులు ఎదురవుతున్నాయనే నేపథ్యంలో ఏఈఓలకు అసిస్టెంట్లుగా వీఆర్ఏలను నియమించాలని భావించారు. కానీ ప్రస్తుతం వ్యవసాయ శాఖ కూడా ఏ పనీ లేకుండా ఖాళీగానే దర్శనమిస్తోంది. ఈ నేపథ్యంలో ఉపాధి హామీ బాధ్యతలు అప్పగించాలనే కొత్త ప్రతిపాదన తెరపైకి వచ్చింది.



Next Story

Most Viewed