యదేచ్ఛగా ప్రభుత్వ ప్లాట్ల ఆక్రమణ.. పట్టించుకోని అధికారులు

by  |
plats
X

దిశ, మర్రిగూడ: ఇల్లు లేని నిరుపేదలకు దక్కాల్సిన ప్రభుత్వ ప్లాట్లు యదేచ్ఛగా ఆక్రమణకు గురవుతున్నాయి. సర్పంచ్, కార్యదర్శి ఫిర్యాదు చేసినా అధికారులు పట్టించుకోవడం లేదనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. మర్రిగూడ మండలంలోని ఎరుగండ్లపల్లీలో గ్రామసభ సర్పంచ్ మాడం శాంతమ్మ వెంకటయ్య అధ్యక్షతన కార్యదర్శి పద్మ గ్రామసభ నిర్వహించారు. గ్రామసభలో ప్రజలు పెద్ద ఎత్తున ఆరోపించడంతో ప్లాట్ల ఆక్రమణ వెలుగు చూసింది. గ్రామంలోని సర్వే నెంబర్ 724,725 లలో 9.33 గుంటల భూమిని 2003 సంవత్సరంలో ప్రభుత్వం కొనుగోలు చేసి 293 ప్లాట్లను చేసింది. అదే ఏడాదిలో సుమారు 50 మందికి ప్లాట్లను పంపిణీ చేశారు. మిగతా ప్లాట్లు అలాగే ఉన్నాయి.

గ్రామంలో కొంతమంది ఆ ప్లాట్‌లపై కన్నేశారు. కొందరు వ్యక్తులు అప్పటి అధికారుల సంతకాలతో ఫోర్జరీ చేసి అక్రమంగా ప్లాట్లను అమ్ముతున్నారు. కొనుగోలు చేసిన వారు యధేచ్ఛగా ప్లాట్ల ఆక్రమించుకుంటున్నారు. దొంగ పేపర్లు సృష్టించి ప్లాట్లను కబ్జా చేస్తున్నారు అని గ్రామ సభలో ప్రజలు అధికారుల దృష్టికి తీసుకువచ్చారు. దీనిపై సర్పంచ్ మాట్లాడుతూ.. ప్రభుత్వ ప్లాట్లను ఎవరు ఆక్రమించిన వారిపై చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ విషయమై ఉన్నతాధికారులకు అక్రమ దార్ల ఫోర్జరీ పేపర్ల నిగ్గు తేల్చాలని ఫిర్యాదు చేస్తామని సర్పంచ్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ యాదయ్య, వార్డు సభ్యులు, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.


Next Story

Most Viewed