కరోనాతోనూ బిడ్డకు పాలివ్వచ్చు

by  |
కరోనాతోనూ బిడ్డకు పాలివ్వచ్చు
X

దిశ, న్యూస్‌బ్యూరో: కరోనా వైరస్‌తో ఓ ప్రభుత్వ పిడియాట్రిషియన్ పోరాడి గెలిచింది. ఐతే ఆమె ఐదు నెలల బిడ్డకు తల్లి. బిడ్డ సంరక్షణపై ఆందోళన చెందారు. కుటుంబ సభ్యుల సహకారంతో అన్ని జాగ్రత్తలు తీసుకుంటూనే బిడ్డకు పాలు ఇచ్చారు. బిడ్డకు ఎలాంటి సమస్య తలెత్తలేదు. ఇదే విషయాన్ని ఆమె మీడియాకు గురువారం వివరించారు. తను ఎదుర్కొన్న బాధ, ఆనందాన్ని పంచుకున్నారు. తనకు జూన్ 28న సమస్య మొదలైంది. మరుసటి రోజే జ్వరం, ఒంటి నొప్పులు మొదలయ్యాయి. రెండు రోజుల తర్వాత నెమ్మదిగా వాసన చూడలేకపోయానన్నారు. ఇక కరోనా వైరస్ లక్షణాలేనని తెలిసింది. ఈ క్రమంలోనే తన ఐదు నెలల బిడ్డకు కూడా జ్వరం, జలుబు మొదలైంది. తను జూలై ఒకటో తేదీన టెస్టు చేయించుకుంటే పాజిటివ్‌గా తేలింది. వెంటనే హోం క్వారంటైన్‌లోకి వెళ్లిపోయారు. ఓ బిడ్డకు తల్లిగా ఎంతో భయపడ్డట్లు తెలిపారు. తనకొచ్చిన కరోనాకు చాలా ఎమోషనల్‌గా ఫీల్ అయ్యారు. ప్రేమించే భర్త దొరకడం, బాగా చూసుకునే ఫ్యామిలీ ఉండడంతో మద్దతు లభించింది. వాళ్లు నా బిడ్డకు పాలు ఇవ్వమని ప్రోత్సహించారు. ఎలాగూ నేను పిడియాట్రిషియన్ కావడంతో తల్లి పాలు తాగడం వల్ల కలిగే ప్రయోజనాలే ఏమిటో బాగా తెలుసు.

వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ పేర్కొన్న అన్ని జాగ్రత్తలు తీసుకున్నాను. చేతులను శుభ్రంగా కడుక్కున్నాను. ఎన్-95 మాస్క్ ధరించాను. ఫేస్ షీల్డ్, గ్లౌజులు ధరించి తన బిడ్డకు పాలు ఇచ్చినట్లు పేర్కొన్నారు. అపోలో క్రెడిల్ లాక్టేషన్ కన్సల్టెంట్ డా.వినోదతోనూ ప్రత్యేకంగా ప్రస్తావించాను. తల్లి పాలు ఇవ్వడాన్ని కొనసాగించడానికి భద్రత, ప్రయోజనం గురించి భరోసా ఇచ్చారు. శ్వాస వ్యాయామాలు కూడా నేర్పించారు. కష్టంలో ఉన్న తనను ప్రోత్సహించినట్లు పేర్కొన్నారు. మూడు రోజుల తర్వాత జ్వరం, జలుబు, దగ్గు ఎక్కువైంది. కానీ కరోనాతో యుద్ధం చేస్తూనే ఉన్నాను. తర్వాత కరోనా లక్షణాలు తగ్గడం మొదలయ్యాయి. ప్రాణాయామం, ఆవిరి పీల్చడం, వేడి నీళ్లతో గార్లింగ్ చేయడం తరచూ చేశాను. కూరగాయలు, పండ్లు, డ్రై ఫ్రూట్స్, గుడ్లు, పాలు, ఔషద టీలతో ఆరోగ్యాన్ని కాపాడుకున్నానని తెలిపారు. కొద్ది రోజులకే తన ఆరోగ్యం మెరుగు పడిందన్నారు. తన బిడ్డ అందమైన చిరునవ్వుతో ఆ రోజులన్నీ ఆనందంతోనే నిండాయి. ఆఖరికి 18న మళ్లీ పరీక్ష చేయించుకుంటే నెగిటివ్‌గా తేలింది. సాధారణ దినచర్యను ఆరభించినట్లు చెప్పారు.

బిడ్డకు పాలివ్వచ్చు

తన అనుభవం ద్వారా రక్షణ చర్యలతో అనారోగ్య సమయంలోనూ తల్లి బిడ్డకు పాలివ్వడం కొనసాగించొచ్చునని కరోనా వైరస్‌తో పోరాడి విజయం సాధించిన పిడియాట్రిషియన్ స్పష్టం చేశారు. కరోనా పాజిటివ్ అని తేలగానే బిడ్డకు పాలు ఇవ్వొచ్చా లేదా అన్న సందేహం వద్దు. కానీ అన్ని జాగ్రత్తలు తీసుకోవడం తప్పనిసరి అన్నారు. కరోనా వైరస్‌తో తన అనుభవాన్ని నలుగురితో పంచుకోవాలని లాక్టేషన్ కన్సల్టెంట్ డా.వినోద ప్రోత్సహించినట్లు పేర్కొన్నారు.

Next Story

Most Viewed