HIV బాధితులపై వివక్ష తగదు : మంత్రి హరీష్ రావు

by  |
HIV బాధితులపై వివక్ష తగదు : మంత్రి హరీష్ రావు
X

దిశ, తెలంగాణ బ్యూరో : ఎయిడ్స్ రోగులపై చిన్న చూపు తగదని ఆరోగ్యశాఖ మంత్రి హరీష్ రావు పేర్కొన్నారు. ఎర్రగడ్డ చెస్ట్ ఆసుపత్రిలో నిర్వహించిన ప్రపంచ ఎయిడ్స్ డే కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ప్రజలను చైతన్యం చేయడం కోసం డిసెంబర్ 1న ఎయిడ్స్ దినోత్సవం జరుపుతున్నామన్నారు. ఇప్పటికే వ్యాధిపై అవగాహన పెరగటం వల్ల 90 శాతం మరణాలు తగ్గాయన్నారు. మరణాలు మరింత తగ్గేలా ప్రభుత్వం కార్యక్రమాలు చేపడుతున్నట్టు పేర్కొన్నారు.

ఎయిడ్స్ బాధితులపై వివక్ష చూపడం వల్ల.. వారు మానసికంగా ఎంతో బాధను అనుభవిస్తారని అన్నారు. గాలి ద్వారా, ముట్టుకుంటే ఎయిడ్స్ సోకదని ప్రతీ ఒక్కరూ అవగాహన కల్పించాలని కోరారు. తెలంగాణ ఏర్పడక ముందు రాష్ట్రంలో ఎయిడ్స్ శాతం 0.7గా ఉంటే, రాష్ట్రం ఏర్పడ్డాక ప్రభుత్వం చేపట్టిన నిరోధక చర్యల వల్ల 0.7 నుండి 0.4 శాతానికి తగ్గిందన్నారు. ఎయిడ్స్ నివారణ కోసం ప్రభుత్వం 167 ఐసీటీసీ కేంద్రాలు నెలకొల్పినట్టు చెప్పారు. 22 ప్రభుత్వ ఏఆర్‌టీ చికిత్స కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు.
ఎయిడ్స్ రోగులకు ప్రభుత్వం ఉచితంగా మందులు అందిస్తోందన్నారు. హెచ్ఐవీ వ్యాధిగ్రస్థులకు తెలంగాణ ప్రభుత్వం ఆసరా పెన్షన్ అందిస్తున్నదని గుర్తుచేశారు.

సీఎం కేసీఆర్ ఆదేశాలతో హైదరాబాద్, వరంగల్‌లో ఎయిడ్స్‌, షుగర్ వ్యాధిగ్రస్థులకు ప్రత్యేక డయాలసిస్ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. ఎయిడ్స్ కంట్రోల్, చికిత్స, అవగాహన కోసం ప్రభుత్వం 50 కోట్లకు పైగా ఖర్చు చేస్తున్నదని చెప్పారు. హై రిస్క్ గ్రూప్ వారిని కాపాడేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని వివరించారు.

ఎయిడ్స్‌పై పోరాటంలో స్వచ్ఛంద సంస్థల పాత్ర కీలకమైందని అన్నారు. ప్రభుత్వం, ఎన్జీవోలు, ప్రజలందరూ కలిసి ఎయిడ్స్ మహమ్మారిని తరిమేయాలని పిలుపునిచ్చారు. బాధితులను కాపాడుకోవాలన్నారు. ఈ సందర్భంగానే చెస్ట్ ఆసుపత్రి పరిసరాల్లో ఏర్పాటు చేసే 1000 పడకల సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రికి, హైదరాబాద్ నలువైపులా నిర్మించే 4 సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులకు సీఎం కేసీఆర్ త్వరలో శంకుస్థాపన చేస్తారని వెల్లడించారు. సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మించి ప్రజలకు ఉచితంగా కార్పొరేట్ ఆసుపత్రి వైద్య సేవలు అందించాలన్నదే కేసీఆర్ ఆశయమని స్పష్టం చేశారు.



Next Story