ఎల్ఐసీ ఐపీఓలో విదేశీ పెట్టుబడిదారులకు అవకాశం!

by  |
ఎల్ఐసీ ఐపీఓలో విదేశీ పెట్టుబడిదారులకు అవకాశం!
X

దిశ, వెబ్‌డెస్క్: దేశీయ అతిపెద్ద బీమా రంగ సంస్థ ఎల్ఐసీ పబ్లిక్ ఆఫరింగ్(ఐపీఓ)కు సంబంధించి 20 శాతం వరకు విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులకు అనుమతిచ్చేందుకు ప్రభుత్వం యోచిస్తున్నట్టు ప్రభుత్వం వర్గాలు తెలిపాయి. ఎల్ఐసీ లిస్టింగ్ దేశంలోనే అతిపెద్ద ఐపీఓగా భావిస్తున్న తరుణంలో ప్రభుత్వం వాటా విక్రయం ద్వారా రూ. 90 వేల కోట్ల వరకు నిధులను సమీకరించాలని లక్ష్యంగా ఉంది. ప్రస్తుతం విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు ప్రైవేట్ బీమా సంస్థల్లో 74 శాతం, ప్రభుత్వ రంగంలో 20 శాతం వరకు వాటాకు అనుమతి ఉన్నప్పటికీ, ఎల్ఐసీలో వాటాలకు అనుమతిలేదు.

అయితే, ఇప్పుడు విదేశీ సంస్థాగత పెట్టుబడిదారుల(ఎఫ్ఐఐ)లకు అనుమతివ్వడం ద్వారా విదేశీ పెన్షన్ ఫండ్ సంస్థలు, బీమా కంపెనీలు, మ్యూచువల్ ఫండ్‌లు ఎల్ఐసీ ఐపీఓలో పాల్గొనేందుకు వీలుంటుందని ప్రభుత్వం భావిస్తోంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోనే ఎల్ఐసీ ఐపీఓ ప్రక్రియను పూర్తి చేయాలని ప్రభుత్వం తొందరపడుతోంది. దీనికోసం గత నెలలో ప్రక్రియ నిర్వహించేందుకు పది మర్చంట్ బ్యాంకులను ఎంపిక చేసింది. అయితే, ఈ ఐపీఓకు చైనా పెట్టుబడిదారులను అనుమతించకపోవచ్చని ప్రభుత్వ అధికారులు చెప్పారు. రెండు దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు ఇంకా కొనసాగుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. కాగా, ప్రభుత్వ రంగ ఎల్ఐసీ సంస్థ భారత జీవిత బీమా మార్కెట్లోనే 60 శాతం కంటే ఎక్కువ వాటాను కలిగి ఉండటంతో ఎఫ్ఐఐలకు అనుమతివ్వడంపై ఆసక్తి నెలకొంది.



Next Story

Most Viewed