ల్యాండ్ మాఫియా దందా.. ప్రభుత్వ మత్స్యశాఖ భూమి కబ్జాయత్నం

by  |
ల్యాండ్ మాఫియా దందా.. ప్రభుత్వ మత్స్యశాఖ భూమి కబ్జాయత్నం
X

దిశ ప్రతినిధి, నిజామాబాద్ : నిజామాబాద్ నగర నడిబొడ్డున ఉన్న బోధన్ రోడ్డులోని మత్స్యశాఖ కార్యాలయ భూమిని కబ్జా చేసేందుకు ప్రయత్నం జరిగింది. సోమవారం తెల్లవారుజామున వాచ్‌మెన్‌ను బెదిరించి కొందరు వ్యక్తులు అక్రమంగా కబ్జాకు యత్నించారు. వివరాల ప్రకారం.. బోధన్ రోడ్డులోని అర్సపల్లి వద్ద మత్స్యశాఖకు కోట్ల విలువ చేసే భూములు ఉన్నాయి. అందులో ఫిష్ ఫాండ్‌తో పాటు కార్యాలయం, ఓపెన్ ప్లేస్ ఉన్నాయి.

గత కొన్ని రోజులుగా కొందరు వ్యక్తులు.. సదరు భూమి తమదేనంటూ రకరకాల ప్రయత్నాలతో భూ కబ్జాకు ప్రయత్నిస్తున్నారు. రెండు నెలల క్రితం సంబంధిత భూమి ప్రైవేట్ వ్యక్తులేదనని ఉత్తర మండల సర్వేయర్ రిపోర్టు తయారు చేశారు. అయితే రిపోర్టు ఉన్నతాధికారుల ఆదేశాలకు సంబంధం లేకుండానే జరిగిందని జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డి సర్వేయర్‌ను సస్పెండ్ చేశారు. ఇప్పటికీ సర్వేయర్‌ను విధుల్లోకి తీసుకోవడం డోలాయమనంలో ఉంది. కానీ, కబ్జాదారులు సోమవారం భూమి కబ్జాకు ప్రయత్నించారు. విషయం తెలిసిన జిల్లా మత్స్యశాఖాధికారి స్థానిక 1వ టౌన్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

దీంతో కబ్జాదారులు అక్కడి నుంచి వెళ్లిపోయారు. కబ్జాదారుల వెనుక ల్యాండ్ మాఫియా ఉందనే ఆరోపణలున్నాయి. ల్యాండ్ సర్వే అధికారులు పకడ్బంధీగా సర్వే చేసి అది ప్రభుత్వ భూమిగా తేల్చిన తర్వాత ప్రైవేట్ భూమిగా రికార్డులు బయటకు రావడంపై విమర్శలున్నాయి. కొందరు రెవెన్యూ, ల్యాండ్ సర్వే శాఖాధికారులు భూకబ్జాదారులకు వత్తాసు పలుకుతున్నారని సమాచారం. గతంలో సర్వేయర్ సస్పెన్షన్‌తో పాటు జిల్లా అధికారులపై వేటు పడాల్సి ఉన్నా ఒక మంత్రి అడ్డుకున్నారని చర్చ జరుగుతోంది.

ప్రభుత్వ భూములను ప్రైవేట్ పరం చేయడానికి అధికారుల ప్రయత్నం వెనుక అధికార పార్టీ ఒత్తిడి ఉందని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సోమవారం ఉదయం జిల్లా మత్స్యశాఖాధికారి ఫిర్యాదు చేస్తే స్థానికంగా పోలీసు సిబ్బంది వచ్చి కబ్జాదారులను వెళ్లగొట్టారని, కానీ కేసుల విషయానికొచ్చేసరికి జాప్యం జరిగిందని మత్స్యశాఖాధికారులే ఆరోపిస్తున్నారు.



Next Story

Most Viewed