దళిత బంధుపై కీలక స్టెప్.. గ్రామాలకు బ్యాంకు అధికారులు

by  |
cm-kcr
X

దిశ ప్రతినిధి, కరీంనగర్ : దళిత బంధు లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియపై అధికారులు భారీ కసరత్తులు చేస్తున్నారు. సర్వే ద్వారా గుర్తించిన దళితులందరినీ చేరదీసి గ్రామ సభలు ఏర్పాటు చేయనున్నారు. ఒక్కో గ్రామానికి ఒక్కో బ్యాంకును దత్తతగా అప్పగించిన ప్రభుత్వం ఈ సభలకు బ్యాంకర్లను కూడా తీసుకెళ్లనున్నారు.

గ్రామాల వారీగా లబ్ధిదారుల జాబితాను తయారు చేసి పంచాయతీల్లో సభను ఏర్పాటు చేస్తారు. సభల్లో మొదటి ప్రియారిటీ కింద ఎంపిక చేయాల్సిన వారిని గుర్తించి బ్యాంకర్ల ద్వారా లబ్ధిదారుల అకౌంట్లలోకి డబ్బులు బదిలీ చేయనున్నారు. సీఎం కేసీఆర్ చెప్పిన విధంగా ముందుగా నిరుపేదలను ఎంపిక చేస్తారు. ఇలా ప్రాధాన్యతగా విడుతల వారిగా లబ్ధిదారులందరికీ దళిత బంధు కింద రూ. 10 లక్షల చొప్పున అప్పగించే ప్రక్రియ పూర్తి చేయనున్నారు.

24 వేల మంది..

నియోజకవర్గంలోని హుజురాబాద్, వీణవంక, జమ్మికుంట, ఇల్లందకుంట, కమలాపూర్ మండలాల్లో మొదట 21,255 కుటుంబాలు గుర్తించగా, సర్వే ద్వారా మరో 3012 కుటుంబాలను ఎంపిక చేశారు. ఐదు మండలాల్లోని 24,267 కుటుంబాలకు లబ్ధి చేకూర్చేందుకు ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం రూ. 2 వేల కోట్లు విడుదల చేసింది. అదనంగా రూ. 426.7 కోట్లు అవసరం అవుతాయని జిల్లా యంత్రాంగం ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించింది.

యాప్‌లో అప్ లోడ్..

దళిత బంధు కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన యాప్‌లో అధికారులు లబ్ధిదారుల వివరాలను అప్ లోడ్ చేస్తున్నారు. ఆయా కుటుంబాలకు చెందిన పూర్తి వివరాలు, వారు ఏ వ్యాపారాలు కోరుకుంటున్నారో కూడా అందులో పొందుపరిచారు. గ్రామ సభల్లో ఎంపికైన లబ్ధిదారుల వివరాలను వెంటనే యాప్‌లో అప్‌లోడ్ చేసి స్కీం అప్రూవల్ అయినట్టు కూడా వివరిస్తూ పేర్కొంటారు.

వివరాలివే..

ఇప్పటి వరకు దళిత బంధు లబ్ధిదారులపై జరిపిన సర్వేలో వారు స్వయం ఉపాధి కోసం ఎంచుకున్న వివరాలు ఇలా ఉన్నాయి. 8 వేల మంది మిల్క్ డైరీలు, 5 వేల మంది ట్రాక్టర్లు, కార్లు, గూడ్స్ ఆటోలు కొనుగోలు చేసుకుంటామని వివరించారు.

3 వేల మంది వివిధ రకాల హోల్‌సేల్ షాప్స్ ఏర్పాటు చేసుకుంటామని అధికారులకు చెప్పారు. వీరికి సంబంధించిన ప్రతిపాదనలు వ్యాపారపరంగా వారు ఎలా ఉపాధి పొందబోతున్నారన్న వివరాలపై అధికారులు అధ్యయనం చేయనున్నారు. మిగతా 8 వేల మందికి సంబంధించిన స్వయం ఉపాధి ఎంపిక ప్రక్రియ ఒకటి రెండు రోజుల్లో పూర్తి కానుందని సమాచారం.

రాహుల్ బొజ్జా సమక్షంలోనే..

హుజురాబాద్‌లోని దళిత బంధు స్కీంకు సంబంధించిన అన్ని రకాల ఫైళ్లు పూర్తైన తరువాత గ్రామ సభలు, వారికి అందించనున్న నగదు బదిలీ అంతా కూడా సీఎంఓ ప్రత్యేక కార్యదర్శి రాహుల్ బొజ్జా సమక్షంలోనే జరగనుంది. ఆయన కరీంనగర్, హుజురాబాద్‌లో పర్యటించి దళిత బంధు స్కీంను పూర్తి స్థాయిలో అమలు చేసేందుకు దిశానిర్దేశం చేయనున్నారు.

రిజర్వేషన్లు ఆలస్యం..

ముఖ్యమంత్రి కేసీఆర్ దళిత బంధు స్కీంలో భాగంగా లబ్ధిదారులకు ప్రభుత్వ పరంగా లైసెన్సులు తీసుకుని చేసుకునే వ్యాపారాల్లోనూ రిజర్వేషన్ సౌకర్యం కల్పిస్తామని ప్రకటించారు. అయితే ఎక్సైజ్ పాలసీతో పాటు, ఫెర్టిలైజర్ షాప్స్, ప్రభుత్వ సంక్షేమ హాస్టళ్లలో ఉండే కాంట్రాక్టులపై కూడా ప్రభుత్వం తుది కసరత్తులు చేసి ఆదేశాలు జారీ చేయాల్సి ఉంది.



Next Story

Most Viewed