పద్మవ్యూహంలో అన్నదాత.. సర్కారు ఆదేశాలతో బ్యాంకర్ల కిరికిరి

by  |
పద్మవ్యూహంలో అన్నదాత.. సర్కారు ఆదేశాలతో బ్యాంకర్ల కిరికిరి
X

దిశ, తెలంగాణ బ్యూరో : రాష్ట్రంలో వరిసాగు చేస్తున్న రైతులు పద్మవ్యూహంలో చిక్కుకుంటున్న పరిస్థితి ఏర్పడింది. యాసంగిలో వరి సాగు చేయొద్దంటూ ఇప్పటికే ప్రకటించిన సర్కారు.. అనుబంధ విభాగాలకు సైతం ఆదేశాలు జారీ చేస్తోంది. వరిసాగు చేసే రైతులకు లోన్ ఇవ్వొద్దని సూచించినట్టు తెలుస్తోంది. దీంతో క్రాప్‌లోన్ కోసం బ్యాంకులకు వెళ్లిన రైతులకు నిరాశే ఎదురవుతుంది. కొన్ని బ్యాంకుల్లో నేరుగా పంటల వివరాలు అడుగుతుండగా, మరి కొన్ని బ్యాంకుల అధికారులు ఏకంగా ఫీల్డ్ ఆఫీసర్స్‌తో ఎంక్వైరీ చేయిస్తున్నారు. వరి కాకుండా ప్రత్యామ్నాయ పంటలు వేసుకోవాలంటూ సలహాలు సైతం ఇస్తున్నారు. దీనికి తోడు పాత రుణాలకు వడ్డీ కట్టించుకుని కొత్త రుణంపై దాటవేత ధోరణి ప్రదర్శిస్తున్నారు బ్యాంకర్లు. వరి వేయొద్దని ప్రభుత్వం చెబుతుంటే వరి పంటకు తాము రుణం ఎలా ఇస్తామని బ్యాంకు అధికారులు రైతులను ప్రశ్నిస్తున్న పరిస్థితులు నెలకొన్నాయి.

దొరకని విత్తనాలు..

యాసంగిలో పంట వేయాలా? వద్దా? అనే ఆలోచనల్లో రైతులు కొట్టుమిట్టాడుతున్నారు. వరిపై ఇప్పటికే ప్రభుత్వం ఆంక్షలు విధించింది. జిల్లా కలెక్టర్లు, వ్యవసాయ శాఖ ఉన్నతాధికారులు సైతం రైతులకు యాసంగిలో వరి విత్తనాలు విక్రయించొద్దని, విక్రయిస్తే లైసెన్సులు రద్దు చేస్తామని హెచ్చరికలు జారీ చేశారు. గతంలో విత్తనాలు సాగు చేసిన వారి వద్ద కొన్ని అందుబాటులో ఉన్నా.. మిగిలిన రైతులకు మార్కెట్‌లో విత్తనాలు దొరకలేదు. ఇప్పటికీ యాసంగి ప్రణాళిక విడుదల కాలేదు. వానాకాలంలో 61.94 లక్షల ఎకరాల్లో వరి సాగు చేశారు. 2020 యాసంగిలో 52.78 లక్షల ఎకరాల్లో వరి సాగయింది.

క్రాప్ లోన్లు 23 శాతమే..

2021–22కి సంబంధించి రెండు సీజన్ల కోసం రూ.59,440 కోట్ల పంట రుణాలు ఇవ్వాలని బ్యాంకర్లు లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇందులో వానాకాలంలో రూ.35,665 కోట్లు ఇవ్వాల్సి ఉండగా రూ.36,776 కోట్లు ఇచ్చారు. యాసంగిలో రూ.23,775 కోట్లు ఇవ్వాల్సి ఉండగా ఇప్పటివరకు రూ.5135 కోట్లు (23 శాతం) మాత్రమే పంట రుణాలు ఇచ్చినట్టు అధికారులు వెల్లడించారు.

అప్పు ఇవ్వడం లేదు
– చౌడమల్ల నారాయణ, రైతు, హుజూరాబాద్
క్రాప్ లోన్ కోసం బ్యాంకుల చుట్టూ చెప్పులు అరిగేలా తిరిగిన. అప్పుడు రా.. ఇప్పుడు రా.. అని తిప్పించుకుంటున్నరు. గతంలో వరి సాగుకు వెంటనే అప్పు ఇచ్చేవారు. ఇప్పుడు మాత్రం తిప్పి తిప్పి సంపుతున్నరు. ఇప్పుడు ఎందుకు ఇలా కష్టాలు పెడుతున్నరో తెల్వడం లేదు.

ఆదేశాలు రాలేదంటున్నరు
– శ్రీపతి సారయ్య, రైతు, హుజురాబాద్
క్రాప్‌లోన్ కోసం ఎన్నిసార్లు బ్యాంకు చుట్టూ తిరిగినా ఉత్తిదే అయితంది. ఎన్ని సార్లు తిరగాలే అని గట్టిగా అడిగితే.. ప్రభుత్వం నుంచి ఎలాంటి ఆదేశాలు రాలేదని బ్యాంకులో చెబుతున్నారు.

ధాన్యం డబ్బులు రాలే.. అప్పు ఇస్తలే
– తొగరి ఓదెలు, గాజులపల్లి, మంథని మండలం.
ధాన్యం మార్కెట్‌లో అమ్మి వారం రోజులైతాంది. ఇంకా ఆ డబ్బులు రాలే. ఇప్పుడు మళ్లీ వరి వేద్దామని క్రాప్​లోన్ల కోసం బ్యాంకులకు వెళ్తే ఇవ్వడం లేదు. గతంలో పెట్టుబడుల కోసం తీసుకున్న రుణం ఇంకా మాఫీ కాలేదని వడ్డీ చెల్లించమన్నరు. అక్కడా ఇక్కడా అప్పు తెచ్చి బ్యాంకు అప్పుకు వడ్డీ చెల్లించి రుణాన్ని రెన్యువల్ చేసుకున్నాను.

రుణాలు ఇలా..
ఏడాది లక్ష్యం పంపిణీ (కోట్లల్లో)
2014-15 18,717 17,019
2015-16 27,800 20,585
2016-17 29,101 26,282
2017-18 39,752 31,414
2018-19 42,494 33,751
2019-20 48,470 38,150
2020-21 59,440 41,805.


Next Story