వైరాలజీ లాబ్‌కు స్థలాల ఎంపిక

by  |
వైరాలజీ లాబ్‌కు స్థలాల ఎంపిక
X

దిశ, తెలంగాణ బ్యూరో : రాష్ట్ర ప్రభుత్వం ఎట్టకేలకు మూడు స్థలాలను నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్‌ (ఎన్‌సీడీసీ), వైరాలజీ ల్యాబ్‌ కోసం ఎంపిక చేసింది. ఈ విషయంపై కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాసింది. హైదరాబాద్‌ శివారులోని తుర్కపల్లి (జీనోమ్‌ వ్యాలీ)లో లేదా కర్కపట్ల వద్ద ఉన్న జీనోమ్ వ్యాలీ ఫేజ్‌-3లో లేదా రంగారెడ్డి జిల్లాలోని ఫార్మా సిటీ ల్యాండ్స్‌లో స్థలాన్ని కేటాయించడానికి సిద్ధంగా ఉన్నట్టు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ కార్యదర్శి రిజ్వీ ఆ లేఖలో వెల్లడించారు. ఈ బిల్డింగ్, పరిసరాల కొలతలను టీఎస్‌ఎంఎస్‌ఐడీసీ ఇంజనీర్లు ఆ లేఖలో వివరించారు. స్థలాలను పరిశీలించడానికి నిపుణుల బృందాన్ని పంపించాలని సూచించారు. ఈ మూడు ప్రాంతాల్లో ఎక్కడైనా అవసరమైనంత స్థలాన్ని ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నట్టు పేర్కొన్నారు.

పూర్తిస్థాయిలో ల్యాబ్, ఎన్‌సీడీసీ ఏర్పాటయ్యే వరకూ, ఫీవర్ హాస్పిటల్ వెనకాల ఉన్న ఓల్డ్ బిల్డింగ్‌లో ల్యాబ్ వర్క్‌ స్టార్ట్ చేసుకోవచ్చునని తెలిపారు. వైరాలజీ ల్యాబ్ ఏర్పాటుకు మూడేండ్లుగా కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తున్నా, రాష్ర్ట సర్కార్ పెద్దగా ఆసక్తి చూపలేదని, ఇప్పటివరకూ స్థలాన్ని చూపించకుండా పాత భవనాలను వాడుకోవచ్చంటూ సూచించిందని కేంద్ర హోం సహాయ మంత్రి కిషన్ రెడ్డి ఇటీవలే విమర్శించారు. ల్యాబ్ కోసం గ్రేటర్ హైదరాబాద్‌లో పరిధిలో కనీసం రెండు ఎకరాల జాగ కేటాయించాలని, పూర్తి ఖర్చు తామే భరిస్తామని కేంద్రం గతంలోనే రాష్ట్ర ప్రభుత్వానికి స్పష్టం చేసింది.

కానీ, స్థలం కేటాయించకపోవడంతో ఆ ప్రాజెక్ట్ అక్కడే ఆగిపోయింది. ఇటీవల కేంద్ర ప్రభుత్వం బడ్జెట్‌లోనూ వైరలాజీ ల్యాబ్‌ల ఏర్పాటుకు నిధులను కేటాయించింది. ఏపీ ప్రభుత్వం గవన్నవరం సమీపంలో ల్యాండ్ ఇచ్చేందుకు అంగీకరించింది. దీంతో ల్యాబ్ ఇతర రాష్ట్రాలకు తరలిపోతుందని రాష్ట్ర ప్రభుత్వాన్ని తెలంగాణ వైద్యారోగ్య శాఖ అధికారులు, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి అప్రమత్తం చేశారు. దీంతో స్థలాన్ని ఎంపిక చేసి వివరాలన్నింటినీ పేర్కొని ఎన్‌సీడీసీ ఉన్నతాధికారులు, కేంద్ర వైద్యారోగ్య కార్యదర్శికి లేఖ రాశారు.

హైదరాబాద్‌లోనే వైరస్‌ల నిర్ధారణ

ప్రస్తుతం జికా, ఎబోలా తదితర అనుమానిత కేసుల శాంపిళ్లను పూణెలోని వైరాలజీ ల్యాబ్ కు పంపించి టెస్టులు చేయిస్తోంది రాష్ట్ర వైద్యారోగ్య శాఖ. వైరాలజీ ల్యాబ్ హైదరాబాద్‌లో ఏర్పాటైతే కరోనా, జికా, ఎబోలా వంటి కొత్త కొత్త వైరస్‌‌లను ఇక్కడే నిర్ధారించే అవకాశం ఉంటుంది. కరోనా వచ్చిన కొత్తలోనూ శాంపిళ్లను పూణె ల్యాబ్‌కే పంపించాల్సి వచ్చింది.



Next Story