నకిలీ డాక్టర్ల జాడ ఏదీ?

by  |
నకిలీ డాక్టర్ల జాడ ఏదీ?
X

దిశ, తెలంగాణ బ్యూరో: ప్రజలకు నాణ్యమైన వైద్యం అందించేందుకు సమాజంలోని నకిలీ డాక్టర్లను ఏరి వేయడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. దీంతో ఫేక్​ డాక్టర్ల ఆగడాలు మించిపోతున్నాయి. గ్రేటర్​ పరిధిలో గతంలో సుమారు 100 మంది అర్హతలేని వైద్యులు నర్సింగ్​ హోంలు, క్లినిక్​, హాస్పిటల్స్​ నిర్వహిస్తున్నట్టు ఓ ప్రైవేట్​ సంస్థ ఇచ్చిన రిపోర్టు ప్రకారం వైద్యారోగ్యశాఖ ప్రాథమికంగా అంచనా వేసింది. వారు నిర్వహించే దవాఖాన్లకు పూర్తిస్థాయి విజిట్​ చేసి ఆ వివరాలను అందచేయాలని ప్రజారోగ్య, కుటుంబ సంక్షేమశాఖ సంచాలకులు గతేడాది డిసెంబరు 11వ తేదీన మూడు జిల్లాల డీఎమ్​హెచ్​ఓలకు ఆదేశాలు జారీ చేశారు.

అప్పట్లో పలు మీడియాల్లోనూ పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. ఇది జరిగి పది నెలలు గడిచినా.. వైద్యారోగ్యశాఖ కనీసం ఒక్క డాక్టర్​ ను కూడా పట్టుకోలేకపోవడం విచిత్రంగా ఉంది. ఈ విషయంలో గ్రేటర్​ పరిధిలోని డీఎమ్​హెచ్​ఓలు పూర్తిగా విఫలమయ్యారు. కనీసం రిపోర్టులు కూడా తయారు చేయలేదంటే పరిస్థితి ఏ విధంగా ఉన్నదో? అర్థం చేసుకోవచ్చు. సెకండ్​ వేవ్ లో​ అదే డాక్టర్లు కరోనా ట్రీట్మెంట్​ పేరిట లక్షల రూపాయాలను దండుకున్నట్లు వైద్యారోగ్యశాఖలోని కొందరు అధికారులు అప్​ ది రికార్డులో చెబుతున్నారు. ఇంత పెద్దస్థాయిలో నకిలీలను గుర్తించి, ఎందుకు పట్టుకోలేకపోయారనేది? ఇప్పుడు మిలియన్​ డాలర్ల ప్రశ్న. అసలు వాళ్లు దొరకలేదా? వదిలేశారా? అని ఆ డిపార్ట్​మెంట్​ లోనే కింది స్థాయి సిబ్బంది గుసగుసలాడుతున్నారు. మరికొందరు ప్రభుత్వ పెద్దలు నుంచి ఆఫీసర్లపై ఒత్తిడి కూడా తెచ్చినట్టు సమాచారం. దీంతో చేసేదేమీ లేక ఉన్నతాధికారులు వారిపై యాక్షన్​ తీసుకునేందుకు వెనకడుగు వేసినట్టు హెల్త్​ డిపార్ట్​మెంట్​ లోని సిబ్బంది చర్చించుకుంటున్నారు.

వైద్యారోగ్యశాఖకు డిసెంబరు లో వచ్చిన 100 మంది ఫేక్ ​డాక్టర్ల జాబితాలో అత్యధికంగా 52 మంది రంగారెడ్డి, ఏడుగురు హైదరాబాద్​, 41 మంది మేడ్చల్​ జిల్లాలకు చెందిన వ్యక్తులుగా గుర్తించారు. వీరిలో ఏకంగా 80 శాతం మంది ఆర్​ఎంపీలే ఉన్నట్టు అధికారులు చెబుతున్నారు. అయితే ఫేక్​ డాక్టర్లపై పలు మీడియాల్లో పెత్త ఎత్తున కథనాలు రావడంతో వాళ్లంతా గుట్టుచప్పుడు కాకుండా జారుకున్నారు. టాస్క్​ఫోర్సు టీంలను చిక్కకుండా ప్రత్యేక జాగ్రత్తలు తీసుకున్నారని స్వయంగా అధికారులు చెప్పడం గమనార్హం. కరోనా సెకండ్​ వేవ్​ నియంత్రణ చర్యలో పడి ఈ ఫేక్​ డాక్టర్ల ముచ్చటను వైద్యాధికారులు మరిచిపోయారు. దీంతో ప్రజారోగ్యంపై ప్రభావం పడుతుందని, నకిలీ డాక్టర్లను ఏరివేసేందుకు చర్యలు చేపట్టాలని ప్రజలతో పాటు పబ్లిక్​ హెల్త్​ స్పెషలిస్టులు కోరుతున్నారు. లేదంటే వైద్య వ్యవస్థ అస్తవ్యస్తంగా మారే ప్రమాదం ఉందని సూచిస్తున్నారు. ఇప్పటికైనా ఆ ఫేక్​ వైద్యులను పట్టుకుంటారా? లేదా? అని ప్రజలు చర్చించుకుంటున్నారు.



Next Story