సర్కార్​కు ‘ఇన్​సర్వీస్’​ సెగ.. గ్రామీణ వైద్యులకు కొత్త చిక్కులు..

by  |
సర్కార్​కు ‘ఇన్​సర్వీస్’​ సెగ.. గ్రామీణ వైద్యులకు కొత్త చిక్కులు..
X

దిశ, తెలంగాణ బ్యూరో : రాష్ట్ర ప్రభుత్వానికి ‘ఇన్​సర్వీస్​ కోటా సెగ’ తగిలింది. సుమారు మూడేళ్ల తర్వాత ఈ విధానాన్ని పునరుద్ధరించినా, కోటా శాతం తగ్గింపు పై ఏకంగా ప్రభుత్వ వైద్యుల నుంచే వ్యతిరేకత కనిపిస్తోంది. డీఎంఈ డా రమేష్​రెడ్డి, కాళోజీ హెల్త్ యూనివర్సిటీ వీసీ కరుణాకర్​రెడ్డిలు ప్రభుత్వాన్ని తప్పుదొవ పట్టిస్తున్నారంటూ ప్రభుత్వ వైద్య సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. సర్కార్​కు తప్పుడు ఫీడ్​బ్యాక్​ఇచ్చి జీవో 155 రావడానికి ప్రధాన కారణమయ్యారంటూ మండిపడుతున్నారు. దీంతో ఉన్నత చదువులు చదివేందుకు, గ్రామీణ ప్రాంతాల్లో పనిచేసే వైద్యులకు అవకాశం తగ్గుతుందని వివరించారు.

మరీ ముఖ్యంగా మారుమూల గ్రామీణ గిరిజన నేపథ్యం నుంచి వచ్చిన పేద ఎస్సీ, ఎస్టీ ,బీసీ మైనారిటీ డాక్టర్లకు ఇబ్బందులు వస్తాయంటున్నారు. డీఎంఈ సొంత నిర్ణయాల వలన ప్రతి ఊరికి ఓ డాక్టర్ ఉండాలనే సీఎం గొప్ప ఆశయం అడియాశలుగా మిగులుతుందన్నారు. కొత్తగా అందుబాటులోకి రాబోతున్న పల్లె దవాఖానాలలో పని చేసేందుకు కనీసం ఒక్క డాక్టర్ కూడా ముందుకు రాని పరిస్థితి ఏర్పడుతుందని వివరించారు.

ప్రభుత్వ డాక్టర్లకు నష్టం..

కరోనా కష్టకాలంలో ప్రైవేటు సెక్టార్​లు చేతులెత్తిసినా, ప్రభుత్వ ఇన్ సర్వీస్ వైద్యులు మాత్రం తోటి డాక్టర్లు ప్రాణాలు కోల్పోయినా, ప్రజలను కాపాడేందుకు వెనకడలేదు. దీంతో పాటు ప్రస్తుతం వ్యాక్సినేషన్ అంశంలోనూ సమర్ధవంతంగా విధులు నిర్వర్తిస్తున్నారు. ప్రైమరీ హెల్త్ కేర్ సర్వీసెస్ లో దేశంలోనే మన తెలంగాణ రాష్ట్రాన్ని మొదటి స్థానలో నిలబెట్టారు. అయితే సర్కార్​ డాక్టర్లకు పక్షాన ప్రభుత్వం నిలబడుతున్నా, డీఎంఈ డా రమేష్​రెడ్డి అడ్డుకుంటున్నట్లు ప్రభుత్వ వైద్యులే ఆరోపిస్తున్నారు. ఇన్​ సర్వీస్​ కోటాలో కేవలం క్లినికల్​ 20 శాతం, నాన్​క్లినికల్ విభాగంలోని 30 శాతం ఇవ్వడం వలన ఎక్కువ మందికి పీజీ చేసే సదుపాయం ఉండదన్నారు. ఎంబీబీఎస్​ పూర్తి చేసి ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 600 మంది డాక్టర్లు గ్రామీణ ప్రాంతాల్లో వైద్యసేవలు అందిస్తున్నారని, సీట్లు కేటాయింపు తక్కువుంటే వారంతా పీజీని ఎప్పుడూ పూర్తి చేయాలని డాక్టర్లు మండిపడుతున్నారు.

క్లినికల్​ కు 20, నాన్​ క్లినికల్​కు 30..

రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో సుమారు 900 , ప్రైవేట్​ లో మరో 1117 పీజీ సీట్లు ఉన్నాయి. వీటిలో ప్రభుత్వ కాలేజీల్లోని సగం సీట్లను నేషనల్ పూల్‌ విధానంలో, మరో సగం సీట్లను రాష్ట్ర కోటాలో భర్తీ చేస్తారు. ప్రైవేటు కాలేజీల్లోని సగం సీట్లను మేనేజ్‌మెంట్‌ కోటా, మరో సగం సీట్లను కన్వీనర్ కోటాలో భర్తీ చేస్తారు. అయితే ఇన్ సర్వీస్ కోటా అమలు విధానంలో ప్రభుత్వ కాలేజీల్లోని స్టేట్ కోటా సీట్లు, ప్రైవేటు కాలేజీల్లోని కన్వీనర్ కోటా సీట్లలో 20 శాతం క్లినికల్​ కు, మరో 30 శాతం నాన్​ క్లినికల్​ విభాగాలకు కేటాయిస్తారు. ఇన్​ సర్వీస్​ కోటాలో పీజీ పూర్తి చేస్తే, 5 సంవత్సరాల పాటు ప్రభుత్వ హాస్పిటల్స్​ లో పనిచేయాలనేది నిబంధన వర్తిస్తుంది.

వీరే అర్హులు..

ట్రైబల్ ఏరియాలోని ప్రభుత్వాసుపత్రుల్లో రెండేళ్ల పాటు పనిచేసినోళ్లు, గ్రామీణ ప్రాంతాల్లో మూడేండ్లు, అర్బన్​ లో ఆరేళ్లు పాటు వైద్యసేవలు అందించిన వారికి ఇన్​ సర్వీస్​ కోటా రిజర్వేషన్లు కల్పిస్తారు. అయితే వీరు నీట్​ పరీక్షలో కనీసం 50 శాతం మార్కులు సాధించాలి. దీంతో పాటు ఐదేళ్ల పాటు సర్కార్​ దవాఖాన్లలో పనిచేస్తానని ముందస్తుగానే అంగీకార పత్రాన్ని ఇవ్వాల్సి ఉంటుంది. ఒకవేళ నిబంధనలు ఉల్లంఘిస్తే భారీ స్థాయిలో జరిమానా విధించే అవకాశం ఉన్నది.

డీఎంఈ నియంతృత్వంతోనే ఈ పరిస్థితి: డా కత్తి జనార్ధన్​

డీఎంఈ నియంతృత్వంతోనే పీజీ ఇన్​సర్వీస్ కోటాలో నష్టం జరిగేలా జీవో 155 ని విడుదల చేశారు. దాన్ని వెంటనే రద్దు చేసి గతంలో ఉన్న జీవో ఎంఎస్ నెంబర్ 27 మాదిరిగానే ఎలాంటి మార్పులు చెయ్యకుండా పునరుద్ధరింప చేయాలి. కుట్రపూరితంగా వ్యవహరించి ప్రభుత్వ పెద్దలను తప్పుదోవ పట్టించిన కమిటీ మెంబర్లు డీఎంఈ రమేష్ రెడ్డి, వీసీ కరుణాకర్ రెడ్డి లను వెంటనే బర్తరఫ్ చేయాలి. లేకుంటే ప్రభుత్వ వైద్యులంతా సోమవారం నుంచి అన్ని జిల్లాల డీఎంహెచ్​ఓలకు మూకుమ్మడిగా సెలవు పత్రాలు అందజేసి, జీవో 27 యదావిధిగా పునరుద్ధరింప చేసే వరకు పోరాటం చేస్తామని హెచ్చరించారు.

నిరుద్యోగులకు షాకింగ్ న్యూస్.. TSPSC నోటిఫికేషన్లకు బ్రేకులు..!

Next Story