సిరిసిల్లకు వరద.. హుజూరాబాద్​కు పరదా.. ఎందుకీ వివక్ష..?

by  |
సిరిసిల్లకు వరద.. హుజూరాబాద్​కు పరదా.. ఎందుకీ వివక్ష..?
X

దిశ, తెలంగాణ బ్యూరో : రాష్ట్రంలోని అసెంబ్లీ నియోజకవర్గాల అభివృద్ధిపై ప్రభుత్వం పక్షపాత ధోరణి అవలంబిస్తున్నదని విపక్షాలు తరచూ ఆరోపణలు చేస్తుంటాయి. అధికార పార్టీ ఎమ్మెల్యేలు ఉన్న చోట ఎక్కువ నిధులను మంజూరు చేస్తూ ప్రతిపక్ష పార్టీలు ఉన్న సెగ్మెంట్లను నిర్లక్ష్యం చేస్తూ ఉన్నదని అసెంబ్లీ వేదికగానే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. లోతుల్లోకి వెళ్లి చూస్తే టీఆర్ఎస్ నేతలు ‘యువరాజు’గా చెప్పుకునే కేటీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న సిరిసిల్ల నియోజకవర్గానికి ఏడేళ్లలో రూ.158 కోట్లు మంజూరైతే పార్టీలో సీనియర్ నేతగా ఉన్న ఈటల రాజేందర్ ప్రాతినిధ్యం వహించే హుజూరాబాద్‌‌కు మాత్రం రూ.38 కోట్లే మంజూరు చేశారు.

ప్రస్తుతం హుజూరాబాద్ అసెంబ్లీ ఉప ఎన్నిక జరుగుతున్న నేపథ్యంలో ఏడేళ్లలో తన సెగ్మెంట్​కు సీఎం నిధులు కేటాయించలేదంటూ బీజేపీ తరపున పోటీ చేస్తున్న ఈటల రాజేందర్ ఆరోపిస్తుండగా, చొరవ తీసుకుని ముఖ్యమంత్రి దగ్గరి నుంచి రాబట్టుకోవడంలో ఈటల విఫలమయ్యారని మంత్రి హరీశ్‌రావు పేర్కొంటున్నారు. ఎవరి ఆరోపణలు ఎలా ఉన్నా సిరిసిల్లతో పోలిస్తే హుజూరాబాద్‌కు ఏడేళ్లలో విడుదలైంది తక్కువేనని గణాంకాలు తెలియజేస్తున్నాయి. అయినవారికి ఆకుల్లో కానివారికి కంచాల్లో పెడుతున్నారన్న విపక్ష నేతల విమర్శలకు ఈ గణాంకాలు బలం చేకూర్చుతున్నాయి. ఈ రెండు నియోజకవర్గాలకు కేటాయించిన ‘స్పెషల్ డెవలప్‌మెఐంట్ ఫండ్’ను పరిశీలిస్తే విస్తుపోయే నిజాలు వెలుగులోకి వచ్చాయి.

నిధుల వరద ఇలా..

గ్రామాల్లో స్వయంసహాయక మహిళా బృందాలకు భవనాల నిర్మాణం, రెవెన్యూ గ్రామాల్లో సీసీ రోడ్లు, కులాలవారీగా కమ్యూనిటీ హాళ్ళ నిర్మాణం, మురుగునీటి కాల్వల నిర్మాణం, ఆర్వో వాటర్ ప్లాంట్లు.. ఇలా ఏడేళ్ళ కాలంలో సిరిసిల్లలో భారీ స్థాయిలో ప్రభుత్వం నిధులను కేటాయించింది. పనులు కూడా అదే స్థాయిలో జరిగాయి. ఇతర నియోజకవర్గాలతో పోలిస్తే సిరిసిల్లలో కార్పొరేట్ విద్యా సంస్థలను తలదన్నేలా ప్రభుత్వ స్కూళ్ళు, హాస్టళ్లు రోడ్లు, వివిధ కులాలకు కమ్యూనిటీ హాళ్లు. ఇలా అద్భుతమైన ప్రగతి ఉన్నదని ప్రభుత్వమే గొప్పగా చెప్పుకుంటున్నది. మంత్రి కేటీఆర్ సైతం తన నియోజకవర్గంలోని పనులను ట్విట్టర్ ద్వారా ప్రజలకు తెలిసేలా పోస్టు చేస్తున్నారు. కానీ ఇతర నియోజకవర్గాల్లో ఆ స్థాయి అభివృద్ధి కనిపించకపోవడంపై ఎమ్మెల్యేలలో అసంతృప్తి ఉన్నది. ఇప్పుడు హుజూరాబాద్ అసెంబ్లీ ఉప ఎన్నిక సందర్భంగా ఇదే పెద్ద చర్చనీయాంశంగా మారింది.

ఏడేళ్ళలో సిరిసిల్ల నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధి..

2014-15లో సిరిసిల్లకు కేటాయించిన నిధులు : రూ. 77.67 కోట్లు

ఇందులో ఖర్చయింది : రూ. 68.41 కోట్లు

మొత్తం పనుల సంఖ్య : 2136

2015-21 (జూన్) నిధుల కేటాయింపు : రూ. 81.03 కోట్లు

ఇందులో ఖర్చయింది : రూ. 38.33 కోట్లు

మొత్తం పనులు : 1960

కొనసాగుతూ ఉన్న పనులు : 95

మొదలు కావాల్సిన పనులు : 81

హుజూరాబాద్ నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధి..

2014-21లో హుజూరాబాద్‌కు కేటాయించిన నిధులు : రూ. 33.80 కోట్లు

ఇందులో ఖర్చయింది : రూ. 16.54 కోట్లు

మొత్తం పనుల సంఖ్య : 1032

ఇందులో పూర్తయినవి : 508

ప్రస్తుతం జరుగుతున్న పనులు : 184

ఇంకా మొదలేకాని పనులు : 340

Next Story

Most Viewed