ఆ పంటలకు ప్రభుత్వం ప్రోత్సాహం

by  |
ఆ పంటలకు ప్రభుత్వం ప్రోత్సాహం
X

దిశ ప్రతినిధి, రంగారెడ్డి: ఉద్యాన పంటల సాగుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సాహం కల్పిస్తోంది. సన్న, చిన్నకారు రైతులకు రాయితీలు అందిస్తున్నది. జిల్లాలో అనువైన నేలలు, నీటి వనరుల ఆధారంగా రైతులను ఎంపిక చేసేందుకు దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఉద్యాన పంటలను సాగు చేసేందుకు ముందుకు వచ్చే రైతులకు 50శాతం రాయితీతో రాష్ట్రీయ కృషి వికాస యోజన పథకం, క్రిటికల్‌ ఇంటర్వెన్షస్‌ పథకాలను ప్రవేశపెడుతుంది. రాష్ట్రీయ కృషి వికాస యోజన పథకం ద్వార శాశ్వత పందిర్లు, మల్చింగ్‌, వేసవిలో కూరగాయల ఉత్పత్తికి రాయితీలు ఇవ్వనున్నారు. అదేవిధంగా జీడిమెట్లలోని సెంటర్‌ ఆఫ్‌ ఎక్స్‌లెన్స్‌ ఇనిస్టిట్యూట్‌లో నారు పంటలకు నారులు పంపిణీ చేయనున్నారు.

శాశ్వత పందిళ్లు

తీగ జాతి కూరగాయలు పండించేందుకు శాశ్వత పందిళ్లు ఏర్పాటు చేయనున్నారు. ఇందు కోసం ఉద్యానశాఖ 50 శాతం రాయితీ ఇవ్వనుంది. అరఎకరం నుంచి 2.5 ఎకరాల భూమి కలిగిన రైతుకు ఈ పథకం వర్తించనుంది. జిల్లాలో 161 యూనిట్లు ఇచ్చేందుకు ప్రభుత్వం లక్ష్యాన్ని నిర్దేశించింది.

మల్చింగ్‌…

మల్చింగ్‎లో భాగంగానే హెక్టార్‌కు రూ.16వేల చొప్పున 2 హెక్టార్ల వరకు ఇస్తుంది. ఇందులో 50శాతం ప్రభుత్వం భ రించనుంది. జిల్లాలో 106 హెక్టార్ల లక్ష్యాన్ని కేటాయించగా, షెడ్యూల్‌ కులాలకు 16 హెక్టార్లు, షెడ్యూల్‌ తెగలకు 10 హెక్టార్లు, ఇతరులకు 80 హెక్టార్లు కేటాయించారు.

తుంపర,బిందు సేద్యానికి ..

బిందు, తుంపర సేద్యంతో, షేడ్‌ నెట్‌, మల్చింగ్‌ను ఉపయోగిస్తూ పంటను పండించేందుకు 75 శాతం రాయితీని ప్రభుత్వ కల్పిస్తోంది. ఇందుకు 2 ఎకరాల వరకు ఉన్న రైతులే లబ్ధిదారులు. అయితే ఎకరాకు రూ.1,20,600 ఇవ్వనున్నారు. జిల్లాలో 3 ఎకరాలే లక్ష్యాన్ని ఇచ్చారు. క్రిటికల్‌ ఇంటర్వెన్షన్‌(అరుదైన పంటలు) పథకంలో భాగంగా టమాట, వంగ, పచ్చిమిర్చి, ఎండు మిర్చి, క్యాప్సికం, కూ రగాయ నారులు ఇవ్వనున్నారు. ఈ నారుకు ఎకరాకు రూ.8 వేల వరకు ఖర్చవుతుంది. దీనికి ప్రభుత్వం 90 శాతం రాయితీపై ఒక్కో రైతుకు 2 ఎకరాల వరకు నారు ఇవ్వనున్నది.

కానీ, రైతు భరించాల్సిన ఖర్చు రూ.800లతో టమాట, వంగ నారుకు ఎకరాకు 8000 మొక్కలు ఇవ్వనున్నారు. అదే పచ్చి మిర్చి, ఎండుమిర్చి, క్యాప్సికం అయితే ఎకరాకు 6400 మొక్కలు పంపిణీ చేయనున్నారు. ఈ పథకంలో నారు కావాల్సిన రైతులు 45 రోజుల ముందుగానే స్థానిక ఉద్యానవన శాఖాధికారి ద్వారా జిల్లా అధికారికి నారు పేరు, వివరాలను తెలియజేయాల్సి ఉంటుంది. అప్పుడు రైతులు నాన్‌ సబ్సిడీ రూ.800ల డీడీని అడిషనల్‌ డైరెక్టర్‌ హార్టికల్చర్‌ జీడిమెట్ల పేరుతో తీసి దరఖాస్తు చేసుకునే ఫారానికి జత చేయాలి. జిల్లాలో మొత్తం 107 ఎకరాలు లక్ష్యాన్ని నిర్దేశించింది. ఇందులో 18 ఎకరాలు షెడ్యూల్‌ కులాలు, 10 ఎకరాలు షెడ్యూల్‌ తెగలకు, మిగిలిన 79 ఎకరాలు ఇతరులకు కేటాయించింది.

రైతులు సంప్రదించాల్సిన అధికారుల వివరాలు..

బాలాపూర్‌, సరూర్‌నగర్‌, శంషాబాద్‌, మహేశ్వ రం, కందుకూర్‌, శేరిలింగంపల్లి, రాజేంద్రనగర్‌, గండిపేట, అబ్దుల్లాపూర్‌మెట్‌, హయత్‌నగర్‌, మం చాల, కడ్తాల్‌, ఇబ్రహీంపట్నం, యాచారం, మా డ్గుల, ఆమన గల్లు మండలాల రైతులు ఉద్యానవన అధికారి బి. క నకలక్ష్మీ (7997725239)ని సంప్రదించాలి. మొయినాబాద్‌, శంకర్‌పల్లి, చేవెళ్ల, షాబాద్‌, శేరిలింగంపల్లి, రాజేంద్రనగర్‌, గండిపేట రైతులు.. స్వరూప్ కుమార్ (7997725424)ని సంప్రదించాలి. షాద్‌నగర్‌, కేశంపేట, కొత్తూరు, నందిగామ, చౌద ర్‌గూడెం, కొందుర్గు, తలకొండపల్లి మండలాలవారు టి. ఉషారాణి (799772 5243)ని సంప్రదించాలి.

రైతులు రాయితీలు పొందాలి: సునందరెడ్డి, జిల్లా ఉద్యాన, పట్టు పరిశ్రమ అధికారి

ఉద్యానవన శాఖ ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం రైతులకు ప్రభుత్వం రాయితీ కల్పిస్తోంది. అందులో భాగంగానే ఈ ఆర్థిక సంవత్సరానికి జిల్లాలో ఇవ్వాల్సిన రాయితీలను సిద్ధం చేశాం. అర్హులైన రైతులు దరఖాస్తు చేసుకొని రాయితీని పొందాలి. అతి తక్కువ పెట్టుబడితో అధిక దిగుబడి వచ్చే పంటలకు ప్రభుత్వం ప్రోత్సాహం కల్పిస్తోంది. రంగారెడ్డి జిల్లాలో చాలా మంది కూరగాయలు, పండ్ల తోటలపై ఆధారపడి జీవిస్తుంటారు. వీరి కోసం ప్రత్యేక ప్రణాళిక రూపొందించాం

Next Story

Most Viewed